ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్.. ముందంజలో ఎవరెవరున్నారంటే..!

author img

By

Published : Mar 16, 2023, 9:48 PM IST

Updated : Mar 16, 2023, 10:22 PM IST

MLC elections

MLC elections counting Updates: 13వ తేదీన జరిగిన ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్​ కొనసాగుతోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులు గెలుపొందారు. ఇక 3 పట్టభద్రుల, 2 ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉదయం గంటలకు ప్రారంభమై.. ఇంకా సాగుతోంది. ఇప్పటివరకూ వెల్లడైన ఓట్ల లెక్కింపు ప్రకారం.. ఎవరెవరు ముందంజలో ఉన్నారు? ఎంతమంది అభ్యర్థులు గెలుపొందారు? ఇప్పటివరకూ ఎన్ని రౌండ్లు పూర్తయ్యాయనే వివరాలను అధికారులు వెల్లడించారు.

MLC elections counting Updates: రాష్ట్రంలో మార్చి 13వ తేదీన 3 గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ స్థానాలతో పాటు, 2 ఉపాధ్యాయ, 4 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. పోలింగ్ జరిగిన ఆ 9 ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ఈరోజు ఉదయం 8 గంటల నుండి ప్రారంభమైంది. మూడు పట్టభద్రులు, రెండు ఉపాధ్యాయ, నాలుగు స్థానిక సంస్థల నియోజ­క­వర్గాలకు మొత్తం 139 మంది అభ్యర్థులు పోటీ చేశారు. ఈ క్రమంలో పట్టభద్రులు, టీచర్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్ల సంఖ్య భారీ సంఖ్యలో ఉండటంతో తుది ఫలితాలు వెల్లడయ్యే సరికి ఇంకొంత సమయం పట్టే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఇప్పటివరకూ వెల్లడైన ఓట్ల లెక్కింపు ప్రకారం.. ఎవరెవరు ముందజలో ఉన్నారు? ఎంతమంది అభ్యర్థులు గెలుపొందారు? ఇప్పటివరకూ ఎన్ని రౌండ్లు పూర్తయ్యాయి? అనే వివరాలను అధికారులు వెల్లడించారు.

శ్రీకాకుళంలో వైఎస్సార్‌సీపీ విజయం: శ్రీకాకుళం జిల్లాలో వెల్లడైన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో.. ఇచ్ఛాపురం నియోజకవర్గానికి చెందిన వైసీపీ అభ్యర్థి నర్తు రామారావు గెలుపొందారు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పరిధిలోని 4 డివిజన్‌ల్లో 7వందల 76 ఓట్లకు గాను.. ఏడు వందల 52 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. అందులో 12 ఓట్లు చెల్లలేదు. దీంతో వైసీపీ నేత రామారావుకు 632 ఓట్లు రాగా.. స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచిన ఆనేపు రామకృష్ణకు 108 ఓట్లు పోల్‌ అయ్యాయి. ఈ సందర్భంగా నర్తు రామారావు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే తన విజయానికి కారణమయ్యాయని అన్నారు.

పశ్చిమగోదావరిలో వైఎస్సార్‌సీపీ విజయం: పశ్చిమ గోదావరి జిల్లాలో స్థానిక సంస్థల రెండు ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికల ఫలితాల్లో రెండు స్థానాల్లోనూ వైసీపీ అభ్యర్థులే గెలుపొందారని అధికారులు తెలిపారు. వైసీపీ అభ్యర్థులు కవురు శ్రీనివాస్‌, వంకా రవీంద్రనాథ్‌ విజయం సాధించినట్లు ప్రకటించారు. జిల్లావ్యాప్తంగా మొత్తం 1105 ఓట్లు ఉండగా.. అందులో 1088 మంది స్థానిక ప్రజాప్రతినిధులు ఓటు వేశారన్నారు. దీంతో వైసీపీకి చెందిన కవురు శ్రీనివాస్‌కు 481 మొదటి ప్రాధాన్యత ఓట్లు.. వంకా రవీంద్రనరాథ్‌కు 460 ఓట్లు రాగా.. స్వతంత్ర అభ్యర్థి వీరవల్లి చంద్రశేఖర్‌కు 120 ఓట్లు వచ్చాయని వెల్లడించారు.

కర్నూలులో వైఎస్సార్‌సీపీ విజయం: కర్నూలు జిల్లాలో జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో.. వైసీపీ అభ్యర్థి డాక్టర్ మధుసూదన్ గెలుపొందారు. సిల్వర్ జూబ్లీ కళాశాలలో జరిగిన ఓట్ల లెక్కింపులో.. వైసీపీ అభ్యర్థి గెలుపొందినట్లు అధికారులు ప్రకటించారు. మొత్తం 1,136 ఓట్లు పోలవ్వగా.. అందులో 53 ఓట్లు చెల్లనివిగా అధికారులు తేల్చారు. దీంతో వైసీపీ అభ్యర్థికి 988 ఓట్లు రాగా.. స్వతంత్ర అభ్యర్థులు మోహన్ రెడ్డికి 85, వెంకట వేణుగోపాల్ రెడ్డికి 10 ఓట్లు వచ్చాయని తెలిపారు.

