రాష్ట్రంలో పరిశ్రమలు వైసీపీ నేతలే పెట్టాలా..! ప్రతిపక్ష పార్టీల పరిశ్రమలపై సాధింపులు

author img

By

Published : Dec 4, 2022, 9:38 AM IST

Updated : Dec 4, 2022, 11:28 AM IST

Industries

Industries shifting to Other States పదుల సంఖ్యలో పరిశ్రమలు తరలిపోతున్నా.. వేల సంఖ్యలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు దెబ్బతింటున్నా ప్రభుత్వానికి పట్టడం లేదు. రాష్ట్రం ఏమైపోయినా పర్వాలేదు కానీ.. తన పంతమే ముఖ్యమని భావిస్తోంది. భారీ పరిశ్రమలు పారిపోవడం ఐటీ పరిశ్రమలు రాకపోవడంతో ప్రభుత్వ ఆదాయానికి పెద్ద ఎత్తున గండిపడి.. రాష్ట్రంలో అభివృద్ధి పనులకు ఆటంకం ఏర్పడుతున్నా వైసీపీ ప్రభుత్వ తీరులో మార్పురావడం లేదు. ఉపాధి అవకాశాలు లేక యువత పక్క రాష్ట్రాలకు వలసపోవడంతో.. ఏపీ వృద్ధుల రాష్ట్రంగా మారిపోతోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Industries Shifting to Other States వేల మందికి ఉపాధి కల్పించే భారీ పరిశ్రమలు తరలిపోయినా పర్వాలేదు. నాణ్యమైన మానవ వనరులు పక్కరాష్ట్రానికి పోయినా ఇబ్బంది లేదు. కానీ గత ప్రభుత్వానికి పేరు తీసుకొచ్చే ఎలాంటి పరిశ్రమ, ప్రాజెక్ట్‌ రాష్ట్రంలో ఉండటానికి వీల్లేదన్నట్లు ఉంది రాష్ట్ర ప్రభుత్వం తీరు. పెట్టుబడులు, పరిశ్రమల్లేక రాష్ట్రం నష్టపోయినా పర్వాలేదుగానీ.. గత ప్రభుత్వానికి మాత్రం ఎలాంటి ఘనతా దక్కటానికి వీల్లేదన్నట్లు వ్యవహారిస్తోంది. అలాంటి వాటన్నింటినీ రాష్ట్రం నుంచి తన్ని తరిమేయాల్సిందే అన్నట్లుగా వేధింపులకు పాల్పడుతోంది. ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీకి చెందిన వారి పరిశ్రమలైతే ముందే తరిమికొడుతోంది.

రాష్ట్రంలో పరిశ్రమ పెట్టాలంటే అది మనోళ్లదే అయి ఉండాలన్నట్లుగా గత మూడేళ్లుగా వైసీపీ ప్రభుత్వం ప్రవర్తించింది. అదే ఇప్పుడు రాష్ట్రానికి శాపంగా మారింది. పొరుగు రాష్ట్రాలన్నీ పారిశ్రామిక, సేవా రంగాల్లో శరవేగంగా దూసుకుపోతుంటే.. రాష్ట్రం మాత్రం తిరోగమనంలోకి జారిపోతోంది. కొత్త పరిశ్రమల్ని ఆకర్షించేందుకు ప్రభుత్వం తగిన ప్రయత్నాలు చేయకపోగా, గతంలో వచ్చిన పరిశ్రమలను కక్షసాధింపుతో తరిమికొడుతుండటంతో రాష్ట్రం ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతోంది. రాష్ట్రంలో 14 ఏళ్లలోపు పిల్లల సంఖ్య ఏటికేడాది తగ్గిపోతోందన్న కేంద్ర సర్వేల లెక్కలు ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. రాష్ట్రంలో ఉపాధి అవకాశాల్లేక యువత వలసపోవడమే దీనికి కారణమని, ఇదే ధోరణి కొనసాగితే రాబోయే ఒకటి రెండు దశాబ్దాల్లో ఏపీ వృద్ధుల రాష్ట్రంగా మిగిలిపోతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

