తితిదేలో డ్రోన్ దృశ్యాల కలకలం.. విచారణకు ఆదేశం.. భక్తుల్లో ఆందోళన
Updated on: Jan 22, 2023, 6:18 AM IST

తితిదేలో డ్రోన్ దృశ్యాల కలకలం.. విచారణకు ఆదేశం.. భక్తుల్లో ఆందోళన
Updated on: Jan 22, 2023, 6:18 AM IST
TTD drone cameras shot Update: ఆగమశాస్త్రం ప్రకారం తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే)పై ఎలాంటి వస్తువులు ఎగరడానికి వీలులేదని నిబంధన ఉంది. అయినా, డ్రోన్ కెమెరాతో బేడి ఆంజనేయ స్వామి ఆలయం నుంచి పశ్చిమ మాఢవీధి వరకు దృశ్యాలు చిత్రీకరించారు. శ్రీవారి ఆనంద నిలయం, ఆనంద నిలయ గోపురాలకు దగ్గరగా చిత్రీకరణ చేశారు. అయితే, నో ఫ్లై జోన్గా ఉన్న తిరుమలలో ఇలాంటి ఘటన చోటుచేసుకోవడంతో తితిదే భద్రతా సిబ్బందిపై పెద్ద ఎత్తున విమర్శలు తలెత్తుతున్నాయి.
TTD drone cameras shot Update: నో ఫ్లై జోన్ అయిన తిరుమల శ్రీవారి ఆలయ ప్రాంతాన్ని.. డ్రోన్ కెమెరాతో చిత్రీకరించినట్లుగా భావిస్తున్న దృశ్యాలు వెలుగులోకి రావడం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. సామాజిక మాధ్యమాల్లోని దృశ్యాలు.. ఆగమ శాస్త్ర నిబంధనలు ఉల్లంఘించడమే కాకుండా ఆలయ భద్రతను ప్రశ్నించేలా ఉండటంతో భక్తులు ఆందోళన చెందుతున్నారు. తి.తి.దే. భద్రతా సిబ్బంది వైఫల్యం అంటూ తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో డ్రోన్ దృశ్యాలు నిజమైనవో కాదో నిగ్గు తేల్చుతామని తి.తి.దే. ప్రకటించింది.
అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడిగా కోట్లాది ప్రజల పూజలందుకుంటున్నతిరుమల శ్రీనివాసుడి ఆలయానికి ఆధ్యాత్మికంగా ఎంతో విశిష్టత ఉంది. తిరుమల గిరులను సాక్షాత్తు దేవతల క్రీడాద్రి పర్వతాలుగా భావిస్తారు. అంతటి పవిత్రత కలిగిన శ్రీవారి ఆలయ పరిసరాల్లో ఆగమ శాస్త్రాల మేరకు విమానాలు వంటివి ఎగరడం నిషిద్ధం. కానీ శ్రీవారి ఆలయానికి అత్యంత దగ్గరగా విమాన ప్రాకారం అత్యంత స్పష్టంగా కనిపించే డ్రోన్ చిత్రాలు సామాజిక మాధ్యమాలలో వైరల్ కావడం దుమారం రేపుతోంది.
శ్రీవారి ఆలయ డ్రోన్ దృశ్యాలు బయటకు రావడం.. తిరుమల భద్రతపై అనేక సందేహాలకు తావిస్తోంది. తి.తి.దే. భద్రతా సిబ్బందితో పాటు అక్టోపస్ బలగాలు, S.P.F., A.R. సిబ్బంది, పోలీసులు నిత్యం విధులు నిర్వహిస్తుంటారు. ఆలయ పరిసరాల్లో ప్రతి చిన్న కదిలికలను సైతం పసిగడుతుంటారు. అలాంటిది ఏకంగా డ్రోన్తో దృశ్యాలు చిత్రీకరించడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సామాజిక మాధ్యమాల్లోని వీడియోను ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపి.. నివేదిక ఆధారంగా నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని తి.తి.దే. ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.
ఆరు నెలల క్రితం తిరుమలలో గ్యాస్ పైపు లైను, బయోగ్యాస్, యూడీఎస్ కోసం అవసరమైన సర్వే తితిదే నిర్వహించింది. సర్వే కోసం నవంబర్ 8న డ్రోన్లతో దృశ్యాలు చిత్రీకరించాలంటూ సదురు సంస్ధ తితిదేకి దరఖాస్తు చేసుకుంది. తితిదే అనుమతి మంజూరు చేయడంతో నవంబర్ 9న తిరుపతి నుంచి తిరుమలకు డ్రోన్లను తీసుకవచ్చారు. 10,11,12వ తేదీలలో తిరుమలలోని పలు ప్రాంతాలలో దృశ్యాలు చిత్రీకరించేందుకు అనుమతి ఇవ్వడంతో చిత్రీకరించారు. ఆ సమయంలోనే డ్రోన్తో శ్రీవారి ఆలయ దృశ్యాలు చిత్రీకరించారని ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. నిషేధిత ప్రాంతాలలో దృశ్యాలు చిత్రీకరించి సామాజిక మాధ్యమాలలో ఉంచడంతో ఆ దృశ్యాలు వైరలయ్యాయి. ఆలయంపై డ్రోన్లతో దృశ్యాలు చిత్రీకరిస్తున్నా పహరా కాసే భద్రతా సిబ్బంది ఏమి చేశారన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఆగమ శాస్త్రాలను అనుసరించి సప్తగిరుల్లో విమానాల రాకపోకలు నిషేధమని ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు తెలిపారు. తి.తి.దే. వినతి మేరకు కేంద్ర ప్రభుత్వం తిరుమల గగనతలంలో విమానాలను తిరగకుండా నిషేధించిందన్నారు.
డ్రోన్ కెమెరాతో చిత్రీకరించిన ఇన్స్టాగ్రామ్ రీల్ హైదరాబాద్కు చెందిన సంస్థ సామాజిక మాధ్యమాల్లో ప్రసారం చేసినట్లు గుర్తించాం. సదరు సంస్థపై క్రిమినల్ కేసు నమోదు చేస్తాం. పటిష్ఠ భద్రత ఉన్న ఆలయంపై డ్రోన్తో చిత్రీకరించేందుకు అవకాశం లేదు. పాత చిత్రంతో యానిమేట్ చేశారా? అనే కోణంలో పూర్తి స్థాయి విచారణ చేపట్టాలని అధికారులను ఆదేశించాం. డ్రోన్ చిత్రాలు, దృశ్యాలపై భక్తులు ఆందోళన చెందాల్సిన పని లేదు.-వైవీ సుబ్బారెడ్డి, తి.తి.దే. ఛైర్మన్
తితిదేలో డ్రోన్ దృశ్యాల కలకలం.. ఆందోళనలో భక్తులు
ఇవీ చదవండి
