గుండ్లకమ్మ జలాశయంలో దెబ్బతిన్న మూడో గేటు.. వృథాగా పోతున్న నీరు

author img

By

Published : Sep 1, 2022, 5:22 PM IST

Updated : Sep 2, 2022, 6:28 AM IST

GUNDLAKAMMA PROJECT

GUNDLAKAMMA PROJECT:గుండ్లకమ్మ ప్రాజెక్టు స్పిల్ వే రెగ్యులేటర్ ప్రధాన గేట్ దెబ్బతినడంతో నీరు వృథాగా పోతోంది. మూడో గేటు అడుగు భాగం ధ్వంసమై.. బుధవారం రాత్రి తొమ్మిది గంటల నుంచి నీటి ప్రవాహానికి అడ్డుకట్ట పడటం లేదు. గేటు మూసేందుకు అధికారులు శతవిధాలా ప్రయత్నిస్తున్నా ఫలితం లేదు. స్టాప్ లాక్ ద్వారా లీకేజ్ అరికట్టేందుకు చేపట్టిన చర్యలు విఫలమైనట్లు తెలుస్తోంది. నిర్వహణా లోపం వల్లే ప్రాజెక్టు గేట్లు దెబ్బతిన్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి.

గుండ్లకమ్మ జలాశయంలో దెబ్బతిన్న మూడో గేటు.. వృథాగా పోతున్న నీరు

GUNDLAKAMMA PROJECT : ప్రకాశం జిల్లాలోని మద్దిపాడు వద్ద ఉన్న గుండ్లకమ్మ జలాశయం మూడో గేటు దెబ్బతింది. గేటు కింది భాగంలో ఉన్న రెండు అరలు దెబ్బతిని, నీళ్లు భారీగా కిందికి పోతున్నాయి. లీకేజీని బుధవారం రాత్రి 9 గంటల తర్వాత సిబ్బంది గుర్తించి, ప్రాజెక్టు అధికారులకు సమాచారం ఇచ్చారు. నిపుణులు, సిబ్బంది రంగంలోకి దిగి చర్యలు చేపడుతున్నా నీటి వృథాను నియంత్రించలేకపోతున్నారు. గురువారం రాత్రికి జలాశయం నుంచి సుమారు టీఎంసీ జలాలు సముద్రం పాలయ్యాయి. ఇన్‌ఫ్లో ఎక్కువ కావడంతో గేటు ఎత్తి నీళ్లు వదులుతున్నట్లు చెప్పి సమస్యను కప్పిపుచ్చేందుకు తొలుత అధికారులు యత్నించారు. మరోవైపు 6, 7, 12 గేట్ల నుంచి కూడా నీరు లీకవుతుంది.

చేతులెత్తేసిన ప్రైవేట్‌ సిబ్బంది
పీడబ్ల్యూ వర్క్‌షాప్‌ సిబ్బంది లేకపోవడంతో గురువారం మధ్యాహ్నం 12 గంటలకు నరసాపురం నుంచి ప్రైవేటు గుత్తేదారును పిలిపించారు. మూడో గేటుకు ముందువైపు స్టాప్‌ లాక్స్‌తో ప్రవాహాన్ని అరికట్టడానికి పనులు చేపట్టారు. ప్రవాహం ఎక్కువగా ఉండటంతో అవి కూడా కొట్టుకుపోయే పరిస్థితి ఏర్పడి, వారూ చేతులెత్తేశారు. స్టాప్‌ లాక్స్‌ను ఒక్కొక్కటిగా కిందికి దించేందుకు ఉపయోగించే మోటర్ల వైర్లను ఎలుకలు కొరికేయడంతో సాయంత్రం 6.30 గంటలకు పనులు నిలిపేశారు.

తర్వాత వెలిగొండ ప్రాజెక్టు నిపుణులతో పాటు ఇతర ప్రాంతాల నుంచి సిబ్బందిని పిలిపించారు. మూడో గేటును కిందికి దించితే పైన ఏర్పడే ఖాళీ ద్వారా ఎక్కువ నీళ్లు పోయే ప్రమాదం ఉందని, ప్రత్యామ్నాయంగా ఏం చేయాలన్నదానిపై చర్చిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితిని చూస్తే జలాశయంలో నీళ్లు మొత్తం ఖాళీ అయ్యే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. వర్షాలు అంతంతమాత్రంగా ఉన్న సమయంలో నీళ్లన్నీ ఇలా వృథాగా పోవడంతో ఖరీఫ్‌, రబీ పంటలకు ఇబ్బందులు తప్పవని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పై నుంచి వరద రాకపోయినా గేటు దెబ్బతిందని.. ఎగువ నుంచి వరద వచ్చి ఉంటే ఏకంగా గేట్లు కొట్టుకుపోయి దిగువన ఉన్న నాలుగు గ్రామాలు మునిగిపోయి ఉండేవని స్థానికులు చెబుతున్నారు.

