ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు అడిగే హక్కు ప్రభుత్వానికి లేదు: ఎమ్మెల్సీ సాబ్జీ

author img

By

Published : Feb 19, 2023, 8:30 PM IST

UTF District Council meeting

UTF District Council meeting: ఉపాధ్యాయ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు అడిగే హక్కు ప్రభుత్వానికి లేదని ఎమ్మెల్సీ షేక్‌ సాబ్జీ అన్నారు. పార్వతీపురంలో యుటీఎఫ్ జిల్లా కౌన్సిల్ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రభుత్వం ఉపాధ్యాయులతో బోధనేతర పనులు చేయిస్తూ.. విద్యార్థులకు పాఠాలు చెప్పనీయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతినెలా ఒకటో తేదీన ఉద్యోగులకు జీతాలు ఇవ్వడం లేదని విమర్శించారు.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు అడిగే హక్కు ప్రభుత్వానికి లేదు: ఎమ్మెల్సీ సాబ్జీ

UTF District Council meeting: పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రం లైన్స్ కల్యాణ మండపంలో యుటీఎఫ్ జిల్లా కౌన్సిల్ సమావేశం జరిగింది. ముఖ్యఅతిథిగా ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ హాజరయ్యారు. వైసీపీ ప్రభుత్వ మూడు నెలల పాలనలో పాఠశాల విద్యారంగంలో తీసుకొచ్చిన సంస్కరణల ఫలితంగా వేలాది ప్రాథమిక పాఠశాలలు మూతపడ్డాయని.. ఆయన అన్నారు. అందుకు సంబంధించిన జీవో 117ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. మూడు, నాలుగు, ఐదు తరగతుల విలీన ప్రక్రియ మానుకోవాలన్నారు. ఉపాధ్యాయ పెన్షనర్లకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చలేదని ఆరోపించారు. ముఖ్యంగా సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ పునరుద్ధరిస్తామని చెప్పి.. ఇప్పుడు గ్యారంటీ పింఛన్ ఇస్తామంటున్నారని అది ఆమోదయోగ్యం కాదని అన్నారు. మీ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తుందన్న గ్యారెంటీ ఏంటని ప్రశ్నించారు.

2021లో ఇచ్చిన డీఏ ఇప్పటికి అమలు చేయలేదని దానికి గ్యారెంటీ లేనప్పుడు.. గ్యారెంటీ పింఛన్ విధానం ఏమిటని ప్రశ్నించారు. ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లకు డీఏలు, పీఎఫ్​లు, ఏపీజీఐలు, సరెండర్ లీవ్​లు ఏమీ అమలు చేయడం లేదని అన్నారు. ఒకటో తేదీకి జీతాలు ఇవ్వలేని పరిస్థితికి ప్రభుత్వం వచ్చిందని ఎద్దేవా చేశారు. నిరుద్యోగుల కోసం జాబ్ క్యాలెండర్ తీసుకొస్తామని చెప్పి కనీసం ఒక్క నోటిఫికేషన్​ కూడా తీయలేదని విమర్శిచారు. వివిధ పథకాల అమలు చేస్తూ ఉపాధ్యాయులచే పాఠాలు బోధించకుండా చేస్తున్నారని ఆరోపించారు. ఉన్నత అధికారులను ప్రయోగించి ఉపాధ్యాయులను తీవ్ర ఒత్తిడికి గురి చేస్తున్నారని.. ఉపాధ్యాయులను దొంగల్లా చూస్తున్నారని అన్నారు.

పార్వతీపురం మన్యం జిల్లాలో తాజాగా పూర్ణ అనే ఉపాధ్యాయురాలు ఒత్తిడి కారణంగా గుండుపోటు గురై కన్నుమూయడం బాధించే విషయం అని ఆరోపించారు. తూర్పుగోదావరి జిల్లాలో ఓ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు నాడు-నేడు పనులు ఒత్తిడి కారణంగా రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారని ఆయన విమర్శించారు. ఇలా ఎంతమంది ఉపాధ్యాయులు చనిపోతే ప్రభుత్వం విధానాలు మార్చుకుంటుందని ఆయన ప్రశ్నించారు. వేధింపులు మాని ప్రభుత్వ విద్యారంగాన్ని పరిరక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. ఉపాధ్యాయ పట్టభద్రుల ఎన్నికల్లో ఓట్లు ఎలా అడుగుతారని ప్రభుత్వాన్ని ఆయన ప్రశ్నించారు. ఏమి చేశారని.. వారిని ఓటు అడిగే హక్కు మీకు ఉందన్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.