మాకు సీఎం జగన్ గారిచ్చారు..! మా స్థలాన్ని ఎలా ఇస్తారు..! నేతలు-అధికార్లు గప్​చుప్!

author img

By

Published : Feb 5, 2023, 9:49 AM IST

One Plot Allotted Two Beneficiaries

One Plot Allotted Two Beneficiaries : పార్వతీపురం మన్యం జిల్లాలో జగనన్న కాలనీల్లో స్థలాల కేటాయింపు ఇష్టారాజ్యంగా జరుగుతోంది. మహారాజులు భూములు రాసిచ్చినట్లు .. అడిగిన వాళ్లందరికీ ఎమ్మెల్యే ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ ఇళ్లు నిర్మించుకోడంటూ స్థలాలు రాసిచ్చేశారు. ఆయన మాటలు నమ్మి పునాదులు తీసి ఇళ్ల నిర్మాణం చేపట్టిన లబ్ధిదారులు లబోదిబోమంటున్నారు. అసలు లబ్ధిదారులు అక్కడికి వచ్చి చూసి ఖంగుతింటున్నారు. స్థలం మాదంటే మాదని ప్రజలు కొట్టుకుంటుంటే.. ఎమ్మెల్యే చేష్టలకు అధికారులు తలలు పట్టుకుంటున్నారు.

One Plot Allotted Two Beneficiaries : పార్వతీపురంలో నవరత్నాల పథకంలో భాగంగా నిరుపేదలకు ఇళ్లస్థలాలు ఇచ్చేందుకు 17 జగనన్న కాలనీలు ఏర్పాటు చేశారు. ఇందులో 2,853 మందికి ప్లాట్లను కేటాయించారు. కొన్ని లేఔట్లు నివాసయోగ్యానికి అనువుగా లేనందున ఇల్లు నిర్మించుకునేందుకు లబ్ధిదారులు ఆసక్తి చూపలేదు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో తమ ఇళ్ల వద్దకు వచ్చిన ఎమ్మెల్యే ముందు వారు గోడు వెళ్లబోసుకోగా.. ఆయన రెవెన్యూ అధికారులు జారీ చేసిన పట్టాపైనే మరో కాలనీలో స్థలం కేటాయిస్తున్నట్లు రాసివ్వడమే గాక.. ప్లాట్ నెంబర్ వేసి మరీ సంతకం చేసి వారి చేతిలో పెట్టారు. ఎమ్మెల్యే ఇచ్చిన భరోసాతో ప్రజలు ఆయా ప్రాంతాలకు వెళ్లి ఇళ్లు నిర్మించుకోవడం ప్రారంభించారు. అప్పటికే ఆ స్థలం వేరొకరికి కేటాయించి ఉండటంతో.. వారు అక్కడికి వచ్చి లబోదిబోమంటున్నారు. ఒకే స్థలాన్ని ఇద్దరికి ఎలా కేటాయిస్తారంటూ అధికారుల చుట్టూ కాళ్లు అరిగేలా తిరుగుతున్నారు.

"మాకు జగనన్న కాలనీలో స్థలం కేటాయించారు. మాకు కేటాయించిన స్థలంలో వేరే వాళ్లు అక్రమంగా నిర్మాణం చేపట్టారు. మాకు అధికారులు ఫోన్​ చేసి మీ స్థలం చూపిస్తాము రమ్మని అంటే వచ్చాము. మా స్థలంలో జరిగిన నిర్మాణాలకు డబ్బులు చెల్లిస్తామని అన్నాము. అయిన ఇంకా పరిష్కారం కావటం లేదు." -బాధితురాలు

స్పందన కార్యక్రమంలో ప్రతివారం ఇలాంటి ఫిర్యాదులు పెద్దఎత్తున వస్తుండటంతో.. కలెక్టర్‌ ప్రత్యేక దృష్టి పెట్టారు. ప్రభుత్వం ఎవరికైతే స్థలం కేటాయించిందో వారిదే ఆ స్థలమని తేల్చి చెప్పారు. ఎవరికి కేటాయించిన స్థలంలో వారే కట్టుకోవాలని ఆదేశించారు. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం కలెక్టర్ ఆదేశాలు అమలుకావడం లేదు. ఇప్పటికే ఆయా స్థలాల్లో ఇల్లు నిర్మించుకున్న వారు ఖాళీ చేయడం లేదు. దీంతో ఇరువర్గాలు ఘర్షణపడుతున్నాయి.

"మాకు ఎమ్మెల్యే పట్టాలు ఇచ్చారు. ఖాళీగా ఉన్న దగ్గర ఇళ్లు నిర్మించుకొమని ఓ స్థలం చూపించారు. అక్కడ ఇంటి నిర్మాణ పనులు ప్రారంభించాము. తర్వాత వేరే వాళ్లు వచ్చి ఇది మాకు కేటాయించిన స్థలమని అన్నారు. అందువల్ల మేము నిర్మించిన కట్టడాలకు వారు నగదు చెల్లిస్తామని అన్నారు." -బాధితురాలు

జరిగిన తప్పును సరిదిద్దేందుకు గృహ నిర్మాణ శాఖ అధికారులు పడరానిపాట్లు పడుతున్నారు. ఇరువర్గాల మధ్య రాజీ కుదిర్చి.. ఇంటి నిర్మాణానికి అయిన ఖర్చును ఇప్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఓ ప్రజాప్రతినిధి చేసిన ఘనకార్యానికి ప్రజలతో పాటు అధికారులు ఇబ్బందులుపడుతున్నారు.

"ఒకరికి కేటాయించిన స్థలంలో మరోకరు ఇళ్ల నిర్మణాలు చేపట్టిన సమస్య మా దృష్టికి వచ్చింది. మా దగ్గరికి వచ్చిన ప్రతి సమస్యను పరిష్కరించాము. మిగతా ప్రాంతాలలో ఖాళీలు ఉన్నాయి. అవసరం అయితే అక్కడ ఇళ్ల స్థలాలు కేటాయిస్తం" -రామ అప్పలనాయుడు, కమిషనర్, పురపాలక సంఘం, పార్వతీపురం

వీలైనంత వరకు సమస్యలు పరిష్కరించామని.. వెంకంపేట, గోపాలపురంలో ఇంకా 513 ప్లాట్లు ఖాళీగా ఉన్నాయని అవసరమైతే అక్కడ కేటాయిస్తామని అధికారులు చెబుతున్నారు.

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.