పల్నాడు జిల్లా దాచేపల్లి పరిధిలోని ఇరికేపల్లి వద్ద అద్దంకి-నార్కెట్పల్లి జాతీయ రహదారిపై ప్రజలు ధర్నా చేపట్టారు. స్థానికంగా ఉన్న రసాయన కర్మాగారం నుంచి కొంతకాలంగా కలుషితమై నీరు వస్తున్నందని ఆవేదన వ్యక్తం చేశారు. కలుషిత నీరు తాగడంతో పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా ఆనారోగ్యం బారిన పడుతున్నారని వాపోయారు. సమస్యపై అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా.. కాలయాపన చేస్తున్నారంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 'ప్రజల ప్రాణాలను తోడేస్తున్న కర్మాగారాలను మూసివేయాలి. పల్నాడును కమ్మేస్తున్న వియవాయువుల ఫ్యాక్టరీలను వెంటనే మూసివేయాలి' అని నినాదాలు చేశారు.
ఆందోళన నేపథ్యంలో జిల్లా కలెక్టర్ వచ్చి నచ్చజెప్పేందుకు యత్నించినా వినకపోవడంతో ఆయన వెనుదిరిగారు. తర్వాత గ్రామస్థుల ఆందోళనపై స్పందించిన కలెక్టర్.. శాశ్వత పరిష్కారం కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు చెప్పారు. ప్రజలు తాగునీటికి ఇబ్బందులు పడకుండా తక్షణమే రూ. 20 లక్షల నిధులు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు. ఫ్యాక్టరీ నుంచి వెలుబడే కాలుష్యంపై కమిటీ వేసి నివేదిక వచ్చాక చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.
ఇదీ చదవండి: వైకాపాకు షాక్.. వెయ్యి మంది రాజీనామా!