చిత్తూరులో కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు: చిత్తూరులోని ఆర్వీఎస్ ఇంజనీరింగ్ కళాశాలలో తూర్పు రాయలసీమ పట్టభద్రులు, ఉపాధ్యాయుల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. స్ట్రాంగ్ రూముల్లోని బ్యాలెట్ పెట్టెలను తెరచి.. అధికారులు లెక్కింపు చేపట్టారు. పట్టభద్రుల ఓట్ల లెక్కింపునకు 40 టేబుల్స్, ఉపాధ్యాయులకు ఓట్ల లెక్కింపునకు 14 టేబుళ్లు ఏర్పాటు చేశారు. రిటర్నింగ్ అధికారులు హరినారాయణన్, వెంకటేశ్వర్, ఓట్ల లెక్కింపు పరిశీలకులు కాటంనేని భాస్కర్, కోన శశిధర్ తదితరుల సమక్షంలో లెక్కింపు కొనసాగుతోంది. మొత్తం 916 మంది ఎన్నికల సిబ్బంది ఓట్ల లెక్కింపు చేపడుతున్నారు. ఈ క్రమంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపులో గందరగోళం నెలకొంది. చెల్లని ఓట్లను లెక్కించాలని వైసీపీ మద్దతు అభ్యర్థి డిమాండ్ చేయడంతో.. పీడీఎఫ్ అభ్యర్థి, ఏజెంట్లు అతడిని అడ్దుకున్నారు. దీంతో పది నిమిషాల పాటు ఓట్ల లెక్కింపు నిలిచిపోయింది.

పశ్చిమ రాయలసీమలో తొలి రౌండు పూర్తి: పశ్చిమ రాయలసీమలో ఉపాధ్యాయ ఓట్ల లెక్కింపునకు సంబంధించి తొలి రౌండు పూర్తైనట్లు అధికారులు తెలిపారు. తొలి రౌండ్‌లో మొత్తం 13,997 ఓట్లు లెక్కించగా.. అందులో 13,674 ఓట్లు చెల్లుబాటు అయ్యేవిగాను, 323 ఓట్లు చెల్లనివిగాను అధికారులు గుర్తించారు. తొలి రౌండులో వైసీపీ బలపరుస్తున్న రామచంద్ర రెడ్డికి 4,756 ఓట్లు రాగా, ఏపీటీఎఫ్ బలపరుస్తున్న ఒంటేరు శ్రీనివాసరెడ్డికి 3,543 ఓట్లు వచ్చాయన్నారు. ఇక, రెండో రౌండ్‌ ఓట్ల లెక్కింపు పూర్తయ్యే సరికి.. వైసీపీ మద్దతు అభ్యర్థి రామచంద్రారెడ్డికి 4,090 ఓట్లు రాగా.. ఏపీటీఎఫ్‌ మద్దతు అభ్యర్థి ఒంటేరు శ్రీనివాసులురెడ్డికి 3,310 ఓట్లు వచ్చాయన్నారు. రామచంద్రారెడ్డికి 2 రౌండ్లలో తొలి ప్రాధాన్యత ఓట్లు 8,846 రాగా, శ్రీనివాసులురెడ్డికి 2 రౌండ్లలో తొలి ప్రాధాన్యత ఓట్లు 6,853 పోల్ అయ్యాయని తెలిపారు. రెండో రౌండ్‌లో చెల్లని ఓట్లు 285గా గుర్తించామన్నారు

అనంతలో కొనసాగుతున్న ఎన్నికల ప్రక్రియ: అనంతపురం జిల్లా జెఎన్టీయు కళాశాలలో ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. కౌంటింగ్ ప్రక్రియను జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి పర్యవేక్షిస్తున్నారు. ఎన్నికల పరిశీలకులు పోలా భాస్కర్, హరి జవహర్లాల్ ఆధ్వర్యంలో కౌంటింగ్ ప్రక్రియను కొనసాగుతోంది. పశ్చిమ రాయలసీమ పట్టభద్రులకు సంబంధించి 49 మంది అభ్యర్థులు.. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి.. 12 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.

ఉత్తరాంధ్రలో ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు కొనసాగింపు: ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి ఓట్లు లెక్కింపు ప్రక్రియ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఆరు జిల్లాలో పోలైన ఓట్ల పోలింగ్‌కు విశాఖపట్నంలోని స్వర్ణ భారతిలో లెక్కింపు ప్రక్రియను నిర్వహిస్తున్నారు. మొత్తం 69 .47 శాతం ఓటింగ్ జరుగగా, అందులో మొత్తం 200296 లక్షలు ఓట్లు పోల్ అయ్యాయని అధికారులు తెలిపారు.

ఇవీ చదవండి

Last Updated :Mar 16, 2023, 10:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.