విద్యుత్ చార్జీల పెంపు ప్రతిపాదనపై ప్రజాభిప్రాయ సేకరణ

author img

By

Published : Jan 19, 2023, 9:36 PM IST

APERC public opinion poll

APERC Public Opinion: సాధారణ విద్యుత్ వినియోగదారులపై సాధ్యమైనంత వరకు భారం పడకుండా చూస్తామని ఏపీఈఆర్సీ చైర్మన్ జస్టిస్ నాగార్జునరెడ్డి అన్నారు. సహేతుకమైన కారణాలతోనే బహిరంగ మార్కెట్‌లో స్వల్ప కాలిక విద్యుత్ కొనుగోలు కోసం ఈఆర్సీ అనుమతి ఇస్తోందని చెప్పారు. విద్యుత్ ఛార్జీల పెంపు ప్రతిపాదనలపై విశాఖలో వర్చువల్ విధానంలో ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించారు. ఫెర్రో అల్లాయిస్ కంపెనీల టారిఫ్‌లో మార్పులు చేయాలని నిర్ణయించారు. ప్రీపెయిడ్‌ మీటర్ల ప్రతిపాదనలపై రాష్ట్రంలో పలుచోట్ల వామపక్షాలు ఆందోళనకు దిగాయి.

APERC Public Opinion: ఫెర్రో అల్లాయిస్ కంపెనీలపై అమలు చేస్తున్న టారిఫ్​లో మార్పులు చేయాలని ఏపీఈఆర్సీ నిర్ణయించినట్లు చైర్మన్ జస్టిస్ సీవీ నాగార్జున రెడ్డి తెలిపారు. ప్రతిపాదనలను పరిశీలించి తుది నిర్ణయం తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. విద్యుత్ చార్జీల పెంపు ప్రతిపాదనపై విశాఖలో ఏపీఈఆర్సీ ఆధ్వర్యంలో ఏపీఈపీడీసీఎల్ కార్యాలయంలో ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించారు. వర్చువల్ విధానంలో మూడు రోజులపాటు జరిగే ఈ వేదిక ద్వారా వివిధ డిస్కంల పరిధిలో ఉన్న పలువురు అభిప్రాయాలను వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో 2023-24 ఆర్ధిక సంవత్సరానికి డిస్కమ్​లు ప్రతిపాదించిన విద్యుత్ టారిఫ్ ప్రతిపాదనలు వార్షిక ఆదాయ, వ్యయాలపై ఏపీ విద్యుత్ నియంత్రణ మండలి విచారణ చేసింది. విద్యుత్ పంపిణీ సంస్థలు సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్, తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థలు ప్రతిపాదించిన విద్యుత్ టారిఫ్​లతో పాటు ఆయా సంస్థల వార్షికాదాయ, వ్యయాలపై ఏపీఈఆర్సీ విచారణ చేపట్టింది. సరఫరా వ్యయం, సమగ్ర ఆదాయ ఆవశ్యకత, టారిఫ్ ద్వారా రాబడి, విద్యుత్ కొనుగోలు వ్యయం, పంపిణీ ఖర్చు తదితర అంశాలను ఏపీఈఆర్సీకి విద్యుత్ పంపిణీ సంస్థలు సమర్పించాయి.

సాధారణ వినియోగదారులపై భారం ఉండదు : సాధ్యమైనంత మేర వినియోగదారులపై భారం పడకుండా ఏపీఈఆర్సీ చూస్తోందని సీవి నాగార్జున రెడ్డి తెలిపారు. వివిధ వర్గాలకు ప్రభుత్వం విద్యుత్ సబ్సిడీ భరించడం కొత్త కాదని పేర్కొన్నారు. సబ్సిడీ ఇవ్వాలని విద్యుత్ పంపిణీ సంస్థలు నేరుగా ప్రభుత్వానికి చెప్పలేవన్నారు. అందుకే ఫుల్ కాస్ట్ చార్జీలను వార్షిక ఆదాయ వ్యయాల పట్టికలో పేర్కొన్నాయన్నారు. విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించి చాలా ప్రతిపాదనలను ఈఆర్సీ తిరస్కరించిందని వెల్లడించారు.

వామపక్షాల ఆందోళన : ప్రజాభిప్రాయ సేకరణ సమయంలో కార్యాలయం బయట వామపక్షాలు ఆందోళన నిర్వహించాయి. ప్రీపెయిడ్‌ స్మార్ట్‌ మీటర్లు పెట్టి ప్రజలపై భారాలు వేయొద్దని.. విద్యుత్‌ వినియోగదారులకు నష్టం చేసే చర్యలను ఈఆర్సీ తిరస్కరించాలని డిమాండ్‌ చేశాయి. రాష్ట్రంలోని కోటి 89 లక్షల మంది వినియోగదారులకు, నివాస గృహాలు, కార్యాలయాలు, వ్యాపార సంస్థలు అన్నిటికీ 2025 మార్చి లోపల ప్రీపెయిడ్‌ స్మార్ట్‌ మీటర్లు పెట్టాలనే ప్రతిపాదన వినియోగదారులపై తీవ్రమైన భారాన్ని మోపుతుందని ఆరోపించాయి. అధానీ లాంటి కార్పొరేట్‌ సంస్థల లాభాలకోసం విద్యుత్‌ సంస్కరణల అమలు తక్షణమే నిలిపివేయాలని సీపీఎం, సీపీఐ ఈఆర్సీని కోరాయి. ప్రజలపై భారాలు వేస్తే మరో విద్యుత్‌ ఉద్యమం చేపడతామని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు కె.లోకనాథం, సీపీఐ జిల్లా కార్యదర్శి ఎం.పైడిరాజు హెచ్చరించారు.

