మంత్రి అమర్‌నాథ్‌ కనుసన్నల్లో భూదందాలు.. సీబీఐ విచారణకు జనసేన డిమాండ్‌

author img

By

Published : Jan 20, 2023, 10:45 AM IST

JANASENA ALLEGATIONS ON MINISTER AMARNATH

JANASENA ALLEGATIONS ON MINISTER AMARNATH: మంత్రి అమర్‌నాథ్‌.. అనకాపల్లి నియోజకవర్గం కశింకోట మండలం విస్సన్నపేటలో 600 ఎకరాలు భూ దోపిడీకి పాల్పడ్డారని.. జనసేన నేతలు ఆరోపించారు. దీని వెనక చాలా మంది పెద్దలు ఉన్నారన్నారు. స్థానిక రైతులను బెదిరించి భూములు లాక్కొని లేఅవుట్‌లు వేస్తున్నారని.. అన్ని నిబంధనలను ఉల్లంఘించారని చెప్పారు. విశ్రాంత న్యాయమూర్తితో విచారణ జరిపించాలని జనసేన నేతలు డిమాండ్‌ చేశారు.

JANASENA LEADERS ALLEGATIONS ON MINISTER AMARNATH : విశాఖ నగరంలో ప్రభుత్వ భూములను మింగేసిన వైసీపీ నాయకులు ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలపై పడ్డారని అనకాపల్లి జిల్లా జనసేన పార్టీ నేతలు డి.గోపి, గోవింద్‌ ఆరోపించారు. ఈ భూదందాలన్నీ స్థానిక మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ కనుసన్నల్లోనే జరుగుతున్నాయని ఆరోపించారు. విశాఖలో గురువారం విలేకరులతో వారు మాట్లాడారు.

‘కశింకోట మండలం బయ్యవరం రెవెన్యూ పరిధి విస్సన్నపేటలోని సర్వేనంబరు 195/2లో 609 ఎకరాలను రైతుల నుంచి బలవంతంగా కొన్నారు. అమ్మడానికి ఇష్టపడని రైతుల ఖాతాలను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టి ఇబ్బందుల్లోకి నెట్టి వారే స్వయంగా భూములు అమ్ముకునేలా ఒత్తిడి తెచ్చారు. ఈ క్రమంలో ప్రభుత్వ భూములనూ ఆక్రమించారు. గెడ్డలు కప్పేశారు. కొండలను పిండి చేశారు. వీటిపై పత్రికల కథనాల ఆధారంగా లోకాయుక్త సుమోటోగా కేసు నమోదు చేసి విచారణకు ఆదేశించింది.

మంత్రికి చెందిన రియల్‌ వెంచర్‌ అయినందున చర్యలకు అధికారులెవరూ సాహసించడం లేదు. స్థానిక తహసీల్దారును బదిలీ చేయాలని గతంలోనే ఏసీబీ డీజీ స్థాయి అధికారి సిఫార్సు చేసినా.. వైకాపాకు అనుకూలంగా ఉన్నారని చర్యలు తీసుకోలేదు. ఇక్కడి భూములను వైకాపా ముఖ్య నాయకుడి సన్నిహితుడికి చెందిన ఒక సంస్థ వారు కొన్నారు. ఈ వ్యవహారాల్లో మంత్రి అమర్‌నాథ్‌తోపాటు గవర కార్పొరేషన్‌ మాజీ ఛైర్మన్‌ బొడ్డడ ప్రసాద్‌, మరో మంత్రి మేనల్లుడి పాత్ర ఉంది.

జిరాయితీ భూముల్లో స్థిరాస్తి వ్యాపారానికి అన్ని అనుమతులు కావాలి. ఈ భారీ లేఅవుట్‌కు ఎలాంటి అనుమతులు లేకుండానే బ్రోచర్లు విడుదల చేశారు. వీటిని ఎవరైనా కొంటే నష్టపోతారు. ఈ భూములే కాదు.. అనకాపల్లిలోని తుమ్మపాల చక్కెర కర్మాగారం, దేవాదాయ భూములనూ దోచుకోవడానికి చూస్తున్నారు’ అని జనసేన నేతలు ఆరోపించారు. ఈ భూదందాలపై మంత్రి బహిరంగ చర్చకు వస్తే సిద్ధంగా ఉన్నామన్నారు. మంత్రి అమర్‌నాథ్‌ పాత్ర ఉన్న ఈ భూఅక్రమాలపై సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు.

400 ఎకరాల్లో మౌంట్‌ విల్లాలు..

విస్సన్నపేటలో వైకాపా నాయకులు వేస్తున్న లేఅవుట్‌లో 400 ఎకరాల్లో మౌంట్‌ విల్లాలు నిర్మించి విక్రయించనున్నారని, ఈ మేరకు ఓ వ్యాలీ పేరిట బ్రోచర్‌ విడుదల చేసినట్లు తెలిసిందని జనసేన నేతలు ఆరోపించారు. ‘ఈ వ్యాలీకి వెళ్లే మార్గంలోనే ప్రభుత్వ, అసైన్డ్‌ భూములు కలిపి పదెకరాలు ఆక్రమించినట్లు అధికారులే గుర్తించారు. అవి ప్రభుత్వ భూములని ఇటీవల హెచ్చరిక బోర్డులనూ ఏర్పాటుచేశారు.

వాటిని మరుసటి రోజే తొలగించారు. దీనికి లేఅవుట్‌ వేయడానికి ముందు భూవినిమయ స్థితిని మార్చాలి. ఇందుకోసం నాలా రూపంలో ప్రభుత్వానికి రుసుం చెల్లించాలి. వీఎంఆర్డీఏ అనుమతులూ ఉండాలి. అవేవీ జరగకుండానే విల్లాలు నిర్మిస్తామంటూ విక్రయానికి సిద్ధమవుతున్నారు’ అని వారు ఆరోపించారు. దీనిపై కశింకోట తహసీల్దారు సుధాకర్‌ వద్ద ప్రస్తావించగా.. భూవినిమయ స్థితి మార్పు ఇంకా కాలేదని, లోకాయుక్త ఆదేశాల గురించి తనకు తెలియదని అన్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.