కూలీ కోసం ప్రకాశం జిల్లాలోని సంతనూతలపాడుకు వచ్చిన తమను నిర్బంధించి వెట్టిచాకిరీ చేయించుకుంటున్నారంటూ ఛత్తీస్గఢ్ కూలీలు అక్కడి ప్రజాప్రతినిధులు, అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు జిల్లా యంత్రాంగం కదిలింది. పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి నిజానిజాలు గుర్తించి వారిని సొంత ప్రాంతానికి తరలించారు.
వివరాలు ఇలా...
ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన 15 మంది కూలీలు పనుల కోసం ప్రకాశం జిల్లాకు వచ్చారు. వీరికి సీఎస్పురానికి చెందిన శ్రీను పని చూపారు. కూలీలు పేర్నమిట్టలో అద్దెకు ఉంటూ నెలకు రూ.10 వేల జీతంపై ఒంగోలు పరిసర ప్రాంతాల్లో భవన నిర్మాణ పనులు చేస్తున్నారు. వీరిలో నలుగురు కూలీలు ఇటీవల తమ రాష్ట్రం వెళ్లారు. తమతో పాటు మరికొందరిని నిర్బంధించి వెట్టిచాకిరీ చేయించుకుంటూ ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ జగ్దల్పూర్ ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆయన విషయాన్ని బస్తర్ జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన కూలీల నిర్బంధంపై విచారించి వెంటనే స్వగ్రామాలకు పంపించేలా చర్యలు తీసుకోవాలని ప్రకాశం జిల్లా కలెక్టర్ను కోరారు. కలెక్టర్ ప్రవీణ్ కుమార్ ఆదేశాల మేరకు ఛత్తీస్గఢ్ నుంచి వచ్చిన అధికారులతో కలిసి సంతనూతలపాడు తహసీల్దార్ రామానాయుడు, కార్మిక శాఖ అధికారులు, పోలీసులు శుక్రవారం క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టారు. కూలీలు పనిచేస్తున్న ప్రాంతాల్లో పర్యటించి మాట్లాడారు. చివరికి కూలీ, ఖర్చులు మొత్తం కలిపి ఇప్పించి సొంత ప్రాంతానికి పంపారు.
ఇదీ చదవండి : CPI NARAYANA: 'పోర్టుల ప్రైవేటీకరణ వల్ల దేశ భద్రతకు ప్రమాదం'