ఫిషింగ్ హార్బర్ ప్రమాదంపై విచారణకు ఆదేశించిన సీఎం - మత్స్యకార్మికులను ఆదుకోవాలన్న లోకేశ్

ఫిషింగ్ హార్బర్ ప్రమాదంపై విచారణకు ఆదేశించిన సీఎం - మత్స్యకార్మికులను ఆదుకోవాలన్న లోకేశ్
CM Jagan Reacts on Vizag Fishing Harbour Fire: విశాఖ ఫిషింగ్ హార్బర్లో అర్ధరాత్రి జరిగిన అగ్నిప్రమాదంపై సీఎం జగన్, నారా లోకేశ్, పవన్ కల్యాణ్ స్పందించారు. ప్రమాద ఘటనపై లోతైన దర్యాప్తు చేయాలని ముఖ్యమంత్రి జగన్ అధికారులను ఆదేశించారు. ప్రమాద ఘటన దురదృష్టకరమని, మత్య్సకారులను ప్రభుత్వమే ఆదుకోవాలని పవన్, లోకేశ్ డిమాండ్ చేశారు.
CM Jagan Reacts on Vizag Fishing Harbour Fire: విశాఖ ఫిషింగ్ హార్బర్లో అర్ధరాత్రి జరిగిన అగ్నిప్రమాదం మత్స్యకారులకు వేదన మిగిల్చింది. ఈ ఘటనలో 30కి పైగా బోట్లు ఆహుతయ్యాయని.. తమకు ఉపాధి ప్రశ్నార్థకమైందని జాలర్లు కన్నీటి పర్యంతమవుతున్నారు. బోటులో కొందరు యువకులు పార్టీ చేసుకున్నారని.. తొలుత అందులో మంటలు చెలరేగి.. కొద్దిక్షణాల్లోనే పక్క బోట్లకు వ్యాపించాయని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై లోతైన దర్యాప్తు చేయాలని ముఖ్యమంత్రి జగన్ అధికారులను ఆదేశించారు.
మత్స్యకారుల ఆందోళన: అగ్నిప్రమాదంలో 25 నుంచి 30 కోట్ల వరకూ ఆస్తి నష్టం వాటిల్లిందని అంచనా వేస్తున్నారు. బోట్ ఓనర్లు, కళాసీలు, మత్స్యకారులు ఉపాధి కోల్పోయామని బోరున విలపించారు. ప్రభుత్వమే ఆదుకోవాలని వేడుకున్నారు. ఘటనా స్థలానికి చేరుకుని జాలర్లను ఓదార్చిన మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జి.. ప్రభుత్వం అదుకోకపోతే.. మత్స్యకార కుటుంబాలు రోడ్డున పడతాయన్నారు. అగ్నిప్రమాద ఘటనలో బాధితులకు న్యాయం చేయాలని... హార్బర్ ప్రవేశ ద్వారం వద్ద మత్స్యకార నాయకులు ఆందోళన చేశారు. బాధితులను పరామర్శించేందుకు వచ్చిన మంత్రి సీదిరి అప్పలరాజు (Minister Seediri Appalaraju) వద్ద బాధితులు నినాదాలు చేశారు. తమకు న్యాయం చేయాలని.. తమ బోట్లు తగలబడి పోవడంతో రోడ్డున పడాల్సిన పరిస్థితి ఏర్పడిందని మత్య్సకారులు మంత్రికి విన్నవించుకున్నారు.
ప్రమాదంపై సీఎం జగన్ దిగ్భ్రాంతి: విశాఖ ఫిషింగ్ హార్బర్ (Visakha Fishing Harbour) ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం జగన్ (CM Jagan)... లోతైన దర్యాప్తు చేసి కారణాలు వెలికితీయాలని అధికారులను ఆదేశించారు. మత్స్యకారులకు తక్షణమే సాయం చేయాలని సీఎం సూచించారు. హార్బర్ ప్రమాద ఘటనపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) స్పందించారు. ప్రమాద ఘటన దురదృష్టకరమని, మత్య్సకారులను ప్రభుత్వమే ఆదుకోవాలని పవన్ డిమాండ్ చేశారు. బోట్లు ఆహుతైన ఘటనపై లోకేశ్ (Nara Lokesh) స్పందించారు. మత్స్యకారులను ప్రభుత్వం ఆదుకోవాలని, ఘటనకు కారణమైన వారిపై చర్యలు చేపట్టాలని లోకేశ్ డిమాండ్ చేశారు.
'విశాఖ ఫిషింగ్ హార్బర్లో అర్ధరాత్రి చెలరేగిన అగ్నికీలల్లో.. 30కి పైగా బోట్లు కాలిపోయాయి. తొలుత ఒక బోటుతో మొదలైన మంటలు... కొద్దిక్షణాల్లోనే హార్బర్లో నిలిపిఉన్న మిగతా బోట్లకు వ్యాపించాయి. మంటల్లో చిక్కుకున్న బోట్లలో సిలిండర్లు, నిల్వచేసిన ఇంధనం పేలుతుండటంతో.. మిగతా బోట్లను కాపాడేందుకు ఎవరూ సాహసం చేయలేకపోయారు. జీరో జెట్టిలో లంగర్ వేసి ఉన్న బోటులో కొందరు యువకులు ఆదివారం రాత్రి పార్టీ చేసుకున్నారని.. అందులోనే మొదట మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.'- విశాఖ సీపీ, రవిశంకర్