రూ.13వేల కోట్ల భారం : ఈ బడ్జెట్‌లో రూ.13వేల కోట్ల భారం ప్రజలపై వేస్తున్నారని, ప్రీపెయిడ్‌ స్మార్ట్‌ మీటర్లు, ట్రూ అప్‌ చార్జీల పేరుతో మరింత భారం మోపుతున్నారని విమర్శించారు. పేద, సామాన్య, మధ్యతరగతిపై పెనుభారాలు తక్షణమే తిరస్కరించాలని కోరారు. గ్రీన్‌ ఎనర్జీ పేరుతో 75వేల ఎకరాల భూమిని హైడ్రోజల్‌ కంపెనీకి కారుచౌకగా కట్టబెట్టడాన్ని ఈఆర్‌సీ రద్దు చేయాలని కోరారు. గృహవినియోగదారులకు ఉచిత విద్యుత్ 100 యూనిట్లకు పెంచాలని, ఎస్‌సి, ఎస్‌టి సామాజిక తరగతి కుటుంబాలకు 300 యూనిట్లకు పెంచాలని, వృత్తిదారులు, చిరువ్యాపారస్తులకు సబ్సిడీతో కూడిన విద్యుత్‌ అమలు చేయాలని డిమాండ్‌ చేశారు.

మోడీకి ఊడిగం చేస్తున్న జగన్ మోహన్ రెడ్డి : మోడీ ప్రభుత్వం తెచ్చిన విద్యుత్‌ సంస్కరణలు తూ.చా తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడాన్ని తీవ్రంగా దుయ్యబట్టారు. తన తండ్రి హామీలను అమలు చేస్తామని జగన్‌మోహన్‌రెడ్డి మోడీకి ఊడిగం చేస్తున్నారని దుయ్యబట్టారు. మీటర్ల ఖర్చు వినియోగదారులపై పడటమే కాకుండా, అడ్వాన్స్‌ సుమారు ఒక్కో మీటరుకు రు.13000 చెల్లించి విద్యుత్‌ను వినియోగించుకోవాలన్న నిర్ణయాన్ని వెనుక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఉన్న పోస్ట్‌ పెయిడ్‌ పద్ధతికి భిన్నంగా ఈ ప్రీపెయిడ్‌ పద్ధతి ప్రజలపై తీవ్రమైన భారం మోపుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.

ప్రజలు, పౌర సంఘాల నేతల అభ్యంతరాలు : ప్రజాభిప్రాయ సేకరణలో ప్రజలు, పౌర సంఘాల నేతలు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. అదానీ నుంచి కొనుగోలు చేసే విద్యుత్, త్వరలో పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టుల ద్వారా వచ్చే విద్యుత్ తో ఏపీలో 5 వేల మిలియన్ యూనిట్ల మిగులు వచ్చే అవకాశం ఉందని చెప్పారు. మిగులు విద్యుత్ ను ఏం చేస్తారో చెప్పాలని డిమాండ్‌చేశారు. ఏటా విద్యుత్ కొనుగోలు కోసం రూ.5 వేల కోట్లు వ్యయం చేస్తున్నట్టు డిస్కంలు చెప్పటం.. ఆ భారాన్ని ప్రజలపై వేస్తున్నారని విద్యుత్ రంగ నిపుణులు వేణుగోపాల రావు ఆక్షేపించారు. మిగులు ఉండగా బయట కొనుగోళ్లు చేసేందుకు కమిషన్ అనుమతి ఇవ్వడం ఏమిటని ఆరోపించారు.

రాష్ట్రవ్యాప్తంగా డిస్కమ్ లు ట్రాన్స్ ఫార్మర్లు, విద్యుత్ స్తంభాల కొరత ఉందంటూ రైతులకు వ్యవసాయ కనెక్షన్లను ఇవ్వటం లేదని సీపీఎం పార్టీ ఆక్షేపించింది. విద్యుత్ టారిఫ్ పై డిస్కమ్ లు ప్రతిపాదించిన అంశాలపై ఏపీఈఆర్సీ చేపట్టిన బహిరంగ విచారణకు హాజరైన నేతలు ట్రూఆప్ చార్జీల విధానాన్ని పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేశారు. విద్యుత్ పంపిణీ సంస్థలు ప్రతిపాదించిన 12,927 కోట్ల లోటును ప్రభుత్వ భరించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. మరోవైపు విద్యుత్ స్మార్ట్ మీటర్ల విషయంలోనూ ప్రతిపాదనల్ని తిరస్కరించాలని డిమాండ్ చేశారు. ప్రతీనెలా విద్యుత్ ఛార్జీలను సవరించాలనే ప్రతిపాదనను కూడా తిరస్కరించాలని సీపీఎం పార్టీ నేత సీహెచ్ బాబూరావు డిమాండ్ చేశారు.

ఏపీఈఆర్సీ విద్యుత్ చార్జీల పెంపు ప్రతిపాదన

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.