ఒంటరి మహిళలే వాళ్ల లక్ష్యం.. ఆట కట్టించిన పోలీసులు

author img

By

Published : Mar 17, 2023, 4:58 PM IST

Etv Bharat

Interstate Chain Snatching Gang: వారిద్దరూ దూరపు బందువులు.. అలవాట్లు.. ఆలోచనలన్నీ కలిశాయి. ఇంకేముంది ఇద్దరూ జట్టు కట్టారు. సులభంగా డబ్బు ఎలా సంపాదించాలా అని ఆలోచించారు. చైన్​స్నాచింగ్​లకు పాల్పడాలని డిసైడ్​ అయ్యారు. అంతే ఇక రంగంలోకి దిగి తెలుగు రాష్ట్రాల్లో 18 చోరీలకు పాల్పడ్డారు. అన్ని రోజులు ఒకేలా ఉండవు కదా.. వాళ్ల పాపం పండింది.. చైన్​స్నాచింగ్​లపై పోలీసులు నిఘా పెట్టడంగా వారు అడ్డంగా దొరికిపోయారు. నలుగురు సభ్యుల ముఠాను పట్టుకుని రూ.34 లక్షల విలువైన బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.

Interstate Chain Snatching Gang : అతనిది తెలంగాణ రాష్ట్రం.. చదివింది ఏడో తరగతి.. అతని వృత్తి క్యాటరింగ్... ప్రవృతి మాత్రం దొంగతనం. అతని అలోచనలతో ఉన్న దూరపు బందువును దగ్గర చేసుకున్నాడు. మొదట దొంగతనాలుగా వాళ్ల జీవితం మొదలై చైన్ స్నాచింగ్ వరకూ వెళ్లింది. రెండు తెలుగు రాష్ట్రాల సరిహద్దుల్లో చైన్ స్నాచింగ్ చేసేవాళ్లు. వాళ్లు ఉదయాన్నే బయలుదేరి పని కానిస్తారు. ఒంటరి మహిళ మెడలో బంగారు గొలుసు వాళ్ల కళ్లలో పడిందా అంతే సంగతులు. గొలుసును చూడగానే వాళ్ల కళ్లలో మెరుపు వస్తుండేది. ఇలా ప్రవృతిని సాఫీగా సాగించేవాళ్లు. ఇలా కొనసాగుతున్న వాళ్ల వ్యవహారంలో మనస్పర్ధలు తలెత్తాయి. ఇద్దరు కాస్తా నలుగురు అయ్యారు. ఏపీ పోలీసులు నలుగుర్ని నాలుగు గోడలకే పరిమితం అయ్యేలా మూకుమ్మడిగా కటకటాల్లోకి నెట్టారు. వాళ్ల ఆగడాలను పోలీసులు ఎలా ఆడ్డుకట్ట వేశారో తెలుసుకుందామా?

అయిదున్నర నెలల కాలంలో 18 చోరీలు: ఒంటరిగా నడిచి వెళ్లే మహిళలే లక్ష్యంగా తెలుగు రాష్ట్రాల్లో చెలరేగిపోయిన గొలుసు దొంగల ముఠా గుట్టు రట్టయింది. అయిదున్నర నెలల కాలంలో 18 చోరీలకు పాల్పడి, పోలీసులకు సవాలుగా నిలిచిన ఈ ముఠా ఎట్టకేలకు నందిగామ పోలీసులకు దొరికిపోయింది. గురువారం విజయవాడ పోలీస్ కమాండ్ కంట్రోల్ కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో రూరల్ డీసీపీ డి. మేరీప్రశాంతి వివరాలు వివరించారు.

మనస్పర్ధలు.. అసిస్టెంట్లు : తెలంగాణలోని ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం గొర్రె శ్రీనివాస్ (22) క్యాటరింగ్ పనులు చేస్తుంటాడు. జల్సాలకు అలవాటు పడి, దూరపు బంధువైన చల్లా వెంకటేశ్వర్లుతో కలిసి, తాళం వేసిన ఇంట్లో దొంగతనం చేస్తుండేవాడు. ఆ డబ్బులతో జల్సాలకు అలవాటు పడ్డారు. అతి సులువుగా డబ్బులు సంపాదించాలన్న లక్ష్యంతో ఒంటరిగా నడిచి వెళ్లే మహిళలను లక్ష్యంగా చేసుకుని చైన్ స్నాచింగ్​లు ప్రారంభించారు. వీళ్లకు మనస్పర్ధలు రావడంతో.. ఖమ్మం జిల్లా సుక్రవరపు కోటకు చెందిన కొనగళ్ల గణేష్, దేవనబోయిన మహేష్ (26)లను అసిస్టెంట్లుగా నియమించుకున్నారు. అయినా కూడా ఈ నలుగురు కలిసి గొలుసు నేరాలకు పాల్పడ్డారు.

రెండు రాష్ట్రాల్లో నేరాలు : ఖమ్మం జిల్లా బూర్గంపాడులో ఒంటరిగా వెళుతున్న ఓ మహిళను 2022, అక్టోబరు 2న వెంబడించారు. ఆమె మెడలోని బంగారు గొలుసును లాక్కుని పరారయ్యారు. నవంబరు 3న నందిగామ పోలీస్ స్టేషన్ పరిధిలో రెండో నేరం చేశారు. ఇలా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో వరుస చైన్ స్నాచింగ్​లకు తెగబడ్డారు. ఎన్టీఆర్ జిల్లా, నందిగామ సబ్ డివిజన్ పరిధిలో వరుస గొలుసు చోరీలు జరుగుతుండటంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. తెలంగాణ జిల్లా భద్రాద్రి కొత్తగూడెం 2, ఖమ్మం జిల్లాలో 2, సూర్యాపేటలో 1 చొప్పున నేరాలు చేశారు. ఆంధ్రప్రదేశ్​లో అత్యధికంగా ఎన్టీఆర్ జిల్లాలో 9 నేరాలు, పల్నాడు జిల్లాలో 1, ఏలూరు జిల్లాలో 1 చొప్పున 11 నేరాలు చేశారు. చోరీ చేసిన సొమ్మును పలుచోట్ల తాకట్టు పెట్టి ఆ డబ్బులతో జల్సాలకు పాల్పడుతున్నారు.

ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం..అరెస్టు : వరుస చైన్ స్నాచింగ్​లపై రూరల్ డీసీపీ డి. మేరీ ప్రశాంతి నేతృత్వంలో నందిగామ ఏసీపీ జి. నాగేశ్వర రెడ్డి దర్యాప్తు ప్రారంభించారు. వందలాది సీసీ కెమెరాల పుటేజీని విశ్లేషించారు. నిందితుల రూపురేఖలు తెలిశాయి. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సాయంతో వారి వివరాలను తెలుసుకుని, నిఘా ఉంచారు. గురువారం కొన్ని బంగారు ఆభరణాలను విజయవాడలో అమ్మేందుకు నిందితులు బయలుదేరారు. అప్పటికే వీళ్లపై నిఘా పెట్టిన పోలీసులు నందిగామ వై కూడలిలో ద్విచక్ర వాహనాలపై వెళుతున్న నలుగురిని అరెస్టు చేశారు. వారి నుంచి రూ.34 లక్షల విలువైన 580 గ్రాముల బంగారు ఆభరణాలను, రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.

అభినందనలు.. రివార్డుల అందజేత : పోలీసులకు సవాలుగా మారిన గొలుసు దొంగతనాల కేసును ఛేదించిన నందిగామ ఏసీపీ జి. నాగేశ్వర రెడ్డి, నందిగామ సీఐ కె.సతీష్, ఎస్సైలు పి.సురేష్, ఎం. పండుదొర, హెడ్ కానిస్టేబుల్ ఎస్. తిరుపతి రావు, కానిస్టేబుళ్లు ఎన్, సంతోష్, బి. పూర్ణచంద్రరావులను సీపీ కాంతిరాణాటాటా అభినందించారు. రూరల్ డీసీపీ మేరీ ప్రశాంతి చేతుల మీదుగా వారికి రివార్డులు ఇప్పించారు.

ఇవీ చదవండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.