శ్రీకాకుళం జిల్లాలో వైకాపాదే పరిషత్‌ పీఠం !

author img

By

Published : Sep 19, 2021, 7:46 PM IST

Updated : Sep 20, 2021, 9:08 AM IST

శ్రీకాకుళం

శ్రీకాకుళం జిల్లాలో నియోజకవర్గాలను యూనిట్గా తీసుకుని పది లెక్కింపు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం ఎనిమిది గంటలకే ఓట్ల లెక్కింపు ప్రారంభం కావాల్సి ఉన్నా కేవలం ఒకట్రెండు చోట్ల మాత్రమే అది సాధ్యమైంది. మిగిలిన చోట్ల బ్యాలెట్ పెట్టలకు చెదలు పట్టడం, పోస్టల్‌ బ్యాలెట్ల లెక్కింపులో తీవ్ర జాప్యం, అధికారులు, సిబ్బంది మధ్య సమన్వయం లోపించడం తదితర కారణాలతో ఫలితాలు ఆలస్యంగా వచ్చాయి. మధ్యాహ్నానికే లెక్కింపు పూర్తవుతుందనుకున్నా రాత్రి వరకూ కొనసాగింది. పది గంటలు దాటినా జడ్పీటీసీ స్థానాల్లో లెక్కింపు కొనసాగింది.

జిల్లా వ్యాప్తంగా పరిషత్‌ ఎన్నికల లెక్కింపు ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. ఎన్నోరోజుల ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో మెజారిటీ స్థానాల్లో వైకాపా విజయ దుందుబి మోగించింది. గతంలో జరిగిన పంచాయతీ, పుర ఎన్నికల తరహాలోనే ఈసారి ఘన విజయం సాధించడంతో ఆ పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి. చిన్న, చిన్న ఘటనలు మినహా అన్ని కేంద్రాల్లోనూ లెక్కింపు ప్రక్రియ సజావుగా సాగింది. ఉదయం నుంచే నియోజకవర్గ కేంద్రాల్లో వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలతో సందడి వాతావరణం నెలకొంది. మొత్తం 37 జడ్పీటీసీ స్థానాలూ వైకాపా పరమయ్యాయి. 590 ఎంపీటీసీ స్థానాల్లో వైకాపా 495, తెదేపా 80 , జనసేన 1, భాజపా 1, స్వతంత్ర అభ్యర్థులు 11 మంది గెలుపొందారు. రీపోలింగ్‌ కారణంగా రెండుచోట్ల ఫలితాలను ప్రకటించలేదు.

Srikakulam Parishad election results
శ్రీకాకుళం జిల్లాలో వైకాపాదే పరిషత్‌ పీఠం !

భారీ భద్రత నడుమ...

జిల్లాలోని పది లెక్కింపు కేంద్రాలకూ అధికారులు సుడిగాలి పర్యటనలు చేశారు. కలెక్టర్‌ శ్రీకేష్‌ లఠ్కర్‌, ఎన్నికల పరిశీలకులు కేబీహెచ్‌ఎన్‌ చక్రవర్తి, జేసీలు సుమిత్‌ కుమార్‌, శ్రీనివాసులు పరిస్థితిని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఇబ్బందులు తలెత్తినచోట వెంటనే అక్కడికి చేరుకుని సిబ్బందికి సూచనలు చేశారు. స్పష్టమైన మెజారిటీతో గెలుపొందిన అభ్యర్థులకు రిటర్నింగ్‌ అధికారులు ఎక్కడికక్కడే ధ్రువపత్రాలు అందజేశారు. గెలుపొందినట్లు అధికారికంగా ప్రకటించారు. మరోపక్క ఎలాంటి అవాంఛనీయ ఘటనలూ చోటు చేసుకోకుండా పోలీసు సిబ్బంది ముందస్తు భద్రతా ఏర్పాట్లు చేశారు. కొవిడ్‌ నిబంధనల నేపథ్యంలో సంబరాలు, ర్యాలీలు, ప్రదర్శనలకు అనుమతి లేదని ముందుగానే హెచ్చరించారు.