జూన్‌లో రూ.89 లక్షలకు పాలనామోదం
గుండ్లకమ్మకు ఇటీవల బదిలీపై వచ్చిన చీఫ్‌ ఇంజినీర్‌ మురళీనాథ్‌రెడ్డి ప్రాజెక్టు స్థితిగతులపై పరిశీలన జరిపారు. మొదట అత్యవసరంగా 6, 7 నంబరు గేట్లు బాగు చేయాల్సి ఉందని, ఇందుకు రూ.89 లక్షలు అవసరమవుతాయని నాలుగు నెలల క్రితం ఇంజినీరింగ్‌ అధికారులు ప్రతిపాదనలు పంపారు. జూన్‌ నెలలో ప్రభుత్వం పాలనామోదం ఇచ్చింది. టెండర్లు కూడా పూర్తయ్యాయి. ఈలోగా వర్షాలు, వరదలు రావడంతో ఆ మరమ్మతు పనులు కూడా ప్రారంభం కాలేదు. తాజాగా దెబ్బతిన్న మూడో నంబరు గేటు మరమ్మతులకు సైతం ఏడాది క్రితమే ప్రతిపాదనలు వెళ్లినా నిధులు రాలేదు.

మూడేళ్లుగా పర్యవేక్షణ గాలికి
గుండ్లకమ్మ నదిపై ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం మల్లవరం వద్ద 2006లో కందుల ఓబులరెడ్డి గుండ్లకమ్మ జలాశయం పేరుతో నిర్మాణం తలపెట్టారు. 2008లో దీనిని ప్రారంభించారు. ప్రాజెక్టు పర్యవేక్షణను దాదాపు మూడేళ్లుగా గాలికొదిలేశారు. కేవలం 12 మంది తాత్కాలిక సిబ్బందితో నెట్టుకొస్తున్నారు. రెండేళ్లకోసారి చేపట్టే నిర్వహణా నామమాత్రంగా మారడంతో గేట్లు తుప్పు పట్టాయి. కొన్ని గేట్ల వద్ద గ్రీజు పూసిన ఆనవాళ్లు కూడా లేవు. కుడి, ఎడమ కాలువల నిర్వహణ కూడా సరిగా లేదు. ప్రాజెక్టు నిర్మాణ సంస్థ గేట్ల ఏర్పాటులో తగిన జాగ్రత్తలు తీసుకోలేదనే విమర్శలూ వినిపిస్తున్నాయి.

నీటిలో రసాయనాల వల్లనే గేట్లకు తుప్పు: ఈఈ
పీడబ్ల్యూ వర్క్‌షాప్‌ ఈఈ గుణకరరావు (గుంటూరు) మాట్లాడుతూ నీటిలో రసాయనాల శాతం ఎక్కువ ఉండటంతో గేట్లకు తుప్పుపట్టి సమస్య ఉత్పన్నమైందన్నారు.. మూడో గేటు కిందిభాగంలో దెబ్బతిన్న రెండు లేయర్లను మార్చాల్సి ఉందని, దీనికి రూ.80 లక్షలు అవుతుందని అంచనా వేశామన్నారు. మిగిలిన అన్ని గేట్లకు రూ.2.2 కోట్లతో మరమ్మతులకు ప్రతిపాదించామన్నారు.. దెబ్బతిన్న గేటు వద్ద స్టాప్‌ లాక్స్‌తో ప్రవాహాన్ని ఆపుతామన్నారు. పదిరోజుల్లో అంచనాలు రూపొందించి, రెండు నెలల్లో మొత్తం పనులు పూర్తి చేస్తామని చెప్పారు.

మూడు కోట్లు ఇవ్వక ముప్పు..దస్త్రం నేటికీ ఆర్థికశాఖలో పెండింగ్‌

కరవు ప్రాంతం ప్రకాశం జిల్లాలో కీలకమైన గుండ్లకమ్మ ప్రాజెక్టు నిర్వహణకు సకాలంలో ప్రభుత్వం నిధులివ్వకపోవడంతోనే తాజాగా గేటు ధ్వంసమై విలువైన జలాలు వృథా అవుతున్నాయి. 2012లో తొలిసారిగా జలాశయాన్ని పూర్తి స్థాయిలో నింపారు. అప్పటి నుంచి దశాబ్దం కూడా గడవక ముందే ప్రాజెక్టులో కీలకమైన గేట్లు తుప్పు పట్టిపోయాయి. మొత్తం 15 గేట్లలో 10 గేట్లకు మరమ్మతులు చేయాలని జలవనరులశాఖ ఇంజినీర్లు రెండేళ్ల కిందటే గుర్తించారు. సుమారు రూ.3 కోట్లతో అంచనాలు సిద్ధం చేసి, ఉన్నతాధికారులకు పంపారు. అప్పటి నుంచి ఆ దస్త్రం రకరకాల కారణాలు, వివరణలతో అనేకసార్లు రాష్ట్ర ఉన్నతాధికారులకు, ప్రాజెక్టు అధికారులకు మధ్య తిరిగి ప్రస్తుతం ఆర్థిక శాఖలో పెండింగ్‌లో ఉంది. ప్రాజెక్టు గేట్లకు మరమ్మతులు చేయాలని గుర్తించాక రెండు వరద కాలాలు గడిచిపోతున్నా ఉన్నతాధికారులు సకాలంలో స్పందించకపోవడం, పనులకు పాలానామోదం ఇవ్వకపోవడంతో తాజా సమస్య తలెత్తింది.

.
.


ఇవీ చదవండి:

Last Updated :Sep 2, 2022, 6:28 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.