ఎన్నేళ్లు పొడిగించినా ఏం లాభం.. నిధులు లేనప్పుడు..

author img

By

Published : Jan 23, 2023, 6:59 AM IST

Updated : Jan 23, 2023, 7:40 AM IST

Sc, St Sub Plan

Sc, St Sub Plan : ఎస్సీ, ఎస్టీ ఉపప్రణాళిక ప్రాథమిక లక్ష్యానికి వైసీపీ ప్రభుత్వం తూట్లు పొడుస్తోంది. ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికి ఖర్చు చేయాల్సిన ఉపప్రణాళిక నిధులను.. ఇష్టారాజ్యంగా ఇతర పథకాలకు మళ్లిస్తోంది. ఉప ప్రణాళికను నామమాత్రం చేసేసి.. ఆ డబ్బులన్నింటినీ నవరత్నాలకు వాడేస్తోంది. నా ఎస్సీలు, నా ఎస్టీలు అంటూ ఊదరగొట్టే ముఖ్యమంత్రి తమ నిధులను పక్కదారి పట్టించడమేంటని ఆయా సంఘాల నేతలు ప్రశ్నిస్తున్నారు. చట్టం అమల్లోకొచ్చి నేటితో పదేళ్లు పూర్తయి, మరో పదేళ్లపాటు పొడిగించినా నిధులు లేనప్పుడు ఉపయోగమేంటని నిలదీస్తున్నారు.

ఎన్నేళ్లు పొడిగించినా ఏం లాభం.. నిధులు లేనప్పుడు..

Sc, St Sub Plan : ఎస్సీ, ఎస్టీలు ఆర్థికంగా, సామాజికంగా, విద్య, ఉపాధి పరంగా ముందడుగు వేయడానికి తోడ్పడుతుందనే ఉద్దేశంతో ప్రవేశపెట్టిన ఉపప్రణాళిక లక్ష్యం.. వైసీపీ ప్రభుత్వ హయాంలో పక్కదారి పడుతోంది. ఈ నిధులను ఆ వర్గం అభివృద్ధికే వినియోగించాలని చట్టం చెబుతున్నా.. ప్రభుత్వం తుంగలో తొక్కుతోంది. అందరికీ వర్తించే పథకాలకు ఉపప్రణాళిక నిధులను మళ్లిస్తోంది. గత ప్రభుత్వాల హయాంలోనూ ఉపప్రణాళిక నిధులు కొంతమేర ఇతరత్రా పథకాలకు వినియోగించినా.. వైసీపీ సర్కారు అత్యధిక నిధుల్ని సాధారణ పథకాలకు మళ్లించేస్తోంది.

ఎస్సీ వాడలు, గిరిజన తండాల అభివృద్ధిని పూర్తిగా పక్కన పెట్టింది. ఎస్సీ, ఎస్టీ జనాభా దామాషా ప్రకారం ఏటా బడ్జెట్‌లో ఉపప్రణాళిక నిధుల్ని కేటాయించాలని చట్టం చెబుతున్నా.. వాటికి కోత పెడుతోంది. పైగా ఎస్సీ, ఎస్టీలకు ఉద్దేశించిన పలు పథకాలకూ పాతరేసింది. రాష్ట్ర జనాభాలో ఎస్సీలు 16.4 శాతం ఉన్నారు. ఏటా బడ్జెట్‌లో ఆ మేరకు ఉపప్రణాళిక నిధులు కేటాయించాలి. అయితే గత మూడేళ్లుగా నిధుల కేటాయింపులో కోత పడుతూనే ఉంది. 2019 - 20లో 11శాతం, 2020-21లో 11.9శాతం, 2021-22లో 13.8శాతం కేటాయించారు.

ఈ మూడేళ్లలో 16వేల కోట్ల రూపాయల వరకు కోత వేశారు. ఎస్టీల జనాభా 5.3శాతం ఉండగా.. 2019-20లో 3.7శాతం, 2020-21లో 3.9శాతం, 2021-22లో 4.9శాతం కేటాయించారు. ఈ మూడేళ్లలో 4వేల కోట్ల రూపాయలకు కోత పడింది. మొత్తంగా 20వేల కోట్ల రూపాయల మేర ఉప ప్రణాళిక నిధులకు కోత వేశారని.. దీనివల్ల తమ వర్గం ప్రయోజనాలు దెబ్బతిన్నాయని ఎస్సీ, ఎస్టీ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

ఉపప్రణాళిక చట్టాన్ని వైసీపీ ప్రభుత్వం ప్రత్యేకదృష్టితో చూడకుండా.. తమ విధానాలకు అనుకూలంగా అమలు చేస్తోంది. ఎస్సీలు, ఆదివాసీ కుటుంబాలకు ప్రత్యక్ష ప్రయోజనం చేకూర్చే పథకాలకు, వారు నివసిస్తున్న వాడలు, తండాల్లో మౌలిక వసతుల కల్పన, ఇతర అభివృద్ధి పనులకు వంద శాతం నిధులు ఖర్చుచేయాలని.. ఉపప్రణాళిక నిబంధనలు స్పష్టంగా చెబుతున్నాయి. ఇతర ప్రాంతాల్లో వినియోగిస్తే.. అక్కడి ఎస్సీ, ఎస్టీ జనాభాను బట్టి నిధుల కేటాయింపు ఉండాలని వెల్లడిస్తున్నాయి. గత ప్రభుత్వాలు ఈ రెండు నిబంధనలకు ప్రాధాన్యమిచ్చి పనులు, కేటాయింపులు జరిపాయి.

