గుప్పెడంత గుండెకు... కొండంత ముప్ఫు.!

author img

By

Published : Sep 22, 2021, 10:31 AM IST

the-number-of-heart-patients-is-increasing-day-by-day-in-srikakulam-district

గుప్పెడంత గుండెను కొండంత ముప్పు కమ్మేస్తోంది. అప్పటి వరకు స్పందిస్తున్నది ఒక్కసారిగా ఆగిపోతోంది. నమ్ముకున్నవారిని నడిరోడ్డున పడేసేందుకు కారణమవుతోంది.. చిన్నోళ్లు, పెద్దోళ్లు అనే తేడాలేకుండా ఆరోగ్యం నిర్లక్ష్యం చూపినవారిపై కాటేస్తోంది. కొంతకాలంగా జిల్లా వ్యాప్తంగా హృద్రోగంతో బాధపడేవారి సంఖ్య పెరుగుతోంది. ఉన్నట్టుండి ప్రాణాలు వదిలేస్తున్నారు. ఇందుకు ప్రధాన కారణం మారుతున్న జీవనశైలే అంటున్నారు వైద్యనిపుణులు. తగిన జాగ్రత్తలు తీసుకుంటే ముప్పు నుంచి తప్పించుకోవచ్చునని సూచిస్తున్నారు.

శ్రీకాకుళం జిల్లాలో హృదయ సంబంధ వ్యాధులు, గుండెపోటుతో మరణిస్తున్న వారి సంఖ్య ఇటీవల ఎక్కువగా కనిపిస్తోంది. ఒకప్పుడు 50- 60 ఏళ్ల వయసు పైబడిన వారికే ఈ సమస్యలు వచ్చేవి. ఇప్పుడు 25 ఏళ్ల యువత కూడా దీని బారిన పడుతున్నారు. 30 ఏళ్ల వయసున్న రోగికీ స్టంట్‌ వేయాల్సి వస్తోంది. మధుమేహం, రక్తపోటు బాధితుల్లోనూ చాలామంది గుండెపోటుకు గురవుతున్నట్లు నిపుణుల అధ్యయనాల్లో వెల్లడవుతోంది. యువత వీటి బారిన పడుతుండటం మరింత ఆందోళనకు గురిచేసే అంశం.

.

వైద్యులు ఏమంటున్నారంటే...

  • గుండె సంబంధ వ్యాధులతో వస్తున్న వారిలో ఎక్కువ మంది మధుమేహంతో బాధపడేవారే ఉంటున్నారు.
  • రక్తపోటు ఉన్నవారూ గుండెపోటుకు గురవుతున్నారు.
  • కొంచెం దూరం నడిచినా, చిన్న పనిచేసినా ఆయాసం, తీవ్ర అలసటకు లోనవుతున్నామని చెబుతున్న వారిలో 75 శాతం మందిలో గుండె నాళాలు బలహీనంగా ఉంటున్నాయి.
  • ప్రతి పది గుండె శస్త్రచికిత్సల్లో స్టంట్లు వేస్తున్నవి 7-8 వరకూ ఉంటున్నాయి.
  • ఎందుకిలా?
  • పనిఒత్తిడి, మానసిక ఆందోళన, మధుమేహం, రక్తపోటు, గుండె కవాటాలు, రక్తం సరఫరా చేసే నాళాలపై ప్రభావం చూపడం.
  • ఆహార నియమాలు పాటించకపోవడం, ఫాస్ట్‌ఫుడ్‌పై ఆధారపడుతున్నారు. తద్వారా శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ పెరిగిపోతోంది. ఫలితంగా రోగాలు చుట్టుముడుతున్నాయి.
  • కొంతకాలంగా కరోనా బారిన పడి కోలుకున్నవారిలో కూడా మరణాలు ఎక్కువగా ఉంటున్నాయి. స్టెరాయిడ్స్‌ ఎక్కువగా తీసుకోవడంతోనే వారిలో అధిక శాతం హృదయ సంబంధ వ్యాధులకూ గురవుతున్నారు.
.
  • శ్రీకాకుళం నగరానికి చెందిన ఓ యువకుడు(37) పని నుంచి ఇంటికొచ్చాడు. చరవాణిలో మాట్లాడుతూ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. కుటుంబసభ్యులు ఆసుపత్రికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయింది.
  • టెక్కలికి చెందిన 45 ఏళ్ల వ్యక్తి ఛాతీలో నొప్పి వస్తోందని జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి వచ్చి గేటు దగ్గరే ఉన్నట్టుండి పడిపోయారు. అపస్మారకస్థితికి చేరిన అతనికి చికిత్స అందించేలోపే కన్నుమూశారు.
  • గార మండలానికి చెందిన 30 ఏళ్ల యువకుడు ఇంట్లో విశ్రాంతి తీసుకుంటూ అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. గమనించిన కుటుంబ సభ్యులు వైద్యుడి వద్దకు తీసుకెళ్లినా అప్పటికే కన్నుమూశారు.
  • జిల్లా వ్యాప్తంగా ఇటీవల ఓ ప్రైవేటు ఆసుపత్రి వైద్య సిబ్బంది వైద్య శిబిరాలు నిర్వహించారు. వారి దగ్గరికి వచ్చిన వారిలో అధికశాతం హృదయ సంబంధ వ్యాధులతో బాధపడుతున్నట్లు గుర్తించారు.

జీవనశైలిలో మార్పులే కారణం...

జీవనశైలిలో మార్పులే హృదయ సంబంధితవ్యాధులకు కారణం. కాలం మారుతున్న కొద్దీ పనిఒత్తిడి అధికమవుతోంది. సమయానికి ఆహారం తీసుకోవడంపై చాలామంది శ్రద్ధ చూపడం లేదు. అల్పాహారం దగ్గరి నుంచి భోజనం, చిరుతిళ్లు వరకూ హోటళ్లపైనే ఆధారపడుతున్నారు. దీనివల్ల గుండె పనితీరు దెబ్బతింటోంది. ముఖ్యంగా పొగ తాగేవారిలో, పొగాకు నమిలే వారిలో గుండె కండరాల పనితీరు సక్రమంగా ఉండట్లేదు. - డాక్టర్‌ బుడుమూరు అన్నాజీరావు, కార్డియాలజిస్ట్‌

ఆహారపు అలవాట్లు మార్చుకోవాలి...

గుండె సంబంధిత వ్యాధుల బారిన పడకుండా ఉండాలంటే ఆహారపు అలవాట్లు మార్చుకోవాలి. ప్రోటీన్లు అధికంగా ఉండే ఆహారాన్నే తీసుకోవాలి. కూరగాయలు, పండ్లు, ఆకుకూరలు, చేపలు, డ్రైఫ్రూట్స్‌ తినాలి. ఆహారంపై శ్రద్ధపెట్టి, తగినంత వ్యాయామం చేయాలి. - విజయ్‌కుమార్‌, వైద్య నిపుణులు

.


ఇదీ చూడండి: అవసరం లేకున్నా సిజేరియన్లు... ప్రభుత్వాసుపత్రుల్లో 34%, ప్రైవేటులో 66% కోతలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.