వైసీపీ తప్పుడు కుట్రలు న్యాయం ముందు బద్దలయ్యాయి: నారా లోకేశ్

వైసీపీ తప్పుడు కుట్రలు న్యాయం ముందు బద్దలయ్యాయి: నారా లోకేశ్
Nara Lokesh Reaction On Chandrababu Bail: కుట్రలు, కుతంత్రాలు న్యాయం ముందు బద్ధలయ్యాయని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పేర్కొన్నారు. చంద్రబాబుకు హైకోర్టు సాధారణ బెయిల్ మంజూరు చేసిన నేపథ్యంలో వైసీపీ ప్రభుత్వంపై లోకేశ్ విమర్శలు గుప్పించారు. తాను తప్పు చేయను,.. తప్పు చేయనివ్వనని చంద్రబాబు ఎప్పుడూ చెప్పేదే... మరోసారి నిజమైందని లోకేశ్ తెలిపారు.
Nara Lokesh Reaction On Chandrababu Bail: సత్యం గెలిచింది, అసత్యంపై యుద్ధం మొదలవబోతోందని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పేర్కొన్నారు. 'సత్యమేవజయతే' అని మరోసారి నిరూపితమైందని తెలిపారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని చంద్రబాబు ఇంటి వద్ద టీడీపీ నేతలు, కార్యకర్తలు టపాసులు కాల్చి సంబరాలు చేశారు. జగన్ కనుసన్నల్లో వ్యవస్థల మేనేజ్మెంటుపై సత్యం గెలిచిందని, చంద్రబాబు నీతి, నిజాయితీ, వ్యక్తిత్వం మరోసారి సమున్నతంగా తల ఎత్తుకుని నిలబడిందని ఉద్ఘాటించారు. తాను తప్పు చేయను, తప్పు చేయనివ్వనని బాబు ఎప్పుడూ చెప్పేదే మరోసారి నిజమైందని లోకేశ్ గుర్తుచేశారు.
చంద్రబాబుపై పెట్టిన స్కిల్ డెవలప్మెంట్ కేసు, జగన్ కోసం, జగన్ వ్యవస్థల ద్వారా బనాయించిందన కేసులే అని లోకేశ్ విమర్శలు గుప్పించారు. బెయిల్ మంజూరు చేసిన సందర్భంగా హైకోర్టు చేసిన వ్యాఖ్యల ద్వారా ఈ విషయం స్పష్టమైందన్నారు. అరెస్టు చేసి 50 రోజులకి పైగా జైలులో పెట్టి కనీసం ఒక్క ఆధారమూ ఇప్పటికీ కోర్టు ముందు ఉంచలేకపోయినా.. వైసీపీ తప్పుడు కుట్రలు న్యాయం ముందు బద్దలయ్యాయన్నారు. కేసులో ఆరోపించినట్టు షెల్ కంపెనీలు అనేవి లేవని తేలిపోయిందన్నారు. తెలుగుదేశం పార్టీ ఖాతాలోకి డబ్బులు పడ్డాయనేది పచ్చి అబద్ధమని, వాట్సాప్ మెసేజ్ చాట్ అంతా బూటకమని స్పష్టమైందని లోకేశ్ పేర్కొన్నారు.
-
It is a moment of victory for the people of Andhra Pradesh as our leader @ncbn garu stands vindicated today. The Hon'ble Court, in its ruling, has issued numerous strong observations, delivering a decisive rebuttal to the YSRCP government. The people of Andhra Pradesh know in… pic.twitter.com/coNtfzpGuq
— Lokesh Nara (@naralokesh) November 20, 2023
అచ్చెన్నాయుడు: చంద్రబాబుకి రెగ్యులర్ బెయిల్ రావడాన్ని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు స్వాగతించారు. అక్రమ కేసులపై మా పోరాటం ఫలించిందని స్పష్టంచేశారు. తప్పుడు కేసులు న్యాయస్థానాల్లో నిలబడవని నిరూపితమైందన్నారు. ఇకనైనా జగన్ రెడ్డి బుద్ది తెచ్చుకుని కక్షసాధింపు చర్యలు మానుకోవాలని హితవు పలికారు. త్వరలోనే చంద్రబాబు ప్రజాక్షేత్రంలోకి వస్తారని తెలిపారు.
పయ్యావుల కేశవ్: కేసులో ఎలాంటి అక్రమాలు జరగలేదని తాము మొదట్నుంచీ చెబుతున్నామని టీడీపీ నేత పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు. ఈ కేసులో ఎలాంటి ఆధారాలు లేవని స్పష్టమైందని తెలిపారు. కోర్టు వ్యాఖ్యలు సీఐడీ అధికారులకు చెంపపెట్టు లాంటివని.. కేవలం ప్రెస్మీట్లు పెట్టి అసత్యాలను నమ్మించే ప్రయత్నం చేశారని ఆరోపించారు. అక్రమాలు జరిగాయంటూ చెప్పారని.. ఏమైనా ఆధారాలుంటే కదా.. కోర్టు ముందు ఉంచేందుకు అంటూ ఎద్దేవా చేశారు. మెుదట రూ.3 వేల కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించిన సీఐడీ.. రూ.300 కోట్లు, ఆఖరికి రూ.25 కోట్ల అవినీతి జరిగిందని కోర్టులో చెప్పారని పయ్యావుల గుర్తుచేశారు. ఇన్ని ఆరోపణలు చేసినా టీడీపీ ఖాతాలోకి డబ్బు వచ్చిందని ప్రాథమిక ఆధారాలు కూడా చూపించలేకపోయారని అధికారులపై మండిపడ్డారు.
ప్రత్తిపాటి పుల్లారావు: చంద్రబాబును ప్రజలకు దూరం చేయాలన్న జగన్ కుట్రలకు నేటితో చెక్ పడిందని టీడీపీ నేత ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. చంద్రబాబుపై సీఐడీ పెట్టిన కేసులన్నీ జగన్ అల్లిన కట్టు కథలే అని ఆరోపించారు. హైకోర్టు ఇచ్చిన బెయిల్ ఆదేశాల్లో ఈ విషయం స్పష్టం అవుతోందని ప్రత్తిపాటి పేర్కొన్నారు. స్కిల్ కేసులో చంద్రబాబు తప్పు చేశారని ఒక్క ఆధారం చూపలేదని ఎద్దేవా చేశారు. జగన్ ప్రభుత్వం పెట్టిన కేసులన్నీ రాజకీయ ప్రేరేపితమే అని ప్రత్తిపాటి విమర్శలు గుప్పించారు.
