గుంతల ఆంధ్రప్రదేశ్కు దారేది - రెండోరోజు కొనసాగిన టీడీపీ, జనసేన నేతల నిరసనల హోరు

గుంతల ఆంధ్రప్రదేశ్కు దారేది - రెండోరోజు కొనసాగిన టీడీపీ, జనసేన నేతల నిరసనల హోరు
TDP Jana Sena protest against the condition of roads: గుంతల ఆంధ్రప్రదేశ్ కు దారేది పేరిట రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం, జనసేన నేతలు ఆందోళనలకు దిగారు. వైసీపీ పాలనలో రహదారులు అధ్వానంగా మారాయని నేతలు ఆరోపించారు. మౌలిక సదుపాయాలు కూడా కల్పించలేని సీఎం జగన్ కు వచ్చే ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెబుతారని హెచ్చరించారు.
TDP Jana Sena protest against the condition of roads: రోడ్లు దుస్థితిపై గుంతల ఆంధ్రప్రదేశ్ కు దారేది పేరిట రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం, జనసేన నేతలు ఆందోళనలు చేపట్టారు. గుంతల రహదారులపై ర్యాలీలు చేసి వైకాపా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రహదారులు పూర్తిగా ధ్వంసమవ్వడంతో వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారని నేతలు ఆవేదన వ్యక్తంచేశారు.
అన్నమయ్య జిల్లా: రోడ్ల దుస్థితిపై అన్నమయ్య జిల్లా మదనపల్లిలో టీడీపీ, జనసేన నాయకులు ఆందోళన చేశారు. రాష్ట్రంలో ఎక్కడ చూసిన రోడ్లు అధ్వాన స్థితిలో ఉన్నాయని మాజీ ఎమ్మెల్యే రమేష్ మండిపడ్డారు. కడపలోని ప్రధాన రహదారి ప్రకాష్ నగర్ నుంచి ఎర్రముక్కపల్లికి వెళ్లే రహదారి అధ్వానంగా ఉందంటూ నిరసన తెలిపారు. రోడ్లను బాగు చేయలేని సీఎం... రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తారని నేతలు ప్రశ్నించారు.
అనంతపురం జిల్లా: ఉరవకొండ మండలం రాయంపల్లి రహదారి గుంతలమయంగా మారిందని... ఆందోళన చేశారు. వెంటనే రోడ్డు బాగుచేయాలని నాయకులు డిమాండ్ చేశారు. కణేకల్ మండలం కొత్తపల్లి రోడ్డును టీడీపీ నేత కాలవ శ్రీనివాసులు పరిశీలించారు. కొత్తపల్లికి రోడ్డు వేయకపోగా... స్థానిక ఎమ్మెల్యే ఇదే రహదారి గుండా అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారని ఆయన ఆరోపించారు. దీంతో రోడ్డు మరింత ఛిద్రంగా మారిందని ఆగ్రహం వ్యక్తంచేశారు.
పార్వతీపురం మన్యం జిల్లా: మక్కువ రహదారి దుస్థితిపై తెలుగుదేశం, జనసేన నాయకులు ఆందోళనకు దిగారు. తెలుగుదేశం హయాంలో నిర్మించిన రహదారులు తప్ప వైసీపీ పాలనలో రోడ్లు మరమ్మతులు చేసిన పాపాన పోలేదని నేతలు ఆరోపించారు. విజయనగరం జిల్లా రామభద్రపురంలో అధ్వానంగా ఉన్న రోడ్డుపై నిరసన తెలిపారు. రామభద్రపురం ప్రధాన కాలువ రహదారి పనులు ఎక్కడకక్కడే నిలిచిపోయాయని నేతలు మండిపడ్డారు. సమస్యలపై ప్రజలు ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారని ఆరోపించారు.
అల్లూరి జిల్లా: పాడేరు మండలం బొక్కెళ్లు మార్గంలో ఆందోళన చేశారు. ద్విచక్ర వాహనాలతో భారీ ఎత్తున రహదారి మార్గం చూపిస్తూ నిరసన తెలిపారు. శ్రీకాకుళం జిల్లా సరుబుజ్జిలి జంక్షన్ లో రోడ్డు గుంతలు వద్ద టీడీపీ, జనసేన నాయకులు ఆందోళన చేశారు. రోడ్లు ధ్వసమై వాహనదారులు ప్రమాదాల బారినపడుతున్నారని నేతలు ఆవేదన వ్యక్తంచేశారు.
ఎన్టీఆర్ జిల్లా: గంపలగూడెం మండలం వినగడప సమీపంలోని కట్టెలేరు వంతెన వద్ద తెలుగుదేశం, జనసేన నాయకులు ఆందోళన చేశారు. వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. తిరుపతి జిల్లా శ్రీ కాళహస్తి-అక్కుర్తి రహదారిపై నిరసన తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లోని చెరువుల నుంచి ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి గ్రావెల్ ను అక్రమంగా రవాణా చేయడంతో రహదారులన్నీ గుంతల మయంగా మారాయని జనసేన నాయకురాలు వినుత దుయ్యబట్టారు. వైసీపీ పాలనలో రహదారులు బాగుచేయకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.
విజయవాడ: పశ్చిమ నియోజకవర్గం సితార కూడలి సమీపంలో గుంతల రహదారులపై తెలుగుదేశం, జనసేన నేతలు నిరసన ర్యాలీ నిర్వహించారు. మాజీమంత్రి బెల్లంపల్లి శ్రీనివాసరావు కమీషన్లకు కక్కుర్తి పడి నియోజవర్గంలోని అభివృద్ధిని కుంటుపడేలా చేశారని నేతలు ఆరోపించారు. మైలవరం నియోజకవర్గంలో పాత నాగులూరు నుంచి రెడ్డిగూడెంకు గుంతల రోడ్డులో నిరసన ర్యాలీ చేపట్టారు. ర్యాలీలో మాజీ మంత్రి దేవినేని ఉమ, జనసేన నేత రామ్మోహన్ రావు, కార్యకర్తలు పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదంలో రంగాపురంలో మరణించిన వారికి నేతలు నివాళులర్పించారు. నియోజకవర్గంలో రహదారులు అత్యంత దయనీయంగా ఉంటే స్థానిక ఎమ్మెల్యే ఏమి చేస్తున్నారని నేతలు ప్రశ్నించారు.
ఉభయగోదావరి జిల్లా: ధవళేశ్వరం బ్యారేజీపై ఉన్న రోడ్డు దుస్థితిని నిరసిస్తూ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం బొబ్బర్లంక బ్యారేజీ వద్ద నిరసన ర్యాలీ నిర్వహించారు. వైకాపా ప్రభుత్వం ప్రజలకు మౌలిక సదుపాయాలను కల్పించడం మర్చి.. కక్ష సాధింపులే లక్ష్యంగా పని చేస్తుందని నేతలు ఆరోపించారు.
శ్రీసత్యసాయి జిల్లా: కదిరిలో తెలుగుదేశం, జనసేన నాయకులు ఆందోళనకు దిగారు. రహదారులు మరమ్మతులు చేయలేని ముఖ్యమంత్రి ఏపీకే అవసరం లేదంటూ నినాదాలు చేశారు. అనంతపురం జిల్లా కుందుర్పి మండలం మహంతపురం- కదరంపల్లి గ్రామాల మధ్య అధ్వానంగా ఉన్న రోడ్డుపై టీడీపీ నేత ఉమామహేశ్వర నాయుడు ఆధ్వర్యంలో ర్యాలీ చేశారు. మహిళలపాటు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు.
