సంకల్ప్ సిద్ధి..భారీ స్కామ్​లో ఇద్దరు ప్రజాప్రతినిధులు..!

author img

By

Published : Nov 25, 2022, 9:33 AM IST

Updated : Nov 25, 2022, 9:47 AM IST

Sankalp Siddhi Mart

Sankalp Siddhi Mart Multilevel Cheating Case: "ఈ ప్రపంచంలో ధనవంతుడు మరింత డబ్బులు సంపాదించేందుకు ఎన్నో మార్గాలు ఉన్నాయి”.. "కానీ పేదవాడు ధనవంతుడు కావడానికి ఉన్న ఏకైక మార్గం కేవలం సంకల్ప్‌ మార్ట్‌" అంటూ ప్రకటనలు గుప్పించారు. ఆకర్షణీయ నినాదాలతో, మనీ సర్కులేషన్‌ పథకాలతో డిపాజిటర్లలను ఆకట్టుకున్నారు. ఏడాదిలోనే 11 వందల కోట్లు వసూలు చేసి, బోర్డు తిప్పేసేందుకు సిద్ధమయ్యారు. అంతా అయిందనుకున్న దశలో దొరికిపోయారు. ఈ భారీ మోసం వెనుక ఇద్దరు ప్రజాప్రతినిధుల హస్తం ఉన్నట్లు తెలుస్తోంది.

సంకల్ప్ సిద్ధి మార్ట్ మల్టీలెవల్ చీటింగ్ కేసు.. 11 వందల కోట్లు స్కామ్

Sankalp Siddhi Mart Multilevel Cheating Case: సంకల్ప్ సిద్ధి మార్ట్ మల్టీలెవల్ చీటింగ్ కేసు తీగ లాగితే డొంకంతా కదిలింది. ఆకర్షణీయమైన ప్రకటనలతో తక్కువ సమయంలోనే 11 వందల కోట్లు దండుకున్న నిర్వాహకులు.. ఇక బోర్డు తిప్పేద్దామని భావించారు. డబ్బుని ఇతర చోట్ల పెట్టుబడులుగా మళ్లించే క్రమంలో పోలీసులకు ఫిర్యాదు అందడంతో అడ్డంగా బుక్కయ్యారు. ఈ మోసానికి సంబంధించి తవ్వేకొద్దీ విస్తుపోయే వాస్తవాలు వెలుగుచూస్తున్నాయి. విజయవాడ పోలీసులు 5 ప్రత్యేక బృందాలుగా ఏర్పడి కేసును దర్యాప్తు చేస్తున్నారు. విజయవాడతో పాటు ప్రకాశం, బెంగళూరు, బళ్లారి ప్రాంతాల్లో సోదాలు చేస్తున్న ప్రత్యేక బృందాలు.. నిర్వాహకులకు చెందిన స్థిర, చరాస్తులను అటాచ్‌ చేసే పనిలో ఉన్నాయి. సంస్థ కార్యాలయాల్లో పనిచేసే సిబ్బందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటకలోనూ పెద్దఎత్తున డిపాజిట్లు వసూలు చేశారు. కొందరు పోలీసులు, వారి బంధువులు కూడా సంకల్ప్ సిద్ధిలో పెట్టుబడులు పెట్టి మోసపోయినట్లు తెలుస్తోంది.

సంకల్ప్‌ సిద్ధి మోసంపై ఇప్పటికే గుంటూరు జిల్లాకు చెందిన వేణుగోపాల్, కిరణ్‌లను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. వీరు పేరుకే నిర్వాహకులని, తెరవెనుక ఇద్దరు ప్రజాప్రతినిధుల హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రజాప్రతినిధుల సన్నిహితులే ఈ సంస్థకు చెందిన ఆర్థిక వ్యవహారాలు పర్యవేక్షిస్తున్నట్లు సమాచారం. విషయం బయటికి పొక్కకుండా ఈ నెల 13న విజయవాడలోని ఓ హోటల్‌లో కీలక వ్యక్తులతో సమావేశం నిర్వహించినట్లు సమాచారం. సంకల్ప్‌ సిద్ధిలో ఎక్కువ మంది గన్నవరానికి చెందిన డిపాజిట్‌ దారులు ఉన్నారని.. డబ్బు రెట్టింపు అవుతుందన్న ఆశతో విజయవాడ వన్‌టౌన్‌కు చెందిన వ్యాపారులు కూడా పెద్దమొత్తంలో పెట్టుబడులు పెట్టినట్లు చెబుతున్నారు.

ప్రకాశం జిల్లా కనిగిరిలో ఓ ఆగ్రోఫామ్స్‌కు చెందిన భూమిలో 20 ఎకరాలు తీసుకున్నామని.. ఇందులోని ప్లాట్లు డిపాజిట్‌దారులకు ఇస్తామని నిర్వాహకులు మోసం చేశారు. వాస్తవానికి ఆ సంస్థ అక్కడ ఎలాంటి ఆస్తులు కొనలేదని తెలిసింది. ఇటీవల తెలంగాణలోని ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో ఓ భూమికి సంబంధించి యజమానులతో ఒప్పందం చేసుకున్నారు. ఈ పత్రాలను చూపించి ప్రచారం చేసుకున్నారు. విజయవాడ శివారు నిడమానూరుతో పాటు గుంటూరులో నిత్యావసర సరకుల మార్ట్‌ ఏర్పాటుచేశారు. 3 వేల విలువైన సరుకులు కొంటే, 500 రూపాయలు తగ్గిస్తున్నారు. ఇలాంటివి చూపించి చాలా మందిని ఆకట్టుకున్నారు.

గతేడాదే వ్యాపారం మొదలుపెట్టిన సంకల్ప్ సిద్ధి నిర్వాహకులు... విత్‌డ్రాయల్స్‌ను 10 రోజుల కిందటే ఆపారు. కస్టమర్లు నిలదీయడంతో యాప్‌ హ్యాక్‌ అయిందని... సరిచేసిన తర్వాత యధావిధిగా పనిచేస్తుందని నచ్చజెప్పి పంపారు. డిపాజిట్ల ద్వారా వచ్చిన డబ్బునంతా ప్రతి శనివారం బెంగళూరుకు తరలించి... ఓ ఫాంహౌస్‌లో దాచేవారని తెలిసింది. సంకల్ప్‌ మార్ట్‌ వెబ్‌సైట్‌ ప్రస్తుతం పనిచేయడం లేదు. నిర్వాహకులను పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో వెబ్‌సైట్‌ నిలిపివేసినట్లు సమాచారం.

ఇవీ చదవండి:

Last Updated :Nov 25, 2022, 9:47 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.