Tragedy in telangana: చెరువు దగ్గర్లో ఖననానికి యత్నం.. అడ్డుకున్న స్థానికులు

author img

By

Published : Sep 25, 2021, 7:43 AM IST

Tragedy in telangana

వాళ్లిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు... వారి ప్రేమకు గుర్తుగా ఇద్దరు పిల్లలు పుట్టారు... ఉన్నంతలోనే సంసారాన్ని నెట్టుకొచ్చారు. 11 ఏళ్లుగా సాగిన వీరి సంసారంలో ఎన్నో ఆటుపోట్లను చూశారు. అన్నింటినీ కలిసి అధిగమించారు. కానీ విధి మాత్రం వారిని కోలుకోలేని దెబ్బతీసింది. మృత్యువు.. దగ్గు రూపంలో వచ్చి భార్యను కబళించింది. భార్యకు అంత్యక్రియలు చేయడానికి కూడా డబ్బులేని పరిస్థితుల్లో భర్త ఏం చేశాడంటే?

రెక్కాడితే గానీ డొక్కాడని నిరుపేద కుటుంబం. దంపతులిద్దరూ రోజంతా కూలి పని చేసి పొట్టపోసుకునేవారు. ఉన్నట్టుండి భార్య అనారోగ్యంతో మృతి చెందింది. కనీసం అంత్యక్రియలకు చేతిలో చిల్లిగవ్వ లేక.. ఆ అభాగ్యుడు మృతదేహాన్ని చెరువు సమీపంలో పూడ్చిపెట్టడాని (to bury in the pond)కి ప్రయత్నిస్తే స్థానికులు అడ్డుకున్నారు. పోలీసులు ఆరా తీస్తే విషాదగాథ వెలుగులోకి వచ్చింది.

నెల్లూరు జిల్లా కలిగిరి మండలం ఈనకల్లు గ్రామానికి చెందిన డేగ శ్రీను 11 ఏళ్ల క్రితం బెంగళూరులో మేస్త్రీ పని చేస్తుండగా కర్ణాటకకు చెందిన లక్ష్మి(30)ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి కుమార్తె, కుమారుడు ఉన్నారు. ఆర్నెల్ల కిందట వీరు హైదరాబాద్​ నగరానికి వెళ్లి హయత్‌నగర్‌ పాతరోడ్డులోని హనుమాన్‌ మందిరం పక్కనే ఉన్న గల్లీలో అద్దెకుంటున్నారు. ఇద్దరూ భవన నిర్మాణ కూలీలుగా పనిచేసేవారు.

లక్ష్మి కొన్ని రోజులుగా అనారోగ్యంతో ఇంటివద్దనే ఉంటోంది. విపరీతమైన దగ్గుతో బాధపడుతున్న ఆమె భోజనం సరిగా చేయడం లేదు. శ్రీను గురువారం పని నుంచి సాయంత్రం 7 గంటలకు ఇంటికొచ్చాడు. అప్పటికే తీవ్ర అస్వస్థతతో ఉన్న లక్ష్మి కొద్దిసేపటికే (Tragedy Incident in Hayathnagar) మరణించింది. అంత్యక్రియలకు డబ్బులు లేకపోవడంతో దగ్గర్లోని బాతుల చెరువు వద్ద ఖననం చేయాలని నిర్ణయించాడు. తన బంధువు కోడూరి వినోద్‌ సాయంతో మృతదేహాన్ని దుప్పట్లో చుట్టుకొని చెరువు వద్దకు మోసుకెళ్లాడు. అక్కడ పూడ్చిపెట్టేందు(to bury in the pond)కు ప్రయత్నిస్తుండగా, స్థానికులు అడ్డగించారు. వారిచ్చిన సమాచారంతో పోలీసులు వచ్చి మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. లక్ష్మి అనారోగ్యంతోనే చనిపోయినట్లు శుక్రవారం పోస్టుమార్టం అనంతరం గుర్తించారు. శ్రీను, లక్ష్మిల బంధువులను పిలిపించి, మృతదేహాన్ని అప్పగిస్తామని పోలీసులు తెలిపారు.

ఇదీ చదవండి: కొండమ్మ కుటుంబాన్ని పరామర్శించిన రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.