సీఎం జగన్ సవతి తల్లి ప్రేమ - సొంత జిల్లాకు 32 పనులు, ఉత్తరాంధ్రకు కేవలం 8 మాత్రమే - ఇదెక్కడి న్యాయం?

సీఎం జగన్ సవతి తల్లి ప్రేమ - సొంత జిల్లాకు 32 పనులు, ఉత్తరాంధ్రకు కేవలం 8 మాత్రమే - ఇదెక్కడి న్యాయం?
PMGSY Sanctioned Works in Andhra Pradesh: ఉత్తరాంధ్రపై సీఎం జగన్ చూపిస్తున్న ప్రేమ ఉత్తుత్తిదేనా అంటే అవుననే వాదనలే వినిపిస్తున్నాయి. తాజాగా ఈ విషయం పీఎంజీఎస్వై-3 పనుల కేటాయింపులతో మరోసారి స్పష్టం అయ్యింది. సీఎం జగన్ సొంత జిల్లాకు 32 పనులు కేటాయించగా.. ఉత్తరాంధ్ర మూడు జిల్లాలకు మాత్రం కేవలం 8 పనులే కేటాయించారు. దీంతో ఉత్తరాంధ్రపై జగన్కు ఉన్నది నిజమైన ప్రేమ కాదా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
PMGSY Sanctioned Works in Andhra Pradesh: అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసమే 3 రాజధానులు నిర్ణయమని సీఎం జగన్ పదే పదే ఊదరగొడుతున్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసమే విశాఖను రాజధానిగా ప్రకటించామని చెబుతుంటారు. ఉత్తరాంధ్రపై మరీ అంత ప్రేమ ఉంటే.. ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన పనుల్లో ఎందుకు అన్యాయం చేశారో ఆయనే చెప్పాలి. సొంత జిల్లాకు 30కు పైగా పనులు కేటాయించిన జగన్.. ఉత్తరాంధ్ర ఉమ్మడి జిల్లాలకు మాత్రం కేవలం 8 పనులే ఇచ్చారు అంటేనే.. ముఖ్యమంత్రికి ఉత్తరాంధ్రపై ఉన్నది ఉత్తుత్తి ప్రేమేనన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
ఉత్తరాంధ్ర వెనుకబాటుతనంపై పదేపదే మాట్లాడే ముఖ్యమంత్రి జగన్.. ఆ ప్రాంత అభివృద్ధిపై మాత్రం చిన్నచూపు చూస్తున్నారు. ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన పనులే దానికి నిదర్శనం. PMGSY-3లో (Pradhan Mantri Gram Sadak Yojana) మొదటి బ్యాచ్ కింద 2023-24 సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వం 115 రోడ్లు, 72 వంతెనల నిర్మాణ పనులకు వెయ్యి 45 కోట్ల 44 లక్షలకు పరిపాలన అనుమతులిచ్చింది.
ఇందులో బ్యాచ్-1 కింద 187 రోడ్లు, వంతెనల పనులకు అనుమతులిస్తూ జీవో ఇచ్చింది. వీటిలో 576 కోట్ల 15 లక్షలతో 916.22 కిలోమీటర్ల పొడవైన 115 రోడ్లు, 4వందల 69 కోట్ల 29 లక్షలతో 72 వంతెనలు ఉన్నాయి. మంజూరు చేసిన 115 రహదారుల పనుల్లో తన సొంత జిల్లాకే సీఎం జగన్ 32 కేటాయించుకున్నారు. వెనుకబడిన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ మూడు జిల్లాలకు కలిపి కేవలం 8 పనులుతో సరిపెట్టారు. అంటే.. మొత్తం పనుల్లో ఉమ్మడి కడప జిల్లాకు 27.87 శాతం ఇచ్చుకున్న జగన్.. ఉత్తరాంధ్రలో మూడు జిల్లాలకు కలిపి 6.9 శాతం పనులే కేటాయించారు.
జగన్ పాలనలో ఉత్తరాంధ్ర ఎంతో అభివృద్ధి చెందుతోందని ప్రతి సభలోనూ గొంతు చించుకునే మంత్రులు ధర్మాన ప్రసాదరావు, సీదిరి అప్పలరాజుల సొంత జిల్లా అయిన ఉమ్మడి శ్రీకాకుళానికి కేవలం ఒకే ఒక్క రోడ్డు పనిని ప్రభుత్వం కేటాయించింది. మరో మంత్రి బూడి ముత్యాలనాయుడి సొంత జిల్లా ఉమ్మడి విశాఖపట్నానికి రెండు రోడ్ల పనులు మాత్రమే ఇచ్చారు. మంత్రి బొత్స సత్యనారాయణ సొంత జిల్లా విజయనగరానికి కంటితుడుపుగా 5 రోడ్ల పనులను మాత్రమే కేటాయించారు.
ఉత్తరాంధ్రపై సవతి తల్లి ప్రేమ చూపిస్తున్న జగన్ సర్కార్.. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సొంత జిల్లా ఉమ్మడి చిత్తూరుకు మాత్రం అధికంగా 15 పనులు కేటాయించారు. అంటే.. జగన్, పెద్దిరెడ్డిల సొంత జిల్లాల్లోనే రోడ్లు పాడయ్యాయా..? కేంద్రం కేటాయించిన రహదారుల పనులు వీరి జిల్లాలకేనా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మిగతా జిల్లాల్లో మోకాలు లోతులో గుంతలు పడిన రోడ్లతో గ్రామీణ ప్రజలు పడుతున్నా అవస్థలు కనిపించడం లేదా అనే వాదనలు వినిపిస్తున్నాయి.
