సమస్యలు తెలుసుకుంటూ.. భరోసానిస్తూ.. కుప్పంలో రెండో రోజు లోకేశ్​ పాదయాత్ర

author img

By

Published : Jan 28, 2023, 10:27 PM IST

YUVAGALAM SECOND DAY PADAYATRA

YUVAGALAM SECOND DAY PADAYATRA : యువత సమస్యల పరిష్కారం కోసం టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్​ చేపట్టిన యువగళం పాదయాత్ర రెండో రోజు 9.7 కిలోమీటర్ల మేర సాగింది. పాదయాత్రలో విద్యార్థులు, రైతులు, పలు బీసీ సంఘాల నేతలు, పలు గ్రామాల ప్రజలను లోకేశ్ కలిశారు. వైసీపీ అరాచక పాలన త్వరలోనే అంతమవుతుందని వారికి భరోసా ఇచ్చారు. తాము అధికారంలోకి వచ్చాక ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా చేస్తామని ఆయన తెలిపారు.

YUVAGALAM SECOND DAY PADAYATRA : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ పాదయాత్ర చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో రెండో రోజు ఘనంగా సాగింది. అడుగడుగున మహిళల హారతులు, టీడీపీ శ్రేణుల కోలాహలం మధ్య పాదయాత్ర సాగించిన లోకేశ్‍.. వివిధ వర్గాల ప్రజలను కలుసుకున్నారు. ఉదయం యువకులతో నిర్వహించాల్సిన ముఖాముఖి కొన్ని అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది. ఉదయం 9.45 నిమిషాలకు ప్రారంభించిన పాదయాత్ర.. వివిధ గ్రామాల మీదుగా శాంతిపురం వరకు సాగింది.

విద్యార్థులతో లోకేశ్​ ముఖాముఖి: కుప్పం డిగ్రీ కళాశాల విద్యార్థులతో లోకేశ్‍ ముఖాముఖి నిర్వహించారు. ఈ ప్రభుత్వంలో తమకు సరైన వసతులు కల్పించడం లేదని లోకేశ్​కు పలువురు విద్యార్ధులు విన్నవించుకున్నారు. విద్యాదీవెన ద్వారా తమకు రావాల్సిన నిధులు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రైతు పిల్లలమైన తాము ఎలా చదువుకోవాలని లోకేశ్‍ ముందు వాపోయారు. బస్సులు ఏర్పాటు చేయలేదని.. తాగునీటి సమస్య ఉందని ఆయన దృష్టికి తీసుకొచ్చారు. తాము అధికారంలోకి రాగానే విద్యార్థులకు న్యాయం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. చిత్తూరు, తిరుపతిలో వేల ఉద్యోగాలు కల్పించే అమరరాజాను తరిమేశారని ఆయన ఆరోపించారు.

రైతులకు గ్రాస్​కట్టర్​ల పంపిణీ: పాదయాత్ర శాంతిపురం మండలం గణేశపురం క్రాస్​కు చేరుకున్న అనంతరం రైతులు, గ్రామస్థులతో నారా లోకేశ్‍ ముఖాముఖి నిర్వహించారు. ఎన్​బీకే టు ఎన్టీఆర్ ఫౌండేషన్ సంస్థ అధ్వర్యంలో రైతులకు గ్రాస్ కట్టర్​లను ఆయన పంపిణీ చేశారు. కమీషన్ల కోసమే కరెంటు మోటార్లకు మీటర్లు ఏర్పాటు చేస్తున్నారని ఆరోపించారు. తాము అధికారంలోకి వచ్చాక కరెంట్ మీటర్ల ఏర్పాట్లపై చర్యలు తీసుకొంటామని హామీ ఇచ్చారు.

అధికారంలోకి వచ్చాక టమాట రైతులకు గిట్టుబాటు ధర: శాంతిపురం మండలం ఏడో మైలు గ్రామంలో టమాట రైతులతో నారా లోకేశ్​ ముఖాముఖి నిర్వహించారు. ఈ ప్రభుత్వంలో తమకు జరుగుతున్న అన్యాయాలను లోకేశ్‍కు వివరించారు. రైతు భరోసా కేంద్రాలు ఓ మోసమని.. ఆర్బీకేలలో నాణ్యమైన విత్తనాలు, మందులు లేవన్నారు. కోర్టులో ఫైల్ ఎత్తుకెళ్లిన దొంగ.. వ్యవసాయ మంత్రి అని లోకేశ్​ ఎద్దేవా చేశారు .

టమాట రైతులను ఆదుకోవటానికి టమాట సాస్ పరిశ్రమ పెడతానని చెప్పి మోసం చేశారని ఆరోపించారు. పండించిన పంటకు గిట్టుబాటు ధర లేకపోతే ఊరుకుంటామా అని ఆయన ప్రశ్నించారు. తాము అధికారంలోకి వచ్చాక టమాట రైతులకు గిట్టుబాటు ధరలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో పాడి పరిశ్రమను నాశనం చేశారని.. అమూల్ తెచ్చి రైతులకు ఏమి లాభం చేశారని ఆయన ప్రశ్నించారు.

వన్నెకుల క్షత్రియులతో ప్రత్యేకంగా సమావేశం: పాదయాత్రలో భాగంగా నడింపల్లి చేరుకున్న లోకేశ్‍.. వన్నెకుల క్షత్రియులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. రాజకీయంగా ప్రాధాన్యత కల్పించాలని సంఘం నేతలు కోరారు. సమావేశం అనంతరం తుంసి మీదుగా శాంతిపురం వరకు పాదయాత్ర చేసిన లోకేశ్‍ రెండో రోజు యాత్రను ముగించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.