కావలిలో టెన్షన్​.. టీడీపీ కార్యక్రమాన్ని అడ్డుకున్న పోలీసులు.. పలువురు గృహనిర్బంధం

author img

By

Published : Jan 10, 2023, 3:30 PM IST

Updated : Jan 10, 2023, 8:00 PM IST

TDP CHALO KAVALI

TENSION AT CHALO KAVALI PROGRAM : నెల్లూరు జిల్లాలో దళితులపై దాడులను నిరసిస్తూ.. తెలుగుదేశం పార్టీ చేపట్టిన చలో కావలి కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు. జిల్లా వ్యాప్తంగా టీడీపీ నేతలను గృహనిర్బంధం చేశారు. మద్దతు తెలిపేందుకు వస్తున్న వామపక్ష నేతల్ని ఎక్కడికక్కడ అడ్డుకున్నారు.

TDP CHALO KAVALI : నెల్లూరులో దళితులపై ఇటీవల జరిగిన ఘటనలను నిరసిస్తూ.. తెలుగుదేశం పార్టీ చలో కావలి కార్యక్రమానికి పిలుపునిచ్చింది. కొద్దిరోజుల క్రితం కావలికి చెందిన దళితుడు కరుణాకర్.. తాను వేలంలో పాడుకున్న చెరువులో చేపలు పట్టుకోనివ్వకుండా.. అధికార పార్టీకి చెందిన కొందరు అడ్డుకోవడంతో మనస్థాపానికిగురై ఆత్మహత్య చేసుకున్నారు. కొద్దిరోజుల క్రితం తెలుగుదేశం కార్యకర్త హర్ష.. స్థానిక ఎమ్మెల్యే వేధింపులకు భరించేక పురుగులమందు తాగి ఆత్మహత్యకు యత్నించారు.

వీటితో పాటు.. దళితులపై గతంలో జరిగిన దాడుల నేపథ్యంలో.. చలో కావలికి తెలుగుదేశం నేతలు సిద్ధమయ్యారు. ఈ కార్యక్రమానికి టీడీపీ నేతలు భారీగా తరలి వస్తారని గ్రహించిన పోలీసులు ఉదయం నుంచే కావలిని దిగ్బంధనం చేశారు. పట్టణంలోకి అడుగుపెట్టే అన్ని మార్గాలను నిర్బంధించారు. భారీగా పోలీసుల మోహరింపుతో కావలిలో ఈ ఉదయం హై టెన్షన్ వాతావరణం నెలకొంది.

ఇదే సమయంలో.. చలో కావలి కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు.. ఎక్కడికక్కడ టీడీపీ నేతల్ని అరెస్ట్ చేశారు. జిల్లా వ్యాప్తంగా టీడీపీ నేతల్ని గృహనిర్బంధం చేశారు. కావలి తెలుగుదేశం ఇంఛార్జ్‌ సుబ్బనాయుడును అరెస్ట్ చేసి జలదంకి పోలీస్ స్టేషన్‌కి తరలించారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జ్ అబ్దుల్ అజీజ్, గూడూరు మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్‌ను ఇళ్లలోనే కట్టడి చేశారు.

అనంతపురం నుంచి కారులో వస్తున్న తెలుగుదేశం రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఎమ్​ ఎస్​ రాజును వింజమూరు సమీపంలో అరెస్టు చేశారు. ప్రకాశం జిల్లా కొండెపి తెదేపా ఎమ్మెల్యే డోలా బాల వీరాంజనేయస్వామిని పోలీసులు గృహ నిర్బంధం చేశారు. ఎమ్మెల్యే స్వగ్రామమైన టంగుటూరి మండలం తూర్పునాయుడుపాలెంలో ఇంటి నుంచి కదలకుండా ఇంటి చుట్టూ పోలీసులను మోహరించారు. పోలీసుల తీరుకు నిరసనగా ఆయన అక్కడే బైఠాయించి నిరసన తెలిపారు. చలో కావలి కార్యక్రమానికి వెళ్తున్న..CPM, CPI నేతల్ని పోలీసులు అడ్డుకున్నారు.

ఎస్సీలపై దాడులు జరిగితే చర్యలు తీసుకుంటున్నాం: శాంతి భద్రతలను దృష్టిలో పెట్టుకునే 'చలో కావలి'కి అనుమతివ్వలేదని నెల్లూరు జిల్లా ఎస్పీ విజయరావు తెలిపారు. ఎస్సీలపై దాడి జరిగితే పోలీసు శాఖ స్పందించి చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు. గతేడాది కరుణాకర్ అనే వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడితే ఇద్దరిని అరెస్టు చేశామన్న ఎస్పీ.. కరుణాకర్ సూసైడ్ నోట్ ఆధారంగా విచారణ జరిపినట్లు తెలిపారు. తేజాపై దాడి ఘటనలో సీసీ ఫుటేజ్ ఆధారంగా కేసు నమోదు చేశామని.. హర్ష అనే వ్యక్తిపై కేసులుండటంతో రౌడీషీట్ ఓపెన్ చేశామన్నారు. ఎస్సీల విషయంలో పోలీసు పరంగా ఎలాంటి జాప్యం చేయలేదని స్పష్టం చేశారు.

వైసీపీ అరాచకాలు పరాకాష్ఠకు చేరాయి: నెల్లూరు జిల్లా కావలిలో వైసీపీ అరాచకాలు పెచ్చుమీరాయని టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి మండిపడ్డారు. ఎస్సీలకు బతికే హక్కు లేకుండా చేయడం దుర్మార్గం అని ఆగ్రహించారు. అన్ని వర్గాలపై దాడులు, దౌర్జన్యాలు పెరిగిపోయాయని.. పోలీసుల చిత్రహింసలు భరించలేక ఆత్మహత్య చేసుకున్నారని విమర్శించారు. కావలి నియోజకవర్గంలో వైసీపీ అరాచకాలు పరాకాష్ఠకు చేరాయని మండిపడ్డారు.టీడీపీ ఎస్సీ సెల్ విభాగం ఆధ్వర్యంలో చలో కావలికి నిరసనకు పిలుపునిచ్చినట్లు తెలిపారు.

కావలిలో టెన్షన్​.. టీడీపీ కార్యక్రమాన్ని అడ్డుకున్న పోలీసులు.. పలువురు గృహనిర్బంధం


ఇవీ చదవండి:

Last Updated :Jan 10, 2023, 8:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.