రాష్ట్రానికి ఒక భారీ పరిశ్రమ వచ్చిందటే.. దానికి అనుబంధంగా అనేక చిన్న, మధ్యతరహా పరిశ్రమలు వస్తాయి. వీటిల్లో పనిచేసేందుకు వేలమంది కార్మికులు తరలివస్తారు. ఆ చుట్టుపక్కలే ఓ మహానగరమే అవతరిస్తుంది. పన్నుల రూపంలో ప్రభుత్వానికి కోట్లాది రూపాయల ఆదాయం సమకూరుతుంది. వైసీపీ ప్రభుత్వానికి మాత్రం ఇదేమి పట్టదు. కొత్త పరిశ్రమల సంగతి దేవుడెరుగు.. ఎన్నో దశాబ్దాలుగా వేలమందికి ఉపాధి కల్పిస్తున్న పరిశ్రమలనే వేధింపులతో తరిమేస్తోంది. రాష్ట్రం ఏమైపోయినా పర్వాలేదు గానీ.. కక్ష తీరడమే తమకు ముఖ్యమని పదేపదే నిరూపిస్తోంది. తాజాగా అమరరాజా పరిశ్రమ రాష్ట్రంలో పెట్టాల్సిన పెట్టుబడులను తెలంగాణకు తరలించడానికీ ఈ వైఖరే కారణం.

10వేల కోట్లతో ఓ పరిశ్రమ ఏర్పాటైతే 25 వేలమంది ఆ పరిశ్రమపై ఆధారపడి జీవిస్తారు. ఇక ప్రభుత్వానికి ఏటా 800 కోట్లకు పైగానే ఆదాయం వస్తుంది. తయారీ రంగంతో పోలిస్తే సేవారంగంలో తక్కువ పెట్టుబడితోనే ఎక్కువ మందికి ఉపాధి దొరుకుతుంది. 100 కోట్ల పెట్టుబడితో ఐటీ పరిశ్రమ ఏర్పాటు చేస్తే.. ప్రత్యక్షంగా వెయ్యిమందికి ఉపాధి లభిస్తుంది. వారిపై ఆధారపడిన మరో 3-4 వేల మందికి పరోక్ష ఉపాధి లభిస్తుంది. దీంతో ఉద్యోగుల వేతనాలే ఏడాదికి 150 కోట్ల వరకు వస్తాయి. ఐటీ రంగంలో ఒక ఉద్యోగిపై కంపెనీ సగటున 40 లక్షల వరకు టర్నోవర్‌ చేస్తుందని అంచనా. దానిపై కట్టే జీఎస్టీ, లాభాలపై చెల్లించే ఆదాయపన్ను రూపంలో ప్రభుత్వానికి పెద్దఎత్తున డబ్బు చేకూరుతుంది. అలాగే ఓ భారీ పరిశ్రమ ఏర్పాటైనా దానిలో 3, 4 వేల మందికి ఉపాధి లభిస్తుంది. వారి కుటుంబాలు అక్కడే నివసిస్తాయి కాబట్టి.. వారు ఖర్చుపెట్టే ప్రతి పైసా నుంచి ప్రభుత్వానికి పన్నుల రూపంలో పెద్దఎత్తున ఆదాయం సమకూరుతుంది. రాష్ట్ర ప్రభుత్వం కక్షసాధింపులు వీడి కనీసం గత ప్రభుత్వ హయాంలో చేసుకున్న ఒప్పందాలకు అనుగుణంగా పరిశ్రమలు ప్రారంభమయ్యేలా చేసినా రాష్ట్ర ప్రభుత్వానికి ఏటా 10 వేల కోట్ల అదనపు ఆదాయం లభించేది. రాజధాని నిర్మాణ పనులు కొనసాగించి ఉంటే అక్కడ జరిగే నిర్మాణాల వల్లే ప్రభుత్వానికి ఏటా కనీసం 5 నంచి 6 వేల కోట్ల ఆదాయం వచ్చేది. అప్పుల్లో కూరుకుపోయిన రాష్ట్రానికి ఈ అదనపు ఆదాయం ఎంతో ఊరట కలిగించేది.

