సంక్షేమం, అభివృద్ధే ఎజెండాగా నేడు టీడీపీ- జనసేన ఉమ్మడి మేనిఫెస్టో కమిటీ తొలి సమావేశం
Published: Nov 13, 2023, 7:02 AM


సంక్షేమం, అభివృద్ధే ఎజెండాగా నేడు టీడీపీ- జనసేన ఉమ్మడి మేనిఫెస్టో కమిటీ తొలి సమావేశం
Published: Nov 13, 2023, 7:02 AM

TDP Janasena Joint Manifesto Committee Meet: వచ్చే సార్వత్రిక ఎన్నికలకు తెలుగుదేశం, జనసేన.. ఉమ్మడి మేనిఫెస్టో రూపకల్పనను వేగవంతం చేశాయి. ఒక్కో పార్టీ నుంచి.. ముగ్గురు సభ్యులతో ఏర్పాటైన ఉమ్మడి మేనిఫెస్టో కమిటీ తొలి సమావేశం నేడు జరగనుంది. సంక్షేమం, అభివృద్ధే ప్రధాన ఎజెండాగా.. త్వరలో ఉమ్మడిగా మేనిఫెస్టోను ప్రకటించనున్నాయి.
TDP Janasena Joint Manifesto Committee Meet: తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ వేదికగా ఈ మధ్యాహ్నం.. తెలుగుదేశం, జనసేన పార్టీల ఉమ్మడి మ్యానిఫెస్టో కమిటీ తొలి సమావేశం జరగనుంది. ఈ కమిటీలో టీడీపీ నుంచి సీనియర్ నేత మాజీమంత్రి యనమల రామకృష్ణుడు, ఎమ్మెల్సీ అశోక్ బాబు, పార్టీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ సభ్యులుగా ఉన్నారు.
జనసేన నుంచి జనవాణి సమన్వయకర్త వరప్రసాద్, రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు ముత్తా శశిధర్, అధికార ప్రతినిధి శరత్ కుమార్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వచ్చే ఎన్నికలకు ఉమ్మడి మేనిఫెస్టోలో పొందుపరచాల్సిన అంశాలపై ఈ కమిటీ కసరత్తు చేయనుంది. టీడీపీ ఇప్పటికే రాజమహేంద్రవరం మహానాడులో 'సూపర్ సిక్స్' పేరుతో మిని మేనిఫెస్టోగా ఆరు కార్యక్రమాలను ప్రకటించింది.
TDP Janasena Manifesto Design Updates: జనసేన అధినేత పవన్ కల్యాణ్ గతేడాది ఇప్పటంలో జరిగిన బహిరంగ సభలో.. 'షణ్ముఖ వ్యూహం' పేరుతో మేనిఫెస్టో ప్రకటిస్తామని వెల్లడించారు. తెలుగుదేశం ప్రకటించిన 'సూపర్ సిక్స్' అంశాల్లో మహిళలు, యువత, బీసీ, రైతు, పేదలకు అధిక ప్రాధాన్యం ఇచ్చారు. 'మహాశక్తి' పేరిట ఆడబిడ్డలకు ప్రత్యేక నిధి, 18 ఏళ్ల నిండిన ప్రతి మహిళల ఖాతాల్లో నెలకు 1,500 రూపాయలు, 'తల్లికి వందనం' పేరుతో ప్రతి బిడ్డా చదువుకునేందుకు ఇంట్లో ఎంత మంది ఉన్నా ప్రతి ఒక్కరికి ఏటా 15వేల రూపాయలు ఇస్తామమని ప్రకటించారు.
స్థానిక సంస్థల్లో పోటీ చేసేందుకు ఇద్దరు కంటే ఎక్కువ పిల్లలు ఉండరాదనే నిబంధనను తొలగించాలని నిర్ణయించారు. 'దీపం' పథకం కింద ఏటా 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తామని మిని మేనిఫెస్టోలో పొందుపరించారు. అవసరమైతే నాలుగో సిలిండర్ కూడా ఇస్తామని చంద్రబాబు వెల్లడించారు. మహిళలందరికీ జిల్లాల పరిధిలో ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని, యువత కోసం యువగళం మేనిఫెస్టోలో ప్రతి నిరుద్యోగ యువతకు నెలకు 3వేల నిరుద్యోగ భృతి, ఐదేళ్లలో 20లక్షల ఉద్యోగాల హామీని ప్రకటించారు.
TDP Janasena Joint Manifesto: రైతులకు ఏటా 20వేల రూపాయల ఆర్థిక సాయం, బీసీలకు ప్రత్యేకరక్షణ చట్టం, ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్, 'పూర్ టు రిచ్' పేరిట ప్రతి పేదవాడిని ధనికుడిని చేసేలా ప్రత్యేక కార్యాచరణను తెలుగుదేశం ప్రకటించింది. ఇటీవల హైదరాబాద్లో చంద్రబాబుతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ సమావేశమైనప్పుడు 'షణ్ముఖ వ్యూహం' పేరిట 6 అంశాలు ప్రతిపాదించారు.
అమరావతిని రాజధానిగా కొనసాగిస్తూ విశాఖ, తిరుపతి, విజయవాడలను క్లస్టర్ల వారీగా మహా నగరాలుగా అభివృద్ధి చేయాలని ప్రతిపాదించింది. బీపీఎల్ కుటుంబాలు ఇళ్లు కట్టుకోవాలన్నా, మరమ్మతులు చేసుకోవాలన్న ఉచితంగా ఇసుక పంపిణీ చేయాలని సిఫారసు చేసింది. 'సౌభాగ్య' పథకం పేరిట ఏటా లక్ష మంది యువ పారిశ్రామిక వేత్తలకు చిరు వ్యాపారాలు, సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలు నడుపుకునేలా 10లక్షల రూపాయల చొప్పున సాయం అందించి, తద్వారా కొత్త ఉద్యోగాల కల్పన జరిగేలా సూచనలు చేసింది.
'వ్యవసాయం- బంగారు ఫలసాయం' పేరిట ఉద్యాన రైతులకు 5వేల కోట్ల రూపాయలతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేయటంతో పాటు, ఆ పంటలు పండే ప్రాంతాల్లో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు ప్రోత్సాహించాలని సూచించింది. 'మన ఏపీ మన ఉద్యోగాలు' పేరిట ఏటా ఏపీపీఎస్సీ ద్వారా సకాలంలో పోస్టుల భర్తీ చేయటం, ప్రైవేటు రంగంలోనూ ఉపాధి అవకాశాలు కల్పించే చర్యలను పవన్ ప్రతిపాదించారు.
సీపీఎస్ రద్దు చేసి గత ఫించన్ విధానం అమలు హామీని మేనిఫెస్టోలో చేర్చాలని సూచించారు. జనసేన, తెలుగుదేశం మినీ మెనిఫెస్టోలో ఇప్పటికే కొన్ని ఉమ్మడి అంశాలు ఉన్నందున వాటికి అదనంగా మరికొన్ని జోడించి కమిటీ తుది మేనిఫెస్టోను రూపొందించనుంది. చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఏకాభిప్రాయంతో ఖరారు చేసి త్వరలోనే ఉమ్మడి మేనిఫెస్టో ప్రకటిస్తారు.
