ఇలాంటి దుష్ప్రచారాలకు.. వైసీపీ మూల్యం చెల్లించక తప్పదు: పయ్యావుల కేశవ్

author img

By

Published : Mar 8, 2023, 7:55 PM IST

Payyavula Keshav

PAC Chairman Payyavula Keshav: స్కిల్ డెవలప్‌మెంట్‌పై వైసీపీ ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తోందని... ప్రజాపద్దుల కమిటీ ఛైర్మన్‌ పయ్యావుల కేశవ్‌ మండిపడ్డారు. ఇలాంటి దుష్ప్రచారానికి మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. సీమెన్స్‌ కంపెనీ గుజరాత్‌లో బాగా పని చేసిందనే విషయం తెలిసి... మన దగ్గర కూడా ప్రోత్సహించినట్లు చెప్పారు. ఏ పరిస్థితిలో డబ్బు రిలీజ్ చేశామో ఐఏఎస్ అధికారి ప్రేమ్‌చంద్రారెడ్డి స్పష్టంగా చెప్పారని గుర్తు చేశారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌లో ఏదో జరిగిపోయినట్లు.. ఎవరేం చెబితే అది నమ్మేస్తారా అని ప్రశ్నించారు.

Skill Development Case: తెలుగుదేశం పార్టీకి చెందిన ఎవరెవరి ఖాతాలకు స్కిల్‌ డెవలప్‌మెంట్‌ నిధులు వెళ్లాయో వివరాలు విడుదల చేయగలరా అంటూ ప్రజాపద్దుల కమిటీ చైర్మన్ పయ్యావుల కేశవ్ సవాల్ విసిరారు. నిధుల విడుదలకు సంతకం చేసిన ఐఏఎస్ అధికారి ప్రేమ్‌చంద్రారెడ్డి ప్రస్తావన ఎందుకు తీసుకురావడం లేదంటూ కేశవ్‌ ప్రశ్నించారు. ప్రభుత్వ ఆలోచనలకు భిన్నంగా అర్జా శ్రీకాంత్‌ నివేదిక ఇచ్చారని పయ్యావుల తెలిపారు. సీమెన్స్‌ సంస్థతో కుదుర్చుకున్న ఒప్పందం, సాఫ్ట్‌వేర్‌ వాల్యూయేషన్‌ సర్టిఫికేషన్‌ డాక్యుమెంట్లను పయ్యావుల మీడియాకు విడుదల చేసారు.

సీమెన్స్‌ సంస్థకు నిధులు విడుదల చేస్తూ ఐఏఎస్ అధికారి ప్రేమ్‌చంద్రారెడ్డి సంతకం చేశారని గుర్తు చేశారు. ప్రేమ్‌ చంద్రారెడ్డి పేరు ఎందుకు ప్రస్తావించడం లేదని పయ్యావుల నిలదీశారు. ప్రేమ్‌ చంద్రారెడ్డి ఏమైనా నాటి సీఎం చంద్రబాబు చెబితే సంతకం చేశానని చెప్పారా అని ప్రశ్నించారు. ప్రేమ్‌ చంద్రారెడ్డి కూడా ఆషామాషీగా నిధుల విడుదల చేయలేదన్న పయ్యావుల సాఫ్ట్‌వేర్‌ వాల్యూయేషన్‌ చేయించి.. సర్టిఫికేషన్‌ చేయించిన తర్వాతే నిధులు విడుదల చేశారని వెల్లడించారు.

ప్రజాపద్దుల కమిటీ ఛైర్మన్‌ పయ్యావుల కేశవ్‌

సాఫ్ట్​వేర్‌ వాల్యూయేషన్‌ చేసింది కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థేనని స్పష్టం చేసారు. సాఫ్ట్‌వేర్‌ వాల్యూయేషన్‌ చేయించిన విషయాన్ని ఈ ప్రభుత్వం ఎందుకు చెప్పడం లేదని ప్రశ్నించారు. సీమెన్స్‌ వ్యవహరంపై అర్జా శ్రీకాంత్‌ను ఈ ప్రభుత్వం నివేదిక అడిగింది. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్లలో అధ్యయనం చేసి వచ్చి, అంతా బాగుందని అర్జా శ్రీకాంత్‌ నివేదిక ఇచ్చారన్నారు. అర్జా శ్రీకాంత్‌ ఇచ్చిన నివేదిక ప్రభుత్వ పెద్దలకు నచ్చలేదని తెలిపారు. ఇప్పుడు మరోసారి అర్జా శ్రీకాంత్‌ను విచారణ పేరుతో పిలిచి కొట్టి తమకు అనుకూలంగా నివేదిక ఇప్పించుకుంటారా అని మండిపడ్డారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పోరేషన్‌ కట్టు కథలు మళ్లీ మొదలు పెట్టారని ధ్వజమెత్తారు. ఏదో పెద్ద స్కామ్‌ జరిగినట్టు చెప్పుకొస్తున్నారని దుయ్యబట్టారు. గత నాలుగేళ్లుగా చెప్పిన కథలే మళ్లీ చెబుతున్నారని విమర్శించారు.

గుజరాత్‌ రాష్ట్రంతో సీమెన్స్‌ సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది.. దాన్ని అధ్యయనం చేసి ఏపీ ఒప్పందం కుదుర్చుకుందని పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు. గుజరాత్‌ సహా ఆరు రాష్ట్రాల్లో సీమెన్స్‌ సంస్థ ఒప్పందాలు కుదుర్చుకుందని తెలిపారు. సీమెన్స్‌ సంస్థపై జీఎస్టీ విషయంలో ఆరోపణలు వచ్చాయన్నారు. 170కు పైగా దేశాల్లో సీమెన్స్‌ సంస్థ కార్యకలాపాలు ఉన్నాయని పయ్యావుల తెలిపారు. సీమెన్స్‌ సంస్థ చంద్రబాబు బినామీ సంస్థ అన్నట్టు ప్రచారం చేశారని ఆగ్రహం వ్యక్తం చేసారు. పది శాతం రాష్ట్ర ప్రభుత్వం భరిస్తే.. మిగిలిన మొత్తాన్ని సీమెన్స్‌ సంస్థ భరించాలని స్పష్టం చేశారు. ఒప్పందాన్ని సరిగ్గా చదువుకుని విమర్శలు చేస్తే మంచిదని హితవు పలికారు. కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం స్కిల్‌ డెవలప్‌మెంట్‌ తరగతుల పర్యవేక్షణ చేపట్టాల్సిన బాధ్యత సీమెన్స్‌దేనన్నారు. సీమెన్స్‌ సంస్థకు చెందిన సుమన్‌ బోస్‌, డిజైన్‌ టెక్‌ సంస్థకు వికాస్‌ మధ్య లావాదేవీలు జరిగాయి. దానికీ టీడీపీకి ఏం సంబంధమని ప్రశ్నించారు. జగన్‌పై గతంలో తాము ఆధారాలతో ఆరోపణలు చేశామని... ఆధారాల్లేకుండా ఆరోపణలు చేస్తే కోర్టులకు వెళ్తామని పయ్యావుల కేశవ్ హెచ్చరించారు. ఘంటా సుబ్బారావు జవహర్‌ నాలెడ్జ్‌ సెంటర్ల కోసం ఐదేళ్లు పని చేశారని గుర్తు చేశారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.