తిరుమల బ్రహ్మోత్సవాలు.. తొలిరోజు వైభవంగా శ్రీవారి పెదశేష వాహనసేవ

author img

By

Published : Sep 27, 2022, 10:51 PM IST

Updated : Sep 28, 2022, 7:41 AM IST

1

Tirumala: సాయంత్రం ధ్వజారోహణంతో తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. శ్రీవారికి ముఖ్యమంత్రి జగన్​ పట్టువస్త్రాలు సమర్పించారు. తొలిరోజు జరిగే పండుగే పెద శేషవాహన ఉత్సవంలో భక్తులు పాల్గొని ఆనందభరితమయ్యారు. ఆద్యంతం కన్నుల పండువగా సాగిన ఈ సేవలో శ్రీనివాసుడు శేషతల్పంపై అధిష్ఠించి భక్తులకు దర్శనమిచ్చారు.

Tirumala Brahmotsavam: కలియుగ వైకుంఠం తిరుమలలోని మాడ వీధులు దాదాపు రెండేళ్ల విరామం తర్వాత భక్తసంద్రమయ్యాయి. గత రెండేళ్లు కరోనా కారణంగా వెలవెలబోయిన గ్యాలరీలు మళ్లీ కళకళలాడాయి. వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా పెద్దశేష వాహనంపై విహరించిన గోవిందుడికి భక్తజనం కర్పూర హారతులు పట్టింది. ముఖ్యమంత్రి జగన్‌.. ఈసారీ ఒక్కరే స్వామివారికి ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించారు.

తిరుమల బ్రహ్మోత్సవాలు.. తొలిరోజు వైభవంగా శ్రీవారి పెదశేష వాహనసేవ

తిరుమల శ్రీనివాసుని వార్షిక బ్రహ్మోత్సవాలు.. అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ముక్కోటి దేవతలను ఉత్సవాలకు ఆహ్వానిస్తూ.. ధ్వజారోహణం నిర్వహించారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ ఒక్కరే పట్టువస్త్రాలు సమర్పిస్తున్న సీఎం జగన్‌.. ఈసారీ అదే సంప్రదాయాన్ని కొనసాగించారు. సంప్రదాయ పంచెకట్టులో.. బేడీ ఆంజనేయ స్వామి ఆలయానికి వచ్చిన.. జగన్‌ తలకు అర్చకులు పరికట్టం కట్టారు. అక్కడి నుంచి పట్టువస్త్రాలు తలపై పెట్టుకుని వెళ్లి.. రాష్ట్ర ప్రభుత్వం తరపున స్వామివారికి సమర్పించారు.

వెంకటేశ్వర స్వామి దర్శనానంతరం.. రంగనాయక మండపంలో.. ముఖ్యమంత్రికి పండితులు వేదాశీర్వచనం అందజేశారు. ఈ సందర్భంగా తితిదే 2023 కాలెండర్, డైరీలను ఆవిష్కరించారు. అనంతరం ముఖ్యమంత్రి జగన్‌ స్వామివారి.. వాహన సేవలో పాల్గొన్నారు. బ్రహ్మోత్సవాల తొలిరోజు వజ్రవైఢూర్యాలతో కూడిన తిరువాభరణాలు ధరించిన మలయప్ప స్వామి శ్రీదేవి, భూదేవి సమేతంగా పెద్దశేష వాహనంపై విహరించారు.

తిరు మాడవీధుల్లో భక్తులకు అభయప్రదానం చేశారు. గత రెండేళ్లు కరోనా కారణంగా ఆలయం ప్రాకారానికే పరిమితమైన వాహన సేవలు ఈసారి మాడవీధుల్లో నిర్వహించడంతో.. భక్తులు తన్మయత్వం చెందారు. గ్యాలరీల్లో నిలుచుని వీక్షించారు. కర్పూర హారతులు పట్టారు. వాహన సేవ ముందు వివిధ రాష్ట్రాల భజన మండళ్లు, కోలాట బృందాల నృత్యాలు.. అలరించాయి.

బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామి వారు కాసేపట్లో.. చిన్న శేష వాహనంపై విహరించనున్నారు. మలయప్ప స్వామి శ్రీకృష్ణ పరమాత్మ రూపంలో భక్తులకు కనువిందు చేయనున్నారు. రాత్రికి వీణాపాణియై.. సరస్వతీదేవి రూపంలో హంసతూలికా వాహనంపై విహరిస్తారు. స్వామివారి వైభవాన్ని కనులారా చూసేందుకు తరలివచ్చిన భక్తకోటికి తితిదే అన్ని ఏర్పాట్లు చేసింది. ఆర్జిత సేవలు, ప్రత్యేక ప్రవేశ దర్శనాలు రద్దు చేసి.. సర్వదర్శనాలను మాత్రమే అనుమతిచింది.

ఇవీ చదవండి:

Last Updated :Sep 28, 2022, 7:41 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.