ప్రైవేట్ కళాశాలల్లో పీజీ చదివే విద్యార్థులకు ప్రభుత్వం బోధన రుసుములు చెల్లింపు నిలిపివేసింది. ఈ అదనపు ఆదాయం వచ్చి ఉంటే వారందరి చదువులకు డబ్బులు చెల్లించే అవకాశం ఉండేది. 2020-21లో అండర్ గ్రాడ్యుయేట్‌ విద్యార్థులకు నాల్గవ త్రైమాసిక ఫీజు దాదాపు 650 కోట్లు ప్రభుత్వం చెల్లించలేదు. విద్యార్థుల నుంచే కళాశాలలను ఫీజులు వసూలు చేశాయి. ఈ నిధులు వచ్చి ఉంటే వారికి ప్రభుత్వమే చెల్లించే అవకాశం ఉండేది. ఇక రాష్ట్రంలో ఉండే అధ్వాన రోడ్లకు మరమ్మతులు, అసంపూర్తిగా మిగిలినపోయిన సాగునీటి ప్రాజెక్ట్‌లు, రైతులకు ఆధునిక వ్యవసాయ యంత్రాలు, నిరుపేదలకు రేషన్ దుకాణాల ద్వారా రాయితీ సరకులు అందించే వెసులుబాటు లభించేది. పరిశ్రమలపై కక్షసాధింపులకు దిగడంతో అవన్నీ పక్కరాష్ట్రాలకు తరలిపోయాయి. ఐటీ రంగాన్నీ వైసీపీ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేయడంతో.. విశాఖలోని స్టార్టప్‌ విలేజ్‌ ఖాళీ అయిపోయింది. డిజిగ్నేటెడ్‌ టెక్నాలజీ పార్క్‌ విధానంలో ఇచ్చే 50 శాతం రాయితీని ప్రభుత్వం రద్దు చేసింది. కొత్తగా ఏర్పాటయ్యే ఐటీ కంపెనీల్ని ప్రోత్సహించేందుకు గత ప్రభుత్వం ఉద్యోగులకు వేతనాల్లో ఇచ్చిన రాయితీల్ని తొలగించింది. ఇక్కడి వాతావరణం చూసి.. రాష్ట్రానికి పెట్టుబడులతో రావాలంటేనే పారిశ్రామికవేత్తలు భయపడే పరిస్థితి నెలకొంది. తెలంగాణలో ఐటీ, ఐటీఈఎస్‌ కంపెనీల్లో ప్రస్తుతం సుమారు 8 లక్షల మంది పనిచేస్తున్నారు. అదే మనరాష్ట్రంలో పట్టుమని పాతిక వేల మంది కూడా పనిచేయడం లేదు. వారిలో అత్యధిక మంది వేతనాలు కూడా 20 వేల లోపే ఉన్నాయి.

రాష్ట్రంలో ఉపాధినిచ్చే పరిశ్రమలు, ఐటీ సంస్థలు లేకపోవడంతో యువత మొత్తం చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌ రాష్ట్రాలకు వలసపోతున్నారు. అక్కడే వివాహాలు చేసుకుని స్థిరపడుతున్నారు. వారి సంపాదనంతా ఆయా రాష్ట్రాల్లోనే ఖర్చు చేస్తున్నారు. రాబోయే రోజుల్లోనూ యువతరం వలసలు ఇంకా పెరిగితే, రాష్ట్రంలో మిగిలేది వృద్ధులేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు. హైదరాబాద్, చెన్నై, బెంగళూరులో ఐటీ రంగంలో పనిచేసే ఉద్యోగుల్లో 30 నుంచి 40 శాతం వరకు అత్యంత నైపుణ్యం కలిగిన వారు బయటి ప్రాంతాల నుంచి వచ్చిన వారే. అత్యంత నైపుణ్యమున్నవారు బయటి ప్రాంతాల నుంచి వచ్చి పనిచేయడాన్ని అక్కడ ఆ రంగ పురోభివృద్ధికి సూచీగా పరిగణిస్తారు. మన రాష్ట్ర పరిస్థితి దానికి పూర్తి భిన్నం. నిపుణులు బయటి నుంచి రావడం దేవుడెరుగు. ఇక్కడ చదువుకున్న పిల్లలకే ఉపాధిలేక తరలిపోతున్నారు. ఏపీలో ఐటీ కంపెనీల్లో 15 వేలు జీతం ఇస్తుంటే.. అలాంటి వారికి హైదరాబాద్‌ వంటి చోట్ల కనీసం 30 వేలు ఇస్తున్నారు. దీంతో అందరూ ఇతర ప్రాంతాలకు పరుగులు తీస్తున్నారు. రాష్ట్రంలో ఉన్న కొద్దిపాటి ఐటీ కంపెనీల్లోనూ అత్యంత నిపుణులైన సిబ్బంది లేక అంత విలువైన ప్రాజెక్టులు రావడం లేదు.

రాష్ట్రంలో పరిశ్రమలు వైసీపీ నేతలే పెట్టాలా..! ప్రతిపక్ష పార్టీల పరిశ్రమలపై సాధింపులు

ఇవీ చదవండి:

Last Updated :Dec 4, 2022, 11:28 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.