ETV Bharat / state

KNR School in Nellore: కేఎన్​ఆర్​ పాఠశాల.. వరుసగా ఎనిమిదో ఏడాది నో అడ్మిషన్​ బోర్డు.. కారణం ఏంటంటే..!

No Admissions in KNR School: విద్యార్ధుల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలలకన్నా, ప్రైవేట్ పాఠశాలలవైపు మొగ్గుచూపుతున్న సంగతి అందరికీ తెలిసిందే. తమలాగా తమ పిల్లల జీవితాలు మారకూడదనే ఆలోచనతో రోజువారి కూలి పనులు చేసుకుని కార్పొరేట్ పాఠశాలల్లో పిల్లలను చేర్పిస్తున్నారు. అయితే అందుకు విభిన్నంగా నడుస్తుంది నెల్లూరు నగరంలోని కేఎన్ఆర్ ప్రభుత్వ పాఠశాల. పాఠశాల ప్రారంభం రోజునే తమ పిల్లలని చేర్పించేందుకు వందలాది మంది తరలివచ్చారు. తీరా అక్కడికి వెళ్లాక నిరాశ చెందారు. ఎందుకంటే అక్కడ నో అడ్మిషన్ బోర్డు దర్శనమిచ్చింది.

No Admissions in KNR School
No Admissions in KNR School

Published : June 13, 2023 at 8:25 AM IST

|

Updated : June 13, 2023 at 3:17 PM IST

Choose ETV Bharat
వరుసగా ఎనిమిదో ఏడాది నో అడ్మిషన్​ బోర్డు

No Admissions in KNR School: నెల్లూరు కార్పొరేషన్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల కేఎన్ఆర్ అంటే రాష్ట్రంలో పేరు గాంచింది. ప్రతి సంవత్సరం రాష్ట్ర స్థాయిలో పదో తరగతి విద్యార్ధులు అత్యధిక మార్కులు సాధిస్తున్నారు. వసతులు లేకున్నా ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నారు. కార్పొరేట్ పాఠశాలల నుంచి కూడా విద్యార్ధులు ఇక్కడికి వచ్చి చేరుతున్నారు. అయితే ఈ విద్యా సంవత్సరం ప్రారంభం రోజునే తమ పిల్లలను ఈ పాఠశాలలో చేర్పించేందుకు తల్లిదండ్రులు క్యూ కట్టారు. ఏ ప్రభుత్వ పాఠశాలలో ఇలాంటి పరిస్థితి లేదు. విద్యార్ధుల కోసం ఉపాధ్యాయులు తిరుగుతున్న పరిస్థితుల్లో కేఎన్ఆర్ ప్రభుత్వ పాఠశాలలో మాత్రం నో అడ్మిషన్ బోర్డు తగిలించారు. ఎనిమిది సంవత్సరాలుగా ప్రతి విద్యా సంవత్సరం ప్రారంభంలో నో అడ్మిషన్ బోర్డు ఉంటుంది. ఈ పాఠశాల అంటే విద్యార్ధులకు అంత నమ్మకం అని చెబుతున్నారు.

పిల్లల అడ్మిషన్​ కోసం ఎమ్మెల్యే, మంత్రి సిఫారసు లేఖలు కూడా తల్లిదండ్రులు తీసుకువస్తారు. కొందరు జిల్లా అధికారులు కూడా ఫోన్​లు చేసి మరీ సిఫారసు చేస్తారు. కాని ఇక్కడ మాత్రం అవేమి పనిచేయవు. కొత్తగా చేర్చుకునే విద్యార్ధులకు పరీక్షలు నిర్వహించి ఎంపిక చేసుకుంటారు. ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు ప్రతి విద్యార్ధి పరీక్షలు రాయాలి. ఖచ్చితంగా స్టడిఅవర్స్​కు హాజరుకావాలి. ప్రధానోపాధ్యాయుడు, కొందరు ఉపాధ్యాయులు ఇంటి వద్ద కూడా ఉచితంగా ట్యూషన్లు నిర్వహిస్తారు. గత విద్యా సంవత్సరంలో పదో తరగతిలో 590 మార్కులు, ఈ ఏడాది 593మార్కులు సాధించారు. ప్రతి ఏడాది రాష్ట్రంలో ద్వితీయ స్థానం సాధిస్తున్న ప్రభుత్వ పాఠశాలగా గుర్తింపు ఇది పొందింది.

పది సంవత్సరాలకు ముందు 372మంది విద్యార్ధులు మాత్రమే ఉన్న ఈ పాఠశాలలో.. ఐదేళ్లలో దాదాపు 2వేల మంది విద్యార్ధులను చేర్చుకునే స్థాయికి చేరింది. మంచి ఫలితాలు సాధిస్తుండటంతో ఎన్ఎన్ఎంఎస్​లో 96మంది స్కాలర్ షిప్​కు ఎంపికయ్యారు. ట్రిపుల్ ఐటీలో ఇక్కడ చదివిన విద్యార్ధులు 77మంది ఉన్నారు. ఉన్నత ఉద్యోగాలు సాధించిన వారు ఉన్నారు. ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్ధి రెండో బహుమతిగా 75వేల నగదను ఈ నెల 20వ తేదీన ముఖ్యమంత్రి నుంచి తీసుకోనున్నారు.

గదుల సమస్య కారణంగా నో అడ్మిషన్ బోర్డు పెడుతున్నారు. తరగతి గదిలో 60మంది విద్యార్ధులు కూర్చుంటున్నారు. 40గదులు కావలసి ఉంటే.. 18 గదులు మాత్రమే ఉన్నాయి. ఉపాధ్యాయులు 60 మంది కావలసి ఉంటే 18మంది మాత్రమే పని చేస్తున్నారు. తరగతి గదుల సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం 2.28కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసింది. ఈ నిర్మాణాలు పూర్తి అయితే కొంత సమస్య తీరుతుంది.

Last Updated : June 13, 2023 at 3:17 PM IST