Ongole-Hyderabad Interstate Highway : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒంగోలు-హైదరాబాద్ మధ్య ప్రయాణ దూరం, సమయం తగ్గించే విధంగా నార్కట్పల్లి-అద్దంకి-మేదరమెట్ల అంతర్రాష్ట్ర రహదారి నిర్మించాలని ప్రతిపాదించారు. 212 కిలోమీటర్ల దూరం ఉన్న ఈ రహదారిని విస్తరించి, 4 లైన్లుగా నిర్మాణం చేపట్టాలని.. కిలో మీటర్కు కోటి రూపాయల చొప్పున అంచనా వ్యయంతో పనులు ప్రారంభించారు. 2018లో పనులు మొదలైనా.. చాలాచోట్ల అసంపూర్తిగానే దర్శనమిస్తున్నాయి. ప్రకాశం జిల్లా అద్దంకి, గోపాలపురం, ఏల్చూరు ప్రాంతాల్లో భూసేకరణ సమస్యతో పనులు నిలిచిపోయాయి. వాహనదారులు, గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
తరచూ ప్రమాదాలు
నార్కట్పల్లి-అద్దంకి రహదారి ఎలైన్మెంట్లు ఎప్పటికప్పుడు మారిపోతూనే ఉన్నాయి. మలుపులు లేని రహదారిగా నిర్మించాలని భావించినా కొంతమంది అభ్యంతరాలు చెప్పడంతో మార్పు చేశారు. రహదారి మొత్తం 110 అడుగుల వెడల్పుతో ఉండాలి. కానీ అద్దంకి పట్టణంలో 90 అడుగులకు పరిమితం చేశారు. సర్వీస్ రోడ్లూ సక్రమంగా వేయలేదు. కొన్ని గ్రామాల్లో ఒకవైపు రహదారి నిర్మించి, రెండో వైపు వదిలేశారు. రోడ్లు అస్తవ్యస్థంగా ఉన్నందున తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. గ్రామాల మధ్యలో రహదారి సక్రమంగా లేక ఇబ్బందులు పడుతున్నామని, డివైడర్లు నిర్మించకుండా అస్థవ్యస్థంగా రహదారికి అడ్డంగా పెద్దపెద్ద కాంక్రీట్ దిమ్మలు వేయడం వల్ల తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని.. స్థానికులు అంటున్నారు.
అద్దంకి పట్టణంలో 2008లో రహదారి విస్తరణ పనులను ప్రారంభించారు. గుత్తేదారులు అస్థవ్యస్థంగా పనులు చేపట్టారు. దాని ఫలితంగా ప్రమాదాలకు గురై.. దాదాపు 400 మంది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. అధికారులు వస్తారు.. చూస్తారు. తరువాత ఎవరూ పట్టించుకోవటం లేదు.- స్థానికులు
ఇదీ చదవండి