విభజన హామీలపై కేంద్రాన్ని ప్రశ్నించడంలో జగన్ విఫలం - కేసుల భయమే కారణం : సీపీఐ నారాయణ

విభజన హామీలపై కేంద్రాన్ని ప్రశ్నించడంలో జగన్ విఫలం - కేసుల భయమే కారణం : సీపీఐ నారాయణ
CPI Ramakrishna Initiation in Vijayawada: రాష్ట్రంలో కరవు సమస్య, కృష్ణా జలాల పునఃపంపిణీ విషయంలో కేంద్రం గెజిట్పై.. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ చేపట్టిన 30 గంటల దీక్షకు వివిధ పార్టీల నాయకులు సంఘీభావం తెలిపారు. కృష్ణా మిగులు జలాల పంపిణీ విషయంలో కేంద్రం అన్యాయం చేసిందని మాజీమంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు ధ్వజమెత్తారు. 440కి పైగా మండలాల్లో రైతులు అల్లాడిపోతున్నా.. ముఖ్యమంత్రి మాత్రం రాష్ట్రంలో కరవు లేదని చెప్పడాన్ని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆక్షేపించారు. సీఎం జగన్కి వ్యవసాయం పట్ల అవగాహన లేకపోవడం వల్లే రైతులు ఇబ్బందులు పడుతున్నారని మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శించారు.
CPI Ramakrishna Initiation in Vijayawada: రాష్ట్రంలో తీవ్రమైన కరవు సమస్య, కృష్ణాజలాల పునఃపంపిణీకై కేంద్ర ప్రభుత్వ గెజిట్ నోటిఫికేషన్లపై సీపీఐ ఆధ్వర్యంలో చేపట్టిన 30 గంటల దీక్ష కొనసాగుతుంది. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ చేపట్టిన ఈ దీక్షకు వివిధ పార్టీల నాయకులు సంఘీభావం తెలిపారు. కృష్ణాజలాల పంపిణీ విషయంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు తీరని అన్యాయం చేసిందని మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు ధ్వజమెత్తారు.
మిగులు జలాల్లో ఒక్క టీఎంసీ నీళ్లు కూడా మనకు కేటాయించక పోవడం వల్ల రాష్ట్రానికి అన్యాయం జరిగిందన్నారు. రాష్ట్రానికి ఇంత అన్యాయం జరుగుతున్నా సీఎం జగన్ కేంద్రాన్ని ప్రశ్నించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో సాగునీటి కొరత తీవ్రంగా ఉందన్న ఆయన పోలవరం ఎప్పటికి పూర్తి అవుతుందో తెలీదన్నారు. మిగతా ప్రాజెక్టుల పరిస్థితి అలాగే ఉందని తెలిపారు. జగన్ పాలన తుగ్లక్ పాలనను తలపిస్తోందని ఎద్దేవా చేశారు. పంట పొలాలకు సాగునీరు అందించడంలో జగన్ విఫలం అయ్యారని మండిపడ్డారు. ఇసుక మాఫియా రాష్ట్రంలో రెచ్చిపోతుందని శోభనాద్రీశ్వరరావు విమర్శించారు.
కరవును సీఎం తగ్గించి చెబుతున్నారు: 440కి పైగా మండలాల్లో కరవు ఉందని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ తెలిపారు. రైతులు కరవుతో అల్లాడిపోతున్నారన్నారు. కరవు తీవ్రత తగ్గించి ముఖ్యమంత్రి చెబుతున్నారని దుయ్యబట్టారు. నీటి కొరతతో ప్రాజెక్టులు ఎండిపోయాయన్నారు. విభజన చట్టంలో చెప్పిన ప్రాజెక్టులు కేంద్రం రాష్ట్రానికి మంజూరు చెయ్యడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రాన్ని ప్రశ్నించడంలో జగన్ విఫలమయ్యారన్నారు. జగన్ కేసుల భయంతో కేంద్రాన్ని ప్రశ్నించడం లేదని ఆక్షేపించారు.
ప్రజలు భారీ మెజారిటీతో జగన్ని గెలిపిస్తే ప్రజా సమస్యలు పార్లమెంట్లో లేవనెత్తడంలో వైసీపీ విఫలం అయ్యిందని విమర్శించారు. జగన్ తనను జైల్లో పెట్టకుండా ఉండడానికి కేంద్రానికి మద్దతు పలుకుతున్నారని ఆరోపించారు. జగన్ దిల్లీకి వెళ్లేది రాష్ట్ర సమస్యలు పరిష్కారం కోసం కాదని జగన్, ఆయన కుటుంబ సభ్యులపై కేసులు మాఫీ చెయ్యడం కోసం కేంద్రం చుట్టూ జగన్ తిరుగుతున్నారని ఆరోపించారు. రాష్ట్ర క్యాబినెట్ సమావేశంలో కరవుపై చర్చించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. చేతకాని మంత్రులు రాష్ట్రంలో ఉన్నారన్నారు.
నష్టపరిహారం అంచనాలో అలసత్వం: కరవు నష్ట పరిహారం అంచనా వెయ్యడంలో వైసీపీ అలసత్వం ప్రదర్శిస్తోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు ధ్వజమెత్తారు. ఊళ్లకు ఊళ్లు వలస వెళ్లిపోతున్నాయన్నారు. కరవు విషయంలో ముఖ్యమంత్రి జగన్ అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు. రెండో పంట వేసుకునేలా రైతులను ప్రభుత్వం ప్రోత్సహించాలని డిమాండ్ చేశారు. రైతులకు నష్ట పరిహారం ఇవ్వాలి, రుణాలు మంజూరు చెయ్యాలని కోరారు.
సీఎం నిర్లక్ష్యంతో రాష్ట్రంలో కరవు పరిస్థితులు: ముఖ్యమంత్రి నిర్లక్ష్యం వల్ల రాష్ట్రంలో కరవు పరిస్థితులు దాపురించాయని మాజీ మంత్రి దేవినేని ఉమమహేశ్వరరావు దుయ్యబట్టారు. సీఎం జగన్కి వ్యవసాయం పట్ల అవగాహన లేదన్న ఉమా.. తక్షణమే 444 మండలాలను కరవు మండలాలుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. విభజన హామీలపై కేంద్రం పైన ఒత్తిడి తేవడంలో జగన్ విఫలం చెందారని విమర్శించారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి చెయ్యడంలో వైసీపీ విఫలమైందన్నారు. భవిష్యత్లో కరవు పరిస్థితిపై అన్ని పార్టీలతో కలిసి పోరాడుతామని వెల్లడించారు. రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో కరవుతో ఎండిపోయిన పంటలను రైతులు తీసుకొచ్చి సభా వేదిక వద్ద ప్రదర్శించారు.
