మేమూ చదువుకుంటాం: డంపింగ్​యార్డులోనే బాల్యం.. వెలుగులు నింపుతున్న ఓ స్వఛ్చంద సంస్థ

author img

By

Published : Jan 22, 2023, 6:15 PM IST

We also want to study..

dumping yard kids : ముక్కు మూసుకోకుండా అక్కడికి వెళ్లలేం.. కానీ, అదే డంపింగ్ యార్డుపైనే ఆధారపడి పలు కుటుంబాలు ఏళ్ల తరబడి అక్కడ నివసిస్తున్నాయి. చెత్త కుప్పల్లో దొరికే ప్లాస్టిక్, ఇనుప సామగ్రిని పోగుచేసి అమ్ముకుని పొట్ట నింపుకొంటున్నాయి. వారి పిల్లలు సైతం మట్టి కుప్పల్లో దొరికే పదార్థాలు తింటూ, పంట కాల్వ నీళ్లు తాగుతూ సమాజానికి దూరంగా బతుకుతున్నారు. ఓ స్వచ్ఛంద సంస్థ ఉపాధ్యాయురాలిని నియమించగా.. ఇప్పుడిప్పుడే అక్షరాలు దిద్దుతున్నారు. మాకూ చదువుకోవాలని ఉంది.. మధ్యాహ్న భోజనం, తాగునీటి సౌకర్యం కల్పించాలని కోరుతున్నారు... నెల్లూరు కార్పొరేషన్ పరిధిలోని దొంతాలి డంపింగ్ యార్డు చిన్నారులు.

dumping yard kids : నెల్లూరు కార్పొరేషన్ పరిధిలో దొంతాలి డంపింగ్ యార్డు వద్ద 20కుటుంబాలు నివసిస్తున్నాయి. వారితో పాటు వారి పిల్లలు సైతం డంపింగ్ యార్డులో లభించే పదార్థాలనే తింటూ దుర్గంధం మధ్య జీవనం గడుపుతున్నారు. ఆయా కుటుంబాలకు ఆధార్ కార్డులు లేకపోగా ప్రభుత్వం తరఫుల ఎలాంటి సాయమూ అందడం లేదు. వీరికి రేషన్ కార్డులే కాదు.. జనాభా లెక్కల్లోనూ పేరు లేదు. ఆయా కుటుంబాల దీనస్థితిని గమనించిన ఓ స్వచ్ఛంద సంస్థ ఉపాధ్యాయురాలిని నియమించగా ఇప్పుడిప్పుడే అక్షర జ్ఙానం నేర్చుకుంటున్నారు.

పిల్లలకు మంచి చదువు అందించాలని. మంచి జీవితాన్ని అందించాలని ప్రతి తల్లితండ్రుల కోరిక. అందరిలా చదువుకోవాలని, ఆడుకోవాలని చిన్నారుల్లోనూ ఉంటుంది. కానీ, అవకాశాలు లేక వందల కుటుంబాల్లో పిల్లలు చదువులకు దూరం అవుతున్నారు. అందులోనూ కాగితాలు ఏరుకునే జీవించే కుటుంబాల పరిస్థితి దుర్భరంగా ఉంటుంది. ఇటువంటి వారిపై ప్రభుత్వ అధికారులు దృష్టిపెట్టడంలేదు. నెల్లూరు కార్పోరేషన్ పరిధిలోని దొంతాలి డంప్పింగ్ యార్డులో చిన్నారులను పలకరిస్తే... చదువుకోవాలనే ఆనందం వారిలో కనిపించింది.

కడుదయనీయం : ప్రతి పట్టణం, ప్రతి నగరంలో కాగితాలు, ప్లాస్టిక్ డబ్బాలు, కవర్లు వంటి వ్యర్థాలను ఏరుకుని అమ్ముకుంటూ జీవనం సాగించే కుటుంబాలను రోజూ మనం రోడ్డు మీద చూస్తూనే ఉంటాం. కానీ ఎవరూ వారి జీవన పరిస్థితి ఏమిటని పట్టించుకోరు. ప్రభుత్వం కూడా వీరి జీవితాలను మెరుగుపరచాలనే ప్రయత్నం చేయడంలేదు. అందుకు సాక్ష్యమే నెల్లూరు నగరం శివారు ప్రాంతంలోని దొంతాలి వద్ద డంప్పింగ్ యార్డులో ఉన్న పరిస్థితి. 1205కుటుంబాల వారు కడుదయనీయంగా జీవనం సాగిస్తున్నారు.

చిన్నారుల కోసం చెట్ల కింద పాఠశాల : ఈ కుటుంబాల్లోని ముక్కుపచ్చలారని చిన్నారులు కూడా తల్లిదండ్రులు చూపిన దారిలోనే నడుస్తున్నారు. ఆ పిల్లలను చూస్తే సరైన ఆహారం లేక అర్థాకలితో బక్కచిక్కి అనారోగ్యంతో కనిపిస్తున్నారు. వీరి జీవితాల్లో వెలుగులు నింపాలని నవజీవన స్వచ్ఛంద సంస్థ చిరుప్రయత్నం చేసింది. డంపింగ్ యార్డులో వ్యర్ధాలను ఏరుకునే చిన్నారుల కోసం చెట్ల కింద పాఠశాలను ఏర్పాటు చేసింది. ఓ ఉపాధ్యాయురాలు సేవా భావంతో రెండు కిలోమీటర్ల దూరం నుంచి వచ్చి అక్షరాలు నేర్పిస్తున్నారు.

పోయిన సంవత్సరం సెప్టెంబర్ నుంచి చెట్ల కింద అక్షరాలు నేర్చుకుంటున్నారు. ఎంతో ఆనందంగా ఉందని , పలక బలపం తీసుకుని రాస్తున్న చిన్నారులు చెబుతున్నారు. వీరికి తాగడానికి నీరు లేక పక్కనే ఉన్న అపరిశుభ్రమైన నీటిని తాగుతున్నారు. సరైన వస్త్రాలు లేవు. మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. - శివమ్మ టీచర్

తల్లిదండ్రులు పక్కనే ఉన్న డంపింగ్ లో కాగితాలు, ప్లాస్టిక్ వ్యర్థాలు ఏరుకుని నెల్లూరుకు వెళ్లి విక్రయిస్తారు. ఉదయం వెళ్లితే మళ్లీ వచ్చేసరికి సాయంత్రం అవుతుంది. అప్పటి వరకు పిల్లలు తిండిలేక అల్లాడిపోతున్నారు. మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయాలి. - నాగవల్లి వెంకటరమణ

చిన్నారుల దుర్భర పరిస్థితిని గమనించి పాఠశాలను ఏర్పాటు చేయించాం. 20మంది విద్యార్ధులకు చెట్ల కింద అక్షరాలు నేర్పిస్తున్నాం. వీరికి అనేక సమస్యలు ఉన్నాయి. నగరపాలక సంస్థ అధికారుల దృష్టికి తీసుకుపోయాం. పరిష్కరిస్తామని చెప్తున్నారు. - పెంచలయ్య, నవజీవన్ ఆర్గనైజేషన్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్

సాయం కోరుతున్న బాలలు

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.