AP High Court Vs Lokayukta: లోకాయుక్త ఆదేశాలను తప్పుపట్టిన హైకోర్టు.. వారికి ఆ అవకాశం కల్పించాలి
Published: May 14, 2023, 7:58 AM


AP High Court Vs Lokayukta: లోకాయుక్త ఆదేశాలను తప్పుపట్టిన హైకోర్టు.. వారికి ఆ అవకాశం కల్పించాలి
Published: May 14, 2023, 7:58 AM
AP High Court quashed the Lokayukta orders: రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం (హైకోర్టు) ఏపీ లోకాయుక్త ఆదేశాలను తప్పుపట్టింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారుల విషయంలో జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేస్తూ.. చట్ట నిబంధనలను అనుసరించి తాజాగా ప్రక్రియ ప్రారంభించే స్వేచ్ఛను లోకాయుక్తకే వదిలేసింది. అనంతరం విచారణ ప్రక్రియను ప్రారంభిస్తే.. ఏయే నిబంధనలను అనుసరించాలో తెలియజేసింది.
AP High Court quashed the Lokayukta orders: ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులు వాదనలు చెప్పుకునే అవకాశం ఇవ్వకుండా వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చర్యలకు ఏపీ లోకాయుక్త ఆదేశాలు ఇవ్వడాన్ని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తప్పుపట్టింది. లోకాయుక్త.. అలా వ్యవహరించడం సహజ న్యాయసూత్రాలు, లోకాయుక్త చట్టంలో ఉన్న సెక్షన్ 10(1)(బి)ని ఉల్లంఘించడమేనని స్పష్టం చేసింది. లోకాయుక్త జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేసింది. అనంతరం లోకాయుక్త.. చట్టంలో ఉన్న నిబంధనలను అనుసరించి తాజాగా ప్రక్రియను ప్రారంభించే స్వేచ్ఛను కూడా లోకాయుక్తకే వదిలేసింది. ఈ క్రమంలో మరోమారు విచారణ ప్రక్రియను ప్రారంభిస్తే గనుక.. విచారణాధికార పరిధి విషయంలో ఏమైనా అభ్యంతరాలు ఉంటే పిటిషనర్లు లేవనెత్తవచ్చని ధర్మాసనం పేర్కొంది. తుది ఉత్తర్వులు జారీ చేయడానికి ముందే విచారణాధికార పరిధిని తేల్చాలని లోకాయుక్తకు స్పష్టం చేసింది.
వాదనలు చెప్పుకునే ఛాన్స్ లోకాయుక్త ఇవ్వలేదు.. తనపై సీఐడీకి ఫిర్యాదు చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేసేలా చర్యలు తీసుకోవాలంటూ శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ను లోకాయుక్త గతేడాది సెప్టెంబర్ 28న ఉత్తర్వులివ్వడాన్ని సవాలు చేస్తూ.. తహశీల్దార్ బలరామ్ హైకోర్టులో వ్యాజ్యం వేశారు. అంతేకాదు, రెవెన్యూ రికార్డుల్లో ఫలానా వ్యక్తుల పేర్లు చేర్చాలంటూ లోకాయుక్త ఆదేశాలివ్వడాన్ని సవాలు చేస్తూ.. మరో వ్యాజ్యం కూడా దాఖలైంది. ఆ రెండు వ్యాజ్యాలపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్ర, జస్టిస్ ఆర్. రఘునందన్ రావుతో కూడిన ధర్మాసనం తాజాగా విచారణ జరిపింది. విచారణలో భాగంగా తాము వాదనలు చెప్పుకునే అవకాశం ఇవ్వకుండా లోకాయుక్త ఉత్తర్వులు జారీ చేసిందని పేర్కొంటూ దాఖలైన మొత్తం ఆరు వ్యాజ్యాలపై ఇటీవల హైకోర్టు విచారణ జరిపి తీర్పును రిజర్వు చేసిన విషయం తెలిసిందే. తాజాగా నిర్ణయాన్ని వెల్లడించింది. దర్యాప్తు ప్రక్రియకు సంబంధించి లోకాయుక్త చట్టంలోని సెక్షన్ 10 స్పష్టం చేస్తోందని ధర్మాసనం తెలిపింది.
అధికారికి వాదనలు చెప్పుకునే ఛాన్స్ ఇవ్వాలి.. సెక్షన్ 10(1)(బి) ప్రకారం.. ప్రాథమిక పరిశీలన అనంతరం ఆ వ్యవహారంలో దర్యాప్తు అవసరమని లోకాయుక్త భావిస్తే ఆ ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రభుత్వ అధికారికి వాదనలు చెప్పుకునే అవకాశం ఇవ్వాలని పేర్కొంది. ఆరోపణలు నిజమని దర్యాప్తులో వెల్లడైన వివరాలతో లోకాయుక్త సంతృప్తి చెందితే లోకాయుక్త రాతపూర్వకంగా అన్ని వివరాలతో ‘కాంపీటెంట్ అథార్టీ’కి సిఫారసు చేయాల్సి ఉంటుందని తెలిపింది. లోకాయుక్త దర్యాప్తునకు ప్రతిపాదించే ముందు ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారికి వాదనలు చెప్పుకునే అవకాశం తప్పనిసరిగా కల్పించాలని సెక్షన్ 10(1)(బి) స్పష్టం చేస్తోందని వివరించింది. ప్రస్తుత కేసుల విషయంలో ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆదేశించడానికి ముందు వాదనలు చెప్పుకునే అవకాశం లోకాయుక్త ఇవ్వలేదని పిటిషనర్లు చెబుతున్నారని గుర్తు చేసింది.
లోకాయుక్త ఉత్తర్వులు రద్దు.. అనంతరం లోకయుక్త అధికారులకు వాదనలు చెప్పుకునే అవకాశాన్ని ఇవ్వకపోవడం సహజ న్యాయసూత్రాలకు విరుద్ధమని తెలియజేస్తూ.. లోకాయుక్త జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేసింది. తాజాగా ప్రక్రియను ప్రారంభించే స్వేచ్ఛను లోకాయుక్తకు వదిలేసింది. ఆ పరిధి లోకాయుక్తకు లేదు.. పిటిషనర్ల తరఫు న్యాయవాదులు ఎస్ ప్రణతి, పీఎస్పీ సురేశ్ కుమార్, కరణం రమేశ్, వీఎస్కే రామారావు తదితరులు వాదనలు వినిపించారు. వాదనలు చెప్పుకునే అవకాశం ఇవ్వకుండా లోకాయుక్త ఎఫ్ఐఆర్ నమోదుకు ఆదేశించిందన్నారు. శాఖాపరమైన చర్యలకు సిఫారసు లేదా క్రిమినల్ చర్యలకు సిఫారసు చేసే ముందు సంబంధిత అధికారికి నోటీసు ఇచ్చి వాదనలు వినడం తప్పనిసరి అంటూ.. తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు తీర్పు ఇచ్చిందని గుర్తు చేశారు. ప్రైవేటు భూ వివాదంలో చర్యల కోసం సిఫారసు చేసే పరిధి లోకాయుక్తకు లేదన్నారు.
ఇవీ చదవండి