రెండు స్థానాలకు రీపోలింగ్‌

జిల్లాలో 590 ఎంపీటీసీˆ స్థానాలకు ఎన్నికలు జరగ్గా ఆదివారం రాత్రి 588 ఫలితాలను ఆయా రిటర్నింగ్‌ అధికారులు వెల్లడించారు. మిగిలిన రెండు స్థానాల్లో రీపోలింగ్‌ నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. ఆ స్థానాలకు చెందిన కొన్ని బ్యాలెట్ పెట్టెల్లోని పత్రాలకు చెద పట్టింది. ఒక అభ్యర్థికి వచ్చిన మెజారిటీ కంటే చెద పట్టి పనిచేయకుండా పోయిన బ్యాలెట్ పత్రాలే ఎక్కువగా ఉండడంతో జిల్లా ఎన్నికల అధికారులు ఎటూ నిర్ణయం తీసుకోలేకపోయారు. విషయాన్ని రాష్ట్రస్థాయి ఎన్నికల అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో ఆమదాలవలస మండలం కట్యాచార్యులపేట, మందస మండలం అంబుగాం ఎంపీటీసీ స్థానాల్లో రీపోలింగ్‌ నిర్వహించేలా నిర్ణయం తీసుకున్నారు. ఈ రెండు స్థానాల్లోని ఆయా పోలింగ్‌ బూతుల్లో రీపోలింగ్‌ జరగనుంది.

బ్యాలెట్ పత్రాలకు చెదలు

....

జిల్లాలో కొన్నిచోట్ల బ్యాలెట్ పత్రాలకు చెదలు పట్టడంతో గందరగోళం నెలకొంది. దీంతో ఫలితాల వెల్లడిలో జాప్యం చోటుచేసుకుంది. ః గార మండలం బందరువానిపేట, సతివాడ ఎంపీటీసీ స్థానాలకు చెందిన బ్యాలెట్ పెట్టెల్లోని 620 ఓట్లకు చెదలు పట్టాయి. దీంతో కలెక్టర్‌ లఠ్కర్‌ వాటిని పరిశీలించి ముద్రలు అన్నీ సక్రమంగానే కనిపిస్తుండటంతో లెక్కింపునకు అనుమతించారు. ః మందస మండలం రాంపురం బూత్‌ నంబరు 81కి చెందిన పెట్టెల్లోని 131 ఓట్లకు చెదలు పట్టాయి. అక్కడి వైకాపా అభ్యర్థికి 1,589, తెదేపా అభ్యర్థికి 68 ఓట్లు రాగా చెదలు పట్టిన వాటిని పక్కన పెట్టి వైకాపా అభ్యర్థి గెలుపును ఖాయం చేశారు. ఇదే మండలానికి చెందిన అంబుగాం స్థానానికి చెందిన బాక్సుల్లోని 48 ఓట్లకు చెదలు పట్టాయి. అక్కడ వైకాపా అభ్యర్థికి 38 ఓట్లే మెజారిటీ రావడంతో ఫలితాన్ని వెల్లడించలేదు.

  • ఆమదాలవలస మండలంలోని లెక్కింపు కేంద్రంలో కట్యాచార్యులు పేట ఎంపీటీసీ స్థానానికి చెందిన 620 బ్యాలెట్‌ పత్రాలకు చెదలు పట్టాయి. ఇక్కడ తెదేపాకు 584 ఓట్లు, వైకాపాకు 443 వచ్చాయి. ఇక్కడ కూడా ఫలితం నిలిపివేశారు. ఇదే తరహాలో సరుబుజ్జిలిలోనూ ఫలితాల వెల్లడిలో జాప్యం జరిగింది.
....
  • ఫలితాల్లో అవీ ఇవీ..
  • తమ్మినేని సీతారాం స్వగ్రామం ఆమదాలవలస మండలం తొగరాం. ఇది కలివరం ఎంపీటీసీ స్థానంలో భాగం. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో స్పీకరు సతీమణి తొగరాం సర్పంచిగా ఎన్నికయ్యారు. కానీ ఎంపీˆటీసీˆ స్థానానికి పోటీచేసిన తెదేపా అభ్యర్థి తమ్మినేని భారతమ్మ వైకాపా అభ్యర్థిపై 648 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.
  • రేగిడి మండలంలోని కోడిశ ఎంపీటీసీ ఎన్నికల్లో చెల్లని ఓట్లే అధికంగా నమోదయ్యాయి. ఇక్కడ మొత్తం 2125 ఓట్లు పోలయ్యాయి. ఇందులో 480 వరకు చెల్లనివిగా అధికారులు తేల్చారు. స్వస్తిక్‌ గుర్తుకు బదులుగా డిస్టిగ్వింష్‌డ్‌ మార్కును ఓటర్లకు ఇవ్వడమే కారణం అంటున్నారు. పోలింగ్‌ సందర్భంగా జరిగిన ఈ పొరపాటుకు ఈ ఓట్లన్నీ చెల్లకుండా పోయినట్లు చెబుతున్నారు. దీనిపై తెదేపాకు అభ్యర్థి గురవాన తమ్మినాయుడు ఆర్‌వో శ్రీనివాసరావు వద్ద ఈ సమస్యను వివరించారు.
  • టెక్కలి మండలం తొలుసూరుపల్లి ఎంపీటీసీ స్థానం ఓట్ల లెక్కింపులో రెండో రౌండ్‌లో తెదేపా అభ్యర్థి మంచాల చిన్నమ్మడుకు ఆధిక్యం రావడంతో వైకాపా ఏజెంట్ కావాలనే వాగ్వాదానికి దిగారని తెదేపా ఏజెంట్ ఆరోపించారు. ఏజెంట్నని చెప్పినా పోలీసులు వినకుండా కేంద్రం నుంచి బయటకు పంపించేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
  • జి.సిగడాం మండలం మెట్టవలస ఎంపీటీసీ స్థానంలో తెదేపా అభ్యర్థికి తొలుత 14 ఓట్ల మెజారిటీ సాధించారు. వైకాపా అభ్యర్థి రీకౌంటింగ్‌కి పట్టుబట్టారు. 13 ఓట్ల మెజారిటీ స్పష్టంగా ఉండటంతో తెదేపా అభ్యర్థి బెవర లక్ష్మినే విజయం వరించింది.
  • నామమాత్రంగా పోటీ చేసినా....

హడావుడిగా ఎన్నికల నిర్వహణ, నిబంధనలకు విరుద్ధంగా ఏకపక్షంగా వైకాపా బలవంతపు ఏకగ్రీవాలకు పాల్పడిందనే ఆరోపిస్తూ తెలుగుదేశం పార్టీ స్థానిక సంస్థల ఎన్నికలను బహిష్కరించిన విషయం తెలిసిందే. అయినా కొందరు కార్యకర్తలు బరిలో నిలిచారు. పెద్ద నాయకులు ప్రచారంలోకి రాకపోయినా వారే పార్టీ జెండాతో ఇంటింటా తిరిగారు. కరపత్రాలు ముద్రించలేదు. చాలాచోట్ల పోటీలో నిలిచినా నామమాత్రమేనని అంతా భావించారు. కానీ జిల్లా వ్యాప్తంగా 80 ఎంపీటీసీ స్థానాలు తెదేపా దక్కించుకుంది. తెదేపా అభ్యర్థులు నిలిచిన చోట గట్టిపోటీ ఇవ్వగా ఆయా స్థానాల్లో వైకాపా అభ్యర్థులు ఓటమిపాలయ్యారు. 37 జడ్పీటీసీ స్థానాలూ వైకాపాకే దక్కినా శ్రీకాకుళం, సరుబుజ్జిలి, ఇచ్ఛాపురం తదితర స్థానాల్లో తెదేపా అభ్యర్థులు గట్టి పోటీ ఇచ్చారు.

అదృష్ట విజేత..

సోంపేట మండలంలోని కొర్లాం ప్రాదేశికంలో లెక్కింపులో వైకాపా, తెదేపా అభ్యర్ధులిద్దరికీ సమాన ఓట్లు(875) వచ్చాయి. దీంతో అధికారులు టాస్‌ వేశారు. తెదేపా అభ్యర్థిని టాస్‌ వరించింది. దీంతో ఆ పార్టీ తరపున బరిలో నిలిచిన రాంబుడ్డి లైలావతి విజయం సాధించినట్టు అధికారులు ప్రకటించారు.

నాడు సర్పంచ్‌.. నేడు ఎంపీటీసీ సభ్యుడు

విటి మండలం కొజ్జిరియాకు చెందిన వైకాపా అభ్యర్థి ఉప్పాడ నీల సర్పంచి, ప్రాదేశిక ఎన్నికల్లో రెండింటా విజయం సాధించి ప్రత్యేకత సాధించారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో జరిగిన సర్పంచి ఎన్నికల్లో 57 ఓట్లు మెజార్టీ సాధించగా తాజాగా 573 ఓట్లతో కొజ్జిరియా ఎంపీటీసీ అభ్యర్థిగా విజయం సాధించారు. నిబంధనల ప్రకారం ఏదో ఒక పదవిని వదులుకోవాల్సి ఉంటుంది.

విజయంలోనూ సగమై..

మె విజయం సాధించి.. ఆయన విజయానికి పూర్ణతనిచ్చింది. భార్యాభర్తలిద్దరూ ఎంపీటీసీలుగా విజయం సాధించి ఈ ఘనతను సొంతం చేసుకున్నారు. సోంపేట మండలం జడ్పీటీసీ మాజీ సభ్యుడు డాక్టర్‌ ఎన్‌.దాసు సొంతగ్రామ జింకిభద్ర నుంచి ఎంపీటీసీగా పోటీ చేయగా, ఆయన సతీమణి ఎన్‌.లీలారాణి సుంకిడి నుంచి పోటీచేశారు. ఆదివారం నాటి లెక్కింపులో ఇద్దరూ విజయం సాధించారు.

ఇదీ చదవండి

parishath elections results: అనంతపురం జిల్లాలో పరిషత్ ఫలితాలు

Last Updated :Sep 20, 2021, 9:08 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.