బీసీలకు రిజర్వేషన్లు పెంచిన ఘనత చంద్రబాబుదైతే.. తగ్గించిన ఘనత జగన్​దే: లోకేశ్​

author img

By

Published : Jan 28, 2023, 2:13 PM IST

Updated : Jan 28, 2023, 4:51 PM IST

Lokesh Yuvagalam

Lokesh Yuvagalam : స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు తగ్గించిన జగన్‌రెడ్డిని ఇంటికి పంపాల్సిందేనని.. తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి లోకేశ్ అన్నారు. మళ్లీ తెలుగుదేశం ప్రభుత్వం రాగానే పాత పద్ధతిలో రిజర్వేషన్లు అమలు చేస్తామని హామీ ఇచ్చారు.

Lokesh Yuvagalam: స్థానిక సంస్థల్లో బీసీలకు 20 నుంచి 34 శాతానికి రిజర్వేషన్లు పెంచిన ఘనత చంద్రబాబుదైతే.. 24 శాతానికి తగ్గించిన ఘనత జగన్​రెడ్డిదని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‍ విమర్శించారు. రెండో రోజు చేపట్టిన యువగళం పాదయాత్ర కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలం శివరామపురానికి చేరుకుంది. శివరామపురంలో ఏర్పాటు చేసిన బీసీ సదస్సులో ఆయన పాల్గొన్నారు.

పాదయాత్ర ద్వారా అందరికి న్యాయం చేస్తానన్న జగన్‍.. సంక్షేమంలో కోత వేశారని ఆరోపించారు. బోయలను ఎస్టీలలో చేరుస్తామని హామీ ఇచ్చి అమలు చేయలేదని ధ్వజమెత్తారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక కురుబ కులస్థులకు గ్రామ గ్రామాన ఆలయాలు కట్టిస్తామని.. ఆలయ నిర్మాణాల కోసం బడ్జెట్​లో ప్రత్యేక నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక వడ్డెర్లకు గనులలో రాళ్లు కొట్టుకొనే అవకాశం పునరుద్ధరిస్తామన్నారు.

జగన్​లాగా తప్పుడు హామీలివ్వనని.. పూర్తి స్థాయిలో పరిశీలన చేశాక అమలు చేయగలిగే వాటిపైనే హామీ ఇస్తానన్నారు. ప్రజలను యువగళం పాదయాత్ర ద్వారా చైతన్యం చేద్దామన్నారు. శాసనసభలో తమ తల్లిపట్ల అగౌరవంగా మాట్లాడిన వారిని వదలిపెట్టనని హెచ్చరించారు. దొంగ బీసీ సర్టిఫికెట్​లు జారీ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. బీసీలను సామాజిక, ఆర్థిక, రాజకీయంగా ఆదుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

పీఈఎస్​ వైద్య కళాశాల నుంచి రెండో రోజు పాదయాత్ర ప్రారంభం: కుప్పంలో పీఈఎస్ వైద్య కళాశాల నుంచి ఆయన యాత్ర కొనసాగించారు. విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా అనేకమంది విద్యార్థులు లోకేశ్‌తో సెల్ఫీలు దిగారు. కుప్పం ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద లోకేశ్‌కు ఘనస్వాగతం లభించింది. విద్యార్థులు లోకేశ్‌ కటౌట్‌కి పాలాభిషేకం చేశారు. చంద్రబాబు తమ ప్రాంతానికి డిగ్రీ కళాశాల తెచ్చిన కృతజ్ఞతతో అభిమానం చాటుకుంటున్నామని విద్యార్థులు తెలిపారు.

పాదయాత్రలో భాగంగా గుడుపల్లె మండలం బెగ్గిపల్లె గ్రామస్థులతో లోకేశ్‌ సమావేశమయ్యారు. కనుమలదొడ్డి ప్రజలతో ముఖాముఖి నిర్వహించి.. గ్రామస్థుల నుంచి వినతులు స్వీకరించారు. తెలుగుదేశం ప్రభుత్వం రాగానే సామాజిక భవనాల నిర్మాణం పూర్తిచేస్తామని లోకేశ్ హామీ ఇచ్చారు. గ్రామంలో అసంపూర్తిగా ఉన్న కురుమ భవనాన్ని, ఆ పక్కనే ఉన్న వాల్మీకి భవానాన్నీపరిశీలించారు.

వైసీపీ వచ్చాక అణచివేతకు గురవుతున్న అన్ని వర్గాలకు ప్రాధాన్యం ఇస్తామని హామీ ఇచ్చారు. అలాగే తెలుగుదేశం నాయకులను కేసులతో వేధిస్తున్న వారికి చక్రవడ్డీతో సహా చెల్లిస్తామని హెచ్చరించారు. అనంతరం కనుమలదొడ్డిలో ప్రజల నుంచి వినతుల స్వీకరించి.. వారితో మాట్లాడారు. ఈ యాత్రలో కార్యకర్తలు, టీడీపీ శ్రేణులు లోకేశ్​తో కలిసి పాదం కలిపారు.

ఇవీ చదవండి :

Last Updated :Jan 28, 2023, 4:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.