అధికారుల నిర్లక్ష్యంతో.. అధ్వానంగా ప్రసిద్ధ క్షేత్రం శ్రీకూర్మం

author img

By

Published : Jan 19, 2023, 8:28 AM IST

Updated : Jan 19, 2023, 10:14 AM IST

SRI KURMAM TEMPLE

SRI KURMAM TEMPLE : ప్రపంచంలో ఎంతో ప్రసిద్ధిగాంచిన శ్రీకూర్మం పుణ్యక్షేత్రంలో ఆలయ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఎన్నో శతాబ్దాల కాలం నాటి ఆనవాళ్లకు బీటలు పడుతున్నాయి. సరైన నిర్వహణ లేని కారణంగా ఆలయ రాతి గోడలతో పాటు ధర్మసత్రం, శ్వేత పుష్కరిణి నిరుపయోగంగా మారుతున్నాయని స్థానికులు.. అధికారులు తీరు పట్ల విమర్శిస్తున్నారు.

SRI KURMAM TEMPLE : ఎన్నో శతాబ్దాల చరిత్ర కలిగిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీకూర్మం.. అధికారుల నిర్లక్ష్యానికి గురై కునారిల్లుతోంది. కూర్మావతార రూపంలో మహావిష్టువును చూసేందుకు వచ్చే భక్తులకు.. పెచ్చులూడుతున్న గోడలు, నాచుపట్టిన శ్వేత పుష్కరిణి, నిరుపయోగంగా మారిన ధర్మసత్రం.. స్వాగతం పలుకుతున్నాయి. ప్రభుత్వం, ఆలయ అధికారులతో పాటు దాతలు చొరవ చూపి పుణ్యక్షేత్రాన్ని ఆధునీకరించాలని స్థానికులు కోరుతున్నారు.

శ్రీకాకుళం నుంచి 15 కిలో మీటర్ల దూరంలో ఉన్న శ్రీకూర్మంలో శ్రీమహావిష్ణువు కూర్మావతార రూపంలో దర్శనమిస్తున్నారు. ఈ మహా పుణ్యక్షేత్రాన్నిరెండో శతాబ్దానికి ముందే నిర్మించినట్లు ఇక్కడి స్థలపురాణం చెబుతోంది. చోళ, కళింగ, ఆంధ్రతో పాటు అనేక రాజవంశీయులు.. ఆలయాన్ని దశలవారీగా అభివృద్ధి చేశారు. 11వ శతాబ్దానికి చెందిన శాసనాలతో పాటు ఆలయానికి అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. స్వయంగా దేవతలే శ్రీకూర్మనాథ స్వామి వారిని ప్రతిష్ఠించారని భక్తుల నమ్మకం. ఎంతో ఘన చరిత్ర కలిగిన పుణ్యక్షేత్రం.. దేవాదాయ శాఖ అధికారుల నిర్లక్ష్యంతో బీటలు వాలుతోంది. గర్భాలయం ప్రధాన ప్రహరీ గోడలు పెచ్చులూడుతున్నాయి.

ఆలయం ఎదురుగా ఉన్న శ్వేత పుష్కరిణిలో భక్తులు చెత్తాచెదారం వేయడంతో.. దుర్గందబరితంగా మారిపోయింది. ప్రతిరోజు స్వామి వారి కైంకర్యాలకు శ్వేత పుష్కరిణి నీళ్లే వాడుతారు. అధికారులు చొరవ చూపి పుష్కరిణితో పాటు ఆలయాన్ని ఆధునీకరించాలని స్థానికులు కోరుతున్నారు. పలుమార్లు అధికారులకు విన్నవించుకున్నా పట్టించుకోవడంలేదని.. గ్రామస్థులు వాపోతున్నారు.

శ్రీకూర్మం ఆలయానికి దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల నుంచి భక్తులు వస్తూ ఉంటారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు.. సరైన వసతులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పుష్కరిణిలో స్నానం చేసే మహిళలు.. వస్త్రాలు మార్చుకోవడానికి గదులు, మరుగుదొడ్లు లేక అవస్థలు పడుతున్నారు. తి.తి.దే. ఆధ్వర్యంలో 1970లో సత్రం నిర్మించినా.. ఆలయ అధికారుల నిర్లక్ష్యంతో శిధిలావస్థకు చేరింది. కొద్దిపాటి మరమ్మతులు చేస్తే ధర్మసత్రాన్ని భక్తులకు అందుబాటులోకి తీసుకురావచ్చని... స్థానికులు చెబుతున్నారు.

అధికారుల నిర్లక్ష్యంతో.. అధ్వానంగా ప్రసిద్ధ క్షేత్రం శ్రీకూర్మం

ఇవీ చదవండి:

Last Updated :Jan 19, 2023, 10:14 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.