అప్పుడు చర్యలు తీసుకుని ఉంటే.. ఇప్పుడు ఇలా జరిగేది కాదు: వర్ల రామయ్య

author img

By

Published : Jun 23, 2022, 4:07 PM IST

వర్ల రామయ్య

Varla Ramaiah letter to DGP: గుడివాడ క్యాసినో నేరస్థులపై పోలీసులు చర్యలు తీసుకోకపోవడం వల్లే కంకిపాడులో నిన్న (జూన్ 22) మరో క్యాసినో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారని తెదేపా నేత వర్ల రామయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. కంకిపాడులో అక్రమ క్యాసినో నిర్వహించేందుకు ప్రయత్నించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆయన డీజీపీకి లేఖ రాశారు.

Varla Ramaiah on Casino: ఎన్టీఆర్ జిల్లా కంకిపాడులో అక్రమ క్యాసినో నిర్వహించేందుకు ప్రయత్నించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ తెదేపా నేత వర్ల రామయ్య డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డికి లేఖ రాశారు. వైకాపా నాయకుల మద్దతుతో రాష్ట్రంలో కొందరు జూదం, క్యాసినో కల్చర్​ను ప్రోత్సహిస్తున్నారని ఆయన మండిపడ్డారు. సంక్రాంతి సందర్భంగా కొడాలి నాని గుడివాడలో నిర్వహించిన అక్రమ క్యాసినోపై ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆయన ధ్వజమెత్తారు. గుడివాడ క్యాసినో నేరస్థులపై పోలీసులు చర్యలు తీసుకోకపోవటం వల్లే కంకిపాడులో నిన్న (జూన్ 22) మరో క్యాసినో నిర్వహించేందుకు ప్రయత్నించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కంకిపాడు క్యాసినో ఈవెంట్ వెనుక ఉన్న సూత్రధారులను వెంటనే విచారించి తగు చర్యలు తీసుకోవాలని ఆయన లేఖలో కోరారు.

కంకిపాడులో క్యాసినో..: గుడివాడలో నిర్వహించిన 'గోవా క్యాసినో' వ్యవహారం మరువక ముందే కృష్ణా జిల్లాలో మరో ఈవెంట్‌కు పెద్దలు రంగం సిద్ధం చేశారు. గోవా కల్చర్‌తో క్యాసినో.. మందు పార్టీలు, సినీ తారల డ్యాన్సులు, విందులు.. ఇలా అన్నీ ఏర్పాటు చేసుకున్నారు. దీనికి ఈసారి పెనమలూరు నియోజకవర్గం వేదికగా మారింది. బుధవారం (ఈనెల 22న) రాత్రి నిర్వహించేందుకు పటిష్ఠ ఏర్పాట్లు చేసుకున్నారు. శ్రీమంతులు, అతికొద్ది మంది నేతలు.., ప్రముఖులకు ఇందుకు సంబంధించిన ఆహ్వాన పత్రాలు పంపారు. ఈ విషయం మంగళవారం బయటకు రావడంతో కలకలం రేగింది.

కంకిపాడు పట్టణంలో ఒక హోటల్‌, కన్వెన్షన్‌ సెంటర్‌లో క్యాసినో నిర్వహణకు భారీగా ఏర్పాట్లు చేసుకున్నారు. దీనికి ప్రత్యేకంగా ఆహ్వాన పత్రం ముద్రించి ఎంపిక చేసిన వారికి మాత్రమే పంపారు. ఇక్కడ గెట్‌ టు గెదర్‌ తరహాలో ఈవెంట్‌ నిర్వహించుకుంటున్నామని, అనుమతి ఇవ్వాలని కంకిపాడు పోలీసులకు దరఖాస్తు చేశారు. దీన్ని గన్నవరం ఏసీపీ కార్యాలయానికి పంపారు. కేవలం డాన్సులు, డీజే కోసం ఈ దరఖాస్తు చేశారు. మద్యం తాగేందుకు అనుమతి ఇవ్వాలని ఎక్సైజ్‌ పోలీసులకు దరఖాస్తు చేసుకోగా వారు అనుమతి ఇచ్చినట్లు తెలిసింది. అయితే పోలీసులు మాత్రం ఈవెంట్‌ నిర్వహణకు అనుమతి ఇవ్వలేదు. ఉన్నత స్థాయి నుంచి ఇందుకు ఒత్తిళ్లు వచ్చాయని తెలిసింది. మంగళవారం సామాజిక మాధ్యమాల్లో ఈ వ్యవహారం వెలుగు చూసింది. క్యాసినో నిర్వహిస్తున్నట్లు ప్రచారం జరిగింది.

ఈవెంట్‌ పేరుతో గోవా నుంచి అమ్మాయిలు, టాలీవుడ్‌, బాలీవుడ్‌ సినీ తారలు, ప్రముఖ గాయకులు కూడా వస్తున్నట్లు తెలిసింది. వీరికి భారీగానే అడ్వాన్సులు కూడా చెల్లించారు. కన్వెన్షన్‌ సెంటర్‌కు క్యాసినో పేరుతో అడ్వాన్సులు చెల్లించారు. ఎంట్రీ రుసుము రూ.20 వేల వరకు పెట్టినట్లు సమాచారం. దీనిపై కంకిపాడు పోలీసులను వివరణ కోరగా క్యాసినో విషయం తమ దృష్టికి రాలేదని, ఈవెంట్‌ నిర్వహణకు మాత్రమే దరఖాస్తు అందిందని, అనుమతి ఇంకా ఇవ్వలేదని చెప్పారు. ఆఖరి నిమిషంలో ఈ క్యాసినో ఈవెంట్ రద్దయినట్లు ప్రచారం జరుగుతోంది.

డీజీపీకి వర్ల రామయ్య లేఖ
డీజీపీకి వర్ల రామయ్య లేఖ

ఇవీ చూడండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.