వైసీపీ హయాంలో పడకేసిన రైల్వే ప్రగతి.. ఏళ్లు గడుస్తున్నా పట్టాలెక్కని ప్రాజెక్టులు

author img

By

Published : Mar 18, 2023, 7:12 AM IST

Updated : Mar 18, 2023, 7:32 AM IST

Railway progress in state

Railway progress in state: వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో రైల్వే ప్రగతి పడకేసింది. ఏళ్లు గడుస్తున్నా ప్రాజెక్టులు పట్టాలు ఎక్కడం లేదు. కేంద్రం సరిపడా నిధులిచ్చినా.. రాష్ట్రం తన వాటా నిధులు ఇవ్వక నాలుగేళ్లుగా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా పరిస్థితి మారింది. ఈ సారైనా మోక్షం లభిస్తుందా అనుకుంటే అడియాశే మిగిలింది. రాష్ట్ర వాటా 16 వందల 99 కోట్లు ఇవ్వాలని రైల్వేశాఖ కోరగా.. రాష్ట్ర ప్రభుత్వం వాటిలో కనీసం పదిశాతం నిధులనూ తాజా బడ్జెట్ లో ఇవ్వలేదు. బడ్జెట్ లో రైల్వే పనులకోసం కేవలం 150 కోట్లు మాత్రమే కేటాయించడంతో.. మరో ఏడాది పాటు రైల్వే ప్రాజెక్టులు పడకేసే పరిస్థితి నెలకొంది.

వైసీపీ హయాంలో పడకేసిన రైల్వే ప్రగతి

Railway progress in state: రాష్ట్రంలో ఎన్నో ఏళ్లుగా రైల్వే ప్రాజెక్టులు కొనసాగుతున్నాయి. నడికుడి - శ్రీకాళహస్తి, కోటిపల్లి - నర్సాపురం, కడప - బెంగళూరు, రాయదుర్గం- తుముకూరు వంటి కీలకమైన కొత్త లైన్ల నిర్మాణాలను కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో చేపడుతున్నారు. టీడీపీ హయాంలో కేంద్రంతో సమానంగా రాష్ట్రమూ నిధులు ఇవ్వడంతో పనులు వేగంగా జరిగాయి. వైసీపీ వచ్చిన తర్వాత రాష్ట్ర వాటా ఇవ్వనందున... నాలుగేళ్లుగా పనులు పడకేశాయి. ఈసారి బడ్జెట్‌లో రైల్వే ప్రాజెక్టుల నిర్మాణానికి ప్రభుత్వం భారీగా నిధులు ఇస్తుందనుకుంటే నిరాశే మిగిలింది. దాదాపు 17 వందల కోట్లు ఇవ్వాల్సి ఉండగా.. కేవలం 150 కోట్లు మాత్రమే కేటాయించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నిధులు ఏ మూలకూ సరిపోవని అధికారులు, పనులు ప్రారంభించే పరిస్థితి లేదని రైల్వే అధికారులు అంటున్నారు. రైల్వే ప్రాజెక్టులకు రాష్ట్రం కేటాయించిన సొమ్ము చేస్తే ప్రాజెక్టులు పూర్తయ్యేందుకు కొన్ని దశాబ్దాలు పట్టొచ్చన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

నడికుడి - శ్రీకాళహస్తి మధ్య 309 కిలోమీటర్ల కొత్త లైన్​కు అంచనా వ్యయం 2 వేల700 కోట్లు. ప్రభుత్వం ఉచితంగా భూమి సేకరించి ఇవ్వడంతో పాటు నిర్మాణ వ్యయంలో 50 శాతం మేర.... అంటే 13 వందల 50 కోట్లు ఇవ్వాలి . కానీ రాష్ట్రం డిపాజిట్ చేసింది కేవలం 6 కోట్లు మాత్రమే. కోటిపల్లి నర్సాపురం మధ్య 57.21 కిలోమీటర్ల కొత్త లైన్ కు 2 వేల 125 కోట్లు అంచనా వ్యయం కాగా... 25 శాతం రాష్ట్ర వాటాగా 525 కోట్ల 25 లక్షలు సమకూర్చాల్సి ఉంది. ఇప్పటి వరకు రాష్ట్రం ఇచ్చింది కేవలం 2.69 కోట్లు మాత్రమే. ప్రస్తుతానికి 367.42 కోట్ల కోసం రైల్వే శాఖ పదేపదే విజ్ఞప్తి చేస్తున్నా.. ఈ సారీ నిధులు కేటాయించలేదు. కడప - బెంగళూరు మధ్య 225 కిలోమీటర్ల కొత్త మార్గంలో మన రాష్ట్ర పరిధిలో 218 కిలోమీటర్లు నిర్మించాల్సి ఉంది. ప్రాజెక్టు వ్యయం 2 వేల 849 కోట్లు కాగా.. 50 శాతం రాష్ట్ర వాటా కింద 14 వందల 25 కోట్లు ఇవ్వాలి. గత ప్రభుత్వాలు 190 కోట్లు డిపాజిట్ చేశాయి. ప్రస్తుతం కడప నుంచి పెండ్లి మర్రి వరకు 21.90 మీటర్ల లైన్ మాత్రమే పూర్తయింది. దీని రూటు మార్చాలంటూ వైసీపీ ప్రభుత్వం కొత్త ప్రతిపాదన చేయడంతో ఈ ప్రాజెక్టు పురోగతి లేకుండా పోయింది. అయినప్పటికీ పూర్తి చేసిన పనిలో రాష్ట్ర వాటా కింద ఇంకా 26 కోట్ల వరకు ఇవ్వాలని రైల్వే శాఖ కోరుతున్నా .. అవసరమైన నిధులు ఇవ్వలేదు.

రాయదుర్గం - తుముకూరు మధ్య లైన్ కు 63 కిలోమీటర్లు ట్రాక్ నిర్మాణానికి రాష్ట్రప్రభుత్వం వాటాగా 4 వేల 84 కోట్లు భరించాల్సి ఉంది. గతంలో 230 కోట్లు ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక నిధులు కేటాయింపులు లేకపోవడంతో పనులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. కడప బెంగళూరు లైన్ కు 2849 కోట్లలో 1425 కోట్లు ఇవ్వాల్సి ఉండగా.. ఇప్పటి వరకు కేవలం 190కోట్లు మాత్రమే ప్రభుత్వం డిపాజిట్ చేసింది. రాజధాని అమరావతి మీదుగా వెళ్లే 106 కిలోమీటర్ల లైన్​కు డీపీఆర్ సిద్దం చేసినా వైసీపీ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తూ పక్కన పెట్టింది. ఎర్రుపాలెం- అమరావతి- నంబూరు డబుల్ లైన్ పనులు, అమరావతి - పెదకూరపాడు మధ్య సింగిల్ లైన్, సత్తెనపల్లి- నరసారావు పేట మధ్య కొత్తగా సింగిల్ లైన్ కలిపి మొత్తం 106 కిలోమీటర్ల ప్రాజెక్టును గతంలోనే మంజూరు చేశారు.

2 వేల 679 కోట్లతో డీపీఆర్ సిద్ధం చేయగా.. రైల్వే బడ్జెట్​లో కేవలం వెయ్యి రూపాయలే కేటాయించారు. ఈప్రాజెక్టులో కొంత భాగాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరించాలని కేంద్ర ప్రభుత్వం కోరుతుండగా.. రాష్ట్రం ససేమిరా అంటోంది. ఈసారి బడ్జెట్​లో ఈ ప్రాజెక్టులకు నిధుల కేటాయింపే లేదు. విభజన చట్టం హామీ మేరకు కేంద్రమే భరించాలని రాష్ట్రం కోరుతోంది. భద్రాచలం- కొవ్వూరు మధ్య 150 కిలోమీటర్ల కొత్త లైన్ నిర్మాణం కోసం 2 వేల 155 కోట్ల అంచనాతో నిర్మించాల్సిన ప్రాజెక్టులో.. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు నిధులు కేటాయించాల్సి ఉంది. విభజన చట్టం హామీకింద కేంద్రమే నిధులు భరించాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం తప్పించుకుంటోంది. మాచర్ల- నల్గొండ, కాకినాడ - పిఠాపురం లైన్లదీ ఇదే పరిస్ధితి. గూడూరు - దుగరాజపట్నం, కంభం - ప్రొద్దుటూరు లైన్ల నిర్మాణానికి కేంద్రం కేవలం వెయ్యి రూపాయలు మాత్రమే కేటాయించింది. కొండపల్లి- కొత్త గూడెం లైన్ కూ వెయ్యి ఇచ్చారు. కీలకమైన రైల్వే ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేయకుండా.. చేతులెత్తేసింది.

ఇవీ చదవండి:

Last Updated :Mar 18, 2023, 7:32 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.