గోడకు కొట్టిన బంతిలా దూసుకొచ్చిన టీడీపీ.. పట్టభద్రుల క్లీన్​స్వీప్ విజయరహస్యం ఇదే

author img

By

Published : Mar 19, 2023, 5:50 PM IST

ఎమ్మెల్సీ ఎన్నికల్లో సత్తా చాటిన టీడీపీ

TDP Stunning victory : శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు.. 108 అసెంబ్లీ నియోజకవర్గాలు.. 7లక్షల ఓటర్ల తీర్పు.. సార్వత్రిక ఎన్నికలకు సెమీఫైనల్ ను తలపించేలా వ్యూహ ప్రతివ్యూహాలు. .వాలంటీర్లు, అధికారులు, డబ్బుల పంపిణీ..ఇవి కాక ప్రాంతీయ అభిమానంతో ఓట్లు దండుకునే రాజకీయాలు. ఇలా నలువైపులా మోహరించింది అధికార పార్టీ. గత నాలుగేళ్లలో నేతలు,కార్యకర్తలపై అడుగడుగున కేసులతో సమస్యల్లో ఇరుక్కుపోయినా విపక్ష టీడీపీ ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికలను దీటుగా ఎదుర్కొంది. ఎంత అణగతొక్కితే అంత పైకి లేస్తాం..అన్నట్లుగా ,గోడకు కొట్టిన బంతిలా తిరిగి దూసుకొచ్చింది. అధికార పార్టీ అంగ బలం, అర్థ బలాన్ని ఎదుర్కొని నిలబడగలమా..! అన్న శ్రేణుల సందేహాలను పటాపంచలు చేస్తూ.. అధినేత చంద్రబాబు ముందుచూపు నిర్ణయాలు పార్టీని విజయతీరాలకు చేర్చాయి.

TDP Stunning victory : పట్టభద్రులు ప్రజాస్వామ్యానికి పట్టం కట్టారు. విద్యావంతుల విజ్ఞతకు అధికార దుర్వినియోగం అడ్డుకట్ట వేయలేకపోయింది. బోగస్, దొంగ, అనర్హుల ఓట్లు ప్రజాతీర్పు ముందు పటాపంచలయ్యాయి. ప్రభుత్వ అంచనాలు, వ్యూహాలను తలకిందులు చేస్తూ 108అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో జరిగిన 3 పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల్లో విద్యావంతులు వివరణాత్మక తీర్పునిచ్చారు.

నాలుగేళ్లలో... ఉప ఎన్నికలు, స్థానిక సంస్థలు, ఎమ్మెల్సీ ఎన్నికలు ఇలా ... ఏ క్యాటగిరీ తీసుకున్నా తెలుగుదేశం పార్టీ ఓ స్థాయిలో విజయాన్ని అందుకుని ఆస్వాదించిన ఘటన గత నాలుగేళ్లుగా లేదు. వివిధ ఎమ్మెల్యే, ఎంపీ స్థానాలకు రాష్ట్రంలో ఉపఎన్నికలