విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటి ఆధ్వర్యంలో 20వరకు పుస్తక ప్రదర్శన

విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటి ఆధ్వర్యంలో 20వరకు పుస్తక ప్రదర్శన
Book Festival Begins in Vijayawada: విజయవాడలో పుస్తక ప్రదర్శన ప్రారంభమైంది. వేల పుస్తకాలు.. తనలోని అక్షర సమూహాలను తేరిపార చూసి ఆస్వాదించే చదువరులను స్వాగతం - సుస్వాగతం అంటూ ఆహ్వానిస్తున్నాయి. వందలాది కవుల కలాల నుంచి జాలువారిన సాహితీ మకరందాలు ఓవైపు ఉంటే.. పురాణాలు, ఇతిహాసాలు, వేదాల్లోని సారాన్ని కళ్లకు కట్టే కమనీయగాథలు మరోవైపు ఉన్నాయి. చిన్నారులకు నీతిని తెలిపే పంచతంత్ర కథలు ఒకవైపు ఉంటే.. ఆరోగ్యం నుంచి అంతరిక్షం వరకు చిన్నారులు, పెద్దల వరకూ అణువణువూ వివరించే మరెన్నో పుస్తకాలు ఇంకోవైపు ఉన్నాయి. ఇలా మరెన్నో గ్రంథాలు, వందలాది కొత్త పుస్తకాలు పుస్తక ప్రియుల కోసం అందుబాటులోకి వచ్చాయి.
Book Festival Begins in Vijayawada: భారత మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ పుట్టినరోజు (బాలల దినోత్సవం) సందర్భంగా నవంబర్ 14 నుంచి 20వ తేదీ వరకు విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటి రీసెర్చి లైబ్రరీ ఆవరణలో పుస్తక ప్రదర్శనను ప్రారంభించామని.. సొసైటీ అధ్యక్షులు టి. మనోహర్ నాయుడు తెలియజేశారు. జాతీయ పుస్తక వారోత్సవాలు, బాలల దినోత్సవం సందర్భంగా విజయవాడలో ప్రారంభమైన ఈ బుక్ ఫెస్టివల్లో.. సాహితీ వేత్తలు, పుస్తక ప్రియులు, కళాకారులు, రచయితలు, మేథావులు, విద్యార్థులు పుస్తక వారోత్సవాల్లో పాల్గొని జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
Book Exhibition Nov 14th to 20th: జాతీయ పుస్తక వారోత్సవాలు, బాలల దినోత్సవం సందర్భంగా విజయవాడలో నేటి నుంచి ఈ నెల 20వ తేదీ వరకూ బుక్ ఫెస్టివల్ ప్రారంభమైంది. విజయవాడ సొసైటి రీసెర్చి లైబ్రరీ ఆవరణలో ఈ పుస్తక ప్రదర్శనను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ సమగ్ర గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ముఖ్య కార్యనిర్వహణధికారి ఎ.ఎమ్.డి. ఇంతియాజ్ ప్రారంభించారు. అనంతరం వివిధ విభాగాలలో అమర్చిన పుస్తకాలను సందర్శించారు.
A.M.D. Intiaz Comments: ఎ.ఎమ్.డి. ఇంతియాజ్ మాట్లాడుతూ..''పిల్లలచే చాచా నెహ్రూగా అభిమానించబడే నెహ్రూ పుట్టినరోజున దేశమంతటా బాలల దినోత్సవం జరుగుతుంది. అటువంటి రోజున మన విజయవాడలో విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటి వారు ఈరోజు నుంచి ఈ నెల 20వ తేదీ వరకూ పుస్తక ప్రదర్శనను ప్రారంభించారు. అందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. పుస్తక పఠనం అనేది మంచి అలవాటు. పుస్తకాలు చదవటం ద్యారా విజ్ఞానం పెంచుకుని.. ఉన్నత శిఖరాలకు చేరుకొవచ్చు. అన్ని రకాల పుస్తకాలను తగ్గింపు ధరలకు ఈ ప్రదర్శనలో అందుబాటులో ఉంచారు. కాబట్టి, పుస్తక ప్రియులు సద్వినియోగము చేసుకోవాలని కోరుతున్నాను'' అని ఆయన అన్నారు.
Organizers on Book Exhibition: నేషనల్ బుక్ ట్రస్ట్ పిలుపు మేరకు ఈ నెల 14వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ఈ పుస్తక ప్రదర్శన ఏర్పాటు చేస్తున్నామని.. సోసైటీ నిర్వాహకులు తెలిపారు. మళ్లీ ఈ ఏడాది డిసెంబర్ 28వ తేదీ నుంచి జనవరి 7వ తేదీ వరకూ కూడా జాతీయ పుస్తక మహోత్సవాలు నిర్వహించనున్నామని వెల్లడించారు. సాహితీ వేత్తలు, పుస్తక ప్రియులు, కళాకారులు, రచయితలు, మేథావులు, విద్యార్థులు పుస్తక వారోత్సవాల్లో అత్యధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలన్నారు. స్వాతంత్య్ర సంగ్రామంలో పుస్తక రచనలు ఎంతో కీలకపాత్ర పోషించాయన్నారు. దేశ తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ కూడా అనేక పుస్తకాలు రచించారన్నారు. జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు, జాతీయ పుస్తక వారోత్సవాలు, నెహ్రూ పుట్టినరోజు అన్నీ కలిసి ఒకేరోజు రావడం చాలా ఆనందంగా ఉందన్నారు.
