భారత అంతరిక్షయాన రంగంలో మరో చారిత్రక ఘట్టం.. "మిషన్​ ప్రారంభ్​" విజయవంతం

author img

By

Published : Nov 18, 2022, 11:58 AM IST

Updated : Nov 18, 2022, 1:02 PM IST

rocket launching

Vikram S Rocket Launching Successful : భారత అంతరిక్షయాన రంగ చరిత్రలో సరికొత్త అధ్యాయం ఆవిష్కృతమైంది. తొలిసారి ఓ ప్రైవేటు సంస్థ రూపొందించిన రాకెట్‌ విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. 3 ఉపగ్రహాలను నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. హైదరాబాద్‌కు చెందిన స్కైరూట్‌ ఏరోస్పేస్‌ అంకురసంస్థ రూపొందించిన విక్రమ్‌-S రాకెట్‌.. అంతరిక్షంలోకి దూసుకెళ్లింది.

Rocket Launching Successful: భారత అంతరిక్షయాన రంగంలో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. దేశంలో తొలి ప్రైవేటు రాకెట్‌ నింగిలోకి దూసుకెళ్లింది. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌) ఈ ప్రయోగానికి వేదికైంది. శుక్రవారం ఉదయం 11.30 గంటలకు షార్‌లోని సౌండింగ్‌ రాకెట్‌ కాంప్లెక్స్‌ నుంచి తొలి ప్రైవేటు రాకెట్‌ ‘విక్రమ్‌-ఎస్‌’ నింగిలోకి వెళ్లింది. ఈ ప్రయోగం విజయవంతమైనట్లు శాస్త్రవేత్తలు ప్రకటించారు.

హైదరాబాద్‌కు చెందిన స్కైరూట్‌ ఏరోస్పేస్‌ ప్రైవేటు లిమిటెడ్‌ సంస్థ.. విక్రమ్‌-సబ్‌ ఆర్బిటల్‌ (వీకేఎస్‌) ఈ ప్రైవేట్‌ రాకెట్‌ను అభివృద్ధి చేసింది. ఈ మొట్టమొదటి మిషన్‌కు ‘ప్రారంభ్‌’ అని నామకరణం చేశారు. ఈ ప్రయోగాన్ని వీక్షించేందుకు కేంద్రమంత్రి జితేంద్రసింగ్‌ హాజరయ్యారు. వాస్తవానికి ఈనెల 12నే ప్రయోగం చేపట్టాల్సి ఉండగా వాతావరణం అనుకూలించకపోవడంతో నేటికి వాయిదా పడింది. విక్రమ్‌-ఎస్‌ రాకెట్‌.. సింగిల్‌ స్టేజ్‌ సబ్‌-ఆర్బిటల్‌ లాంచ్‌ వెహికల్‌ కావడం ప్రత్యేకత. ఈ రాకెట్‌ మూడు పేలోడ్‌లను అంతరిక్షంలోకి తీసుకెళ్లింది.

విక్రమ్‌ సారాభాయ్‌కి నివాళిగా..

అంతరిక్ష రంగంలో అడుగుపెట్టేందుకు ప్రైవేటు రంగానికి మన దేశంలో రెండేళ్ల క్రితమే అనుమతి లభించింది. అప్పటి నుంచి స్కైరూట్‌ ఏరోస్పేస్‌ ఈ రాకెట్‌ అభివృద్ధి పనుల్లో నిమగ్నమైంది. చాలా తక్కువ ఖర్చుతో, రెండేళ్లలోనే ఈ రాకెట్‌ను తయారుచేసినట్లు సంస్థ సీఈఓ పవన్‌ కుమార్‌ గతంలో వెల్లడించారు. మన దేశంలో అంతరిక్ష ప్రయోగాలకు అంకురార్పణ చేసిన ప్రముఖ శాస్త్రవేత్త విక్రమ్‌ సారాభాయ్‌కి నివాళిగా తమ రాకెట్‌కు ‘విక్రమ్‌-ఎస్‌’ అని పేరు పెట్టినట్లు వెల్లడించారు. ఈ రాకెట్‌ ప్రయోగం కోసం స్కైరూట్‌.. ఇటీవల 51 మిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.408 కోట్లు) పెట్టుబడిని సమీకరించింది. మింత్రా వ్యవస్థాపకుడు ముఖేశ్ బన్సల్‌, గూగుల్‌ బోర్డు సభ్యుడు శ్రీరామ్‌.. ఈ సంస్థకు పెట్టుబడులు సమకూర్చిన వారిలో ఉన్నారు.

విద్యార్థులు రూపొందించిన పేలోడ్‌..

విక్రమ్‌-ఎస్‌ రాకెట్‌ అంతరిక్షంలోకి తీసుకెళ్లే పేలోడ్‌లలో ఒకటి విదేశీ సంస్థకు చెందినది కాగా.. రెండు మన దేశ సంస్థలకు చెందినవి. ఇందులో ఒకటి చెన్నై కేంద్రంగా నడుస్తున్న స్పేస్‌కిడ్జ్‌ ఆధ్వర్యంలో రూపొందించిన 2.5 కిలోల ‘ఫన్‌-శాట్‌’ పేలోడ్‌. దీనిని మన దేశంతో పాటు, అమెరికా, సింగపూర్‌, ఇండోనేసియా విద్యార్థులు రూపొందించారు.

భారత అంతరిక్షయాన రంగంలో మరో చారిత్రక ఘట్టం.. "మిషన్​ ప్రారంభ్​" విజయవంతం

ఇవీ చదవండి:

Last Updated :Nov 18, 2022, 1:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.