దాడులు.. లాఠీచార్జీలు..! సవాళ్లు.. ప్రతిసవాళ్ల మధ్య మండలి ఎన్నికల పోలింగ్

author img

By

Published : Mar 13, 2023, 7:04 PM IST

Updated : Mar 13, 2023, 7:18 PM IST

MLC

AP MLC Election Fightings In Four Districs: పట్టుభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌ సందర్భంగా రాష్ట్రంలో పలుచోట్ల ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎక్కడికక్కడ వైసీపీ, తెలుగుదేశం శ్రేణుల మధ్య ఘర్షణలు, వాగ్వాదాలు చోటు చేసుకున్నాయి. నాయకుల మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్లతో మండలి ఎన్నికలు.. సార్వత్రిక పోరును తలపించాయి. అప్రమత్తమైన పోలీసులు రంగప్రవేశం చేసి, ఇరువర్గాలపై లాఠీచార్జ్ చేసి చెదరగొట్టారు.

AP MLC Election Fightings In Four Districs: ఆంధ్రప్రదేశ్‌లో శ్రీకాకుళం-విజయనగరం-విశాఖపట్నం, ప్రకాశం- నెల్లూరు-చిత్తూరు, కడప- అనంతపురం-కర్నూలు పట్టభధ్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గాలు, ప్రకాశం-నెల్లూరు- చిత్తూరు, కడప-అనంతపురం-కర్నూలు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలు.., పశ్చిమ గోదావరిలో 2, శ్రీకాకుళం, కర్నూలు స్థానిక సంస్థల కోటా నియోజకవర్గాల్లో ఇవాళ జరిగిన పోలింగ్‌.. పలుచోట్ల ఉద్రిక్తతకు దారి తీసింది. సీఎం జగన్‌ సొంత నియోజకవర్గం పులివెందులలోని.. లింగాల పోలింగ్ కేంద్రం వద్ద వైకాపా నాయకులు రెచ్చిపోయారు.

తీవ్రమైన ఘర్షణలు: పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేసి, ఎటువంటి ఘర్షణలు జరగకుండా పహారా కాశారు. కానీ, ప్రకాశం జిల్లా ఒంగోలులో, తిరుపతిలో, వైఎస్సార్ జిల్లాలోని పులివెందులలో టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య తీవ్రమైన ఘర్షణలు చోటుచేసుకున్నాయి.

ప్రకాశం జిల్లాలో టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ: ప్రకాశం జిల్లా ఒంగోలులో జరిగిన మండలి ఎన్నికలు సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మధ్య గొడవ జరిగింది. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి లాఠీచార్జీ చేశారు. ఒంగోలు శ్రీనివాస కాలనీలో ఉన్న సెయింట్ థెరీసా పోలింగ్ కేంద్రం వద్ద తెలుగుదేశం కార్యకర్త ఒకరు.. వైసీపీ వాళ్లను చూసి సవాల్ విసిరానే కారణంగా వైసీపీ కార్యకర్తలు అతడిపై తీవ్రంగా దాడి చేశారు. పోలీసులు అతడిని అదుపులో తీసుకునేందుకు ప్రయత్నించగా అతడు ఓ కళ్యాణమండపంలో దాక్కున్నారు.

దీంతో ఎమ్మెల్యే బాలినేనికి సమాచారం ఇవ్వడంతో ఆయన పోలింగ్ కేంద్రానికి చేరుకొని తెలుగుదేశం కార్యకర్తను తనకు అప్పగించాలని పోలీసులకు పురమాయించారు. పోలీసులు పిలిచినా అతడు రాకపోయేసరికి పోలీసులను వెంటపెట్టుకొని బాలినేని, కార్యకర్తలు కళ్యాణమండపానికి చేరుకొని ఆ కార్యకర్తలపై దాడి చేశారు.. తెలుగుదేశం కార్యకర్తలు అక్కడకు చేరుకోవడంతో పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. ఈ విషయం తెలుసుకొని మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ అక్కడకు చేరుకొని పోలీసుల తీరును నిలదీశారు. ఇరుపార్టీల కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ గొడవ కారణంగా మెయిన్ రోడ్డు‌లో ట్రాఫిక్ స్తంభించింది... ఓటర్లుకు స్లిప్లు ఇచ్చే శిబిరాలు కూడా వైసీపీ, తెలుగుదేశ పార్టీలు పక్కపక్కనే ఉండటం వల్ల ఇరు పార్టీలు కార్యకర్తలు కేకలు వేసుకున్నారు.

సవాళ్లు.. ప్రతిసవాళ్ల మధ్య మండలి ఎన్నికల పోలింగ్

కనిగిరి ప్రభుత్వ ఉన్నత పాఠశాల వద్ద ఉద్రిక్తత: ప్రకాశం జిల్లా కనిగిరి ప్రభుత్వ ఉన్నత పాఠశాల వద్ద వైసీపీ, టీడీపీ నాయకుల మధ్య తోపులాట జరిగి.. ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. వైసీపీకి చెందిన కొందరు వ్యక్తులు పోలింగ్ బూతులు వద్దకు వెళ్లి ఓట్లను ప్రభావితం చేస్తుండటంతో ప్రశ్నించేందుకు వచ్చిన కనిగిరి టీడీపీ ఇంచార్జ్ ఉగ్ర నరసింహ రెడ్డినీ పోలీసులు అడ్డుకున్నారు. ప్రధాన గేటు వద్దనుంచే వెనక్కి వెళ్లాలని పోలీసులు హెచ్చరించడంతో.. వైసీపీ నాయకులకు పోలింగ్ బూతుల వద్ద వారికేం పని అని ప్రశ్నించారు. దీంతో వైసీపీ నాయకులు ఒక్కసారిగా టీడీపీ నాయకులపై విరుచుకుపడి వివాదానికి తీరతీశారు. వెంటనే పోలీసులు అప్రమత్తమై ఇరుపార్టీ నాయకులను చెదరకొట్టడంతో వివాదం సద్దుమణిగింది.

టీడీపీ ఇన్‌చార్జ్‌ను అడ్డుకున్న వైసీపీ శ్రేణులు: మరోవైపు శాసనమండలి ఎన్నికల పోలింగ్‍ సరళిని పరిశీలించేందుకు వెళ్లిన తిరుపతి నియోజకవర్గ టీడీపీ ఇన్‍‌చార్జ్ సుగుణమ్మను వైసీపీ శ్రేణులు అడ్డుకున్నారు. అనంతరం ఆమె సంజయ్‍ గాంధీ కాలనీ పోలింగ్‍ కేంద్రం వద్ద మీడియాతో మాట్లాడుతుండగా వైసీపీ కార్యకర్తలు పెద్దఎత్తున నినాదాలు చేస్తూ.. సుగుణమ్మను తోసేందుకు యత్నించారు. ఓ వైపు పోలీసులు ఉన్నా వైసీపీ కార్యకర్తలను అదుపు చేయకపోవడంపై సుగుణమ్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార పార్టీ నేతలు, కార్యకర్తలు పోలింగ్‍ కేంద్రాల వద్ద యథేచ్చగా తిరుగుతున్నా తమను మాత్రమే అడ్డుకుంటున్నారని సుగుణమ్మ విమర్శించారు. సుగుణమ్మకు అండగా నిలిచేందుకు ప్రయత్నించిన టీడీపీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకుని వాహనంలో ఎక్కించి పోలిస్ స్టేషన్లకు తరలించారు.

వైఎస్సార్ జిల్లాలో పోలింగ్ కేంద్రం వద్ద వాగ్వాదం: వైఎస్సార్ జిల్లాలోని ప్రొద్దుటూరు రమణ మహర్షి పాఠశాల పోలింగ్ వద్ద టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. టీడీపీ నేతలు పుత్తా నరసింహారెడ్డి, ప్రవీణ్ రెడ్డిలు పోలింగ్ కేంద్రం వద్దకు వెళ్లారు. ఈ క్రమంలో అక్కడే వైసీపీ నాయకుడు బంగారు మునిరెడ్డి వారిపై బూతుల దండకం అందుకున్నారు. దీంతో కాసేపు ఉద్రిక్తత నెలకొంది. అప్రమత్తమైన పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టడంతో వివాదం సద్దుమణిగింది. వైసీపీ నాయకులు ఓటర్లకు డబ్బులు పంచుతున్నారన్న సమాచారం రావడంతో టీడీపీ నేతలు పోలింగ్ కేంద్రం వద్దకు వెళ్లగా ఈ వాగ్వాదం చోటు చేసుకోవడంతో ఓటర్లు, స్థానికులు భయాంబ్రాతులకు గురయ్యారు.

పులివెందులలో రెచ్చిపోయిన వైసీపీ నాయకులు: ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గమైన పులివెందులలోని లింగాల పోలింగ్ కేంద్రం వద్ద వైసీపీ నాయకులు రెచ్చిపోయారు. టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవిపై దాడికి చేసేందుకు వైసీపీ నాయకులు యత్నించారు. ఆయనపై రాళ్లూ రువ్వుతూ.. వాహనాన్ని ధ్వంసం చేశారు. లింగాల పోలింగ్ కేంద్రంలోకి వైసీపీ నాయకులు వెళ్లడంపై బయట ఉన్న టీడీపీ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు.

దీంతో ఇరువర్గాలకు ఘర్షణ జరిగింది. టీడీపీ నాయకులకు మద్దతు తెలుపుతూ.. ఎమ్మెల్సీ బీటెక్ రవి లింగాల పోలింగ్ కేంద్రానికి విచ్చేశారు. ఆ సమయంలో మరోసారి ఉద్రిక్తత నెలకొంది. బీటెక్ రవి పోలింగ్ కేంద్రంలోకి వెళ్లకుండా వైసీపీ నాయకులు అడ్డుకొని రాళ్లు విసిరారు. పోలీసుల సమక్షంలోనే వైసీపీ నాయకులు రెచ్చిపోయారని టీడీపీ నేతలు ఆరోపించారు. ఓ వైపు పోలీసులు బీటెక్ రవిని తీసుకెళ్తుండగా వైసీపీ నాయకులు వారిని వెనకనుంచి తరుముకుంటూ వచ్చారు. ఇదే సమయంలో బీటెక్ రవి వాహనాన్ని పగలగొట్టారు. బీటెక్ రవి పోలీసులకు ఫిర్యాదు చేసి ఘటనను తీవ్రంగా ఖండించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో బీటెక్ రవిని పోలీసులు వాహనంలో ఎక్కించుకుని పులివెందుల పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు.

మూడు గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ, రెండు ఉపాధ్యాయ, నాలుగు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్​ కొనసాగింది. ఓట్ల లెక్కింపును ఈనెల 16న చేపట్టనున్నారు.

ఇవీ చదవండి

Last Updated :Mar 13, 2023, 7:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.