"వరికపూడిశెల ఎత్తిపోతలకు జగన్ ఉత్తుత్తి శంకుస్థాపన"

"వరికపూడిశెల ఎత్తిపోతలకు జగన్ ఉత్తుత్తి శంకుస్థాపన"
TDP Leaders Fire on CM Jagan: పల్నాడు జిల్లా మాచర్లలో వరికపూడిశెల ఎత్తిపోతల ప్రాజెక్టు పథకానికి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి శంకుస్థాపన చేశారు. వరికపూడిశెల ఎత్తిపోతల పేరుతో పల్నాడు ప్రజలను జగన్ మోసగించారని టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు
TDP Leaders Fire on CM Jagan : పల్నాడు జిల్లా మాచర్లలో వరికపూడిశెల ఎత్తిపోతల ప్రాజెక్టు (Varikapudisela Irrigation Project) పథకానికి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఈరోజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నేతలు స్పందిస్తూ సీఎం జగన్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మరో 4 నెలల్లో ఎన్నికల కోడ్ రాబోతోందని, ఎన్నికల దృష్ట్యా వరికెపూడిశెలకు సీఎం శంకుస్థాపన చేశారని అన్నారు.
TDP Leader Devineni Umamaheswar Rao on CM Jagan : ఉద్దేశపూర్వకంగానే జగన్ రెడ్డి వరికపూడిశెల ఎత్తిపోతల పథకం పనుల్ని 53 నెలలు పక్కన పెట్టాడని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ధ్వజమెత్తారు. టీడీపీ ప్రభుత్వంలో పాలనా అనుమతులు పొంది, నిర్మాణ పనులు ప్రారంభమైన సాగునీటి ప్రాజెక్టుల్ని చంద్రబాబుకు పేరొస్తుందన్న దుగ్ధతో ఆపేశాడని మండిపడ్డారు. 3 నెలల్లో తన ప్రభుత్వం కథ ముగుస్తుందని తెలిసీ.. 6 నెలల్లో పల్నాడు ప్రాంతాన్ని ఉద్ధరిస్తానని జగన్ చెప్పడం అబద్ధం కాదా అని నిలదీశారు. ఇరిగేషన్ రంగానికి చంద్రబాబు ఖర్చుపెట్టిన 68వేల కోట్లకు తాను లెక్కలు చెప్తానని, తాను ప్రజలకు ఇచ్చానంటున్న లక్షలకోట్ల సొమ్ము లెక్కలు జగన్ రెడ్డి చెప్పగలడా అని సవాల్ విసిరారు. నెల్లూరు సంగం బ్యారేజీకి గేట్లు పెట్టడం తప్ప, నాలుగున్నరేళ్లలో జగన్ రెడ్డి సాగునీటిశాఖలో ఒక్క గొప్ప పని చేసింది లేదని మండిపడ్డారు.
Prathipati Pullarao Fire On YSRCP Govt : వరికపూడిసెల ఎత్తిపోతల ప్రాజెక్టు పల్నాడు ప్రజల 4 దశాబ్దాల కల టీడీపీ నేత ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. వరికపూడిశెల ఎత్తిపోతలకు జగన్ ఉత్తుత్తి శంకుస్థాపన చేశారని ఎద్దేవా చేశారు. మళ్లీ మళ్లీ శంకుస్థాపనలతో రైతులను మభ్యపెట్టడం తప్ప మరేమి లేదని, ఇందులో ప్రచారం తప్ప చిత్తశుద్ధి లేదని అన్నారు. ఆరు నెలల్లో ఎన్నికలున్నాయని శంకుస్థాపన పేరుతో హడావిడి చేశారని, ప్రాజెక్టు పూర్తి చేసి నీరందించే చిత్తశుద్ధి వైసీపీ ప్రభుత్వానికి ఉందా అని ప్రశ్నించారు. ఇచ్చిన హామీలు అన్ని.. కట్టిన సాగునీటి ప్రాజెక్టులెన్ని జగన్ ఆయన ఎద్దేవా చేశారు. నాలుగున్నరేళ్లలో రెండంటే 2 ప్రాజెక్టులు పూర్తి చేశారని గుర్తు చేశారు. రివర్స్ టెండరింగ్ పేరుతో కాలయాపన చేసి కమీషన్లు లాగారని, కమీషన్ల కక్కుర్తితో ఇప్పటికే పోలవరాన్ని ప్రశ్నార్థకం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ హయాంలో ప్రాజెక్టులపై 68,293 కోట్ల రూపాయలు వ్యయం చేశామని ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు.
GV Anjaneyulu on Varikapudisela Irrigation Project : సీఎంకు ఇప్పుడు వరికెపూడిశెల ప్రాజెక్టు గుర్తొచ్చిందా అని జీవీ ఆంజనేయులు ప్రశ్నించారు. 6 నెలల ముందు చేపట్టే ప్రాజెక్టును నమ్మవద్దని గతంలో జగన్ చెప్పారని గుర్తు చేశారు. రాష్ట్రంలో మరో 4 నెలల్లో ఎన్నికల కోడ్ రాబోతోందని, ఎన్నికల దృష్ట్యా వరికెపూడిశెలకు సీఎం శంకుస్థాపన చేశారని అన్నారు. పల్నాడు జిల్లా రైతులను వైసీపీ ఎమ్మెల్యేలు మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా ఎమ్మెల్యేలు కనీసం పట్టించుకోకపోవడం సిగ్గుచేటని అన్నారు. ఒక్క రూపాయి విడుదల చేయకుండా ప్రాజెక్టు ఎలా కడతారని ఎద్దెవా చేశారు. వరికెపూడిశెల ప్రాజెక్టుపై సీఎం జగన్ చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలే అని ఆరోపించారు. జలవనరులశాఖ మంత్రి అంబటి రాంబాబు తన పదవికి రాజీనామా చేయాలని జీవీ ఆంజనేయులు డిమాండ్ చేశారు.