వైసీపీ ప్రభుత్వం నిబంధనలను పూర్తిగా పక్కనబెట్టింది. అందరికీ వర్తించే పథకాల్లోని దళిత, ఆదివాసీల సంఖ్యకు, మౌలిక వసతుల పనులు చేపట్టడంలో అక్కడి ఎస్సీ, ఎస్టీల జనాభాకు అనుగుణంగా నిధులు కేటాయించాలనే సెక్షన్‌ 11 (C), 11 (D) నిబంధనల్నే పరిగణనలోకి తీసుకుని మొత్తం నిధుల్ని కేటాయిస్తోంది. రానున్న కాలంలో చట్టంలోని లొసుగులు సవరించి ఎస్సీ, ఆదివాసీ వ్యక్తులు, కుటుంబాలు, ఆవాస ప్రాంతాలకు 100శాతం నిధులు వినియోగించేలా సవరణ చేయాలని.. ఎస్సీ, ఎస్టీ సంఘాల ప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు.

బడ్జెట్‌లో ఎస్సీ, ఎస్టీ ఉపప్రణాళిక కింద కేటాయించే నిధులను ఆ జనాభా ఎక్కువగా ఉన్న కాలనీలు, తండాల్లో మౌలిక వసతులకు వినియోగించాలి. యువతను పరిశ్రమల ఏర్పాటుకు ప్రోత్సహించాలి. గత ప్రభుత్వాలు కమ్యూనిటీ డెవలప్‌మెంట్‌ పేరుతో 30 శాతం నిధులు వినియోగించాయి. వైసీపీ ప్రభుత్వం అందుకు భిన్నంగా వ్యవహరిస్తోంది. ఏళ్లుగా ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతికి అమలవుతున్న పథకాలను రద్దు చేసింది. దశాబ్దాలుగా అమలవుతున్న భూమి కొనుగోలు పథకాన్ని ఎత్తేసింది. ప్రతిభావంతులైన ఎస్సీ, ఎస్టీ విద్యార్థులను ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన బెస్ట్‌ అవైలబుల్‌ పాఠశాలల పథకాన్ని నిర్వీర్యం చేసింది.

కేంద్ర ప్రభుత్వ సంస్థలైన జాతీయ ఎస్సీ ఆర్థికాభివృద్ధి సంస్థ, జాతీయ గిరిజన ఆర్థికాభివృద్ధి సంస్థ ఇచ్చే స్వయం ఉపాధి రుణాల పథకాలకు మోకాలడ్డింది. ఎస్సీ కార్పొరేషన్‌ను నిర్వీర్యం చేసింది. ఎస్సీ, ఎస్టీ యువత ఉపాధికి ప్రోత్సాహం లేకుండా చేసింది. అధికారం చేపట్టాక 2019 నుంచి ఇప్పటివరకు ఉపప్రణాళిక కోసం 49వేల 710 కోట్లు ఖర్చు చేసినట్లు వైసీపీ ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో 90శాతానికి పైగా నిధులను అందరికీ ఇచ్చే నవరత్న పథకాలకే వినియోగించారు. పింఛన్లు, ఉపకారవేతనాల కింద ఇచ్చే సాయానికీ ఉపప్రణాళిక నిధుల్ని వాడేశారు. జగనన్న గోరుముద్ద, వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ పథకాల కింద చిన్నారులకిచ్చే గుడ్డు, మధ్యాహ్నభోజనం లెక్కల్నీ ఇందులోనే చూపించారు. దీన్నే ప్రత్యేక అభివృద్ధిగా చెప్పడంపై ఎస్సీ, ఎస్టీ మేధావులు, సంఘాల నేతలు మండిపడుతున్నారు.

పారదర్శకత, జవాబుదారీతనం కోసం ఉపప్రణాళిక నిధుల్ని ఏ శాఖ ఎంత ఖర్చు చేసింది, వేటికి వినియోగించిందనే వివరాలను ప్రజలకు అందుబాటులో ఉంచాలని చట్టంలో ఉంది. ప్రభుత్వం ఆ వివరాల్ని ఎక్కడా బయటపెట్టట్లేదు. ఉపప్రణాళిక నిధుల్ని ఏ శాఖకు ఎంత మేర కేటాయించారు, వాటిని ఆయా శాఖలు వేటికి ఖర్చు చేశాయి, ఎన్ని నిధుల్ని వెచ్చించారనే వివరాల్ని ప్రజలకు అందుబాటులో ఉంచాలని సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

ఇవీ చదవండి :

Last Updated :Jan 23, 2023, 7:40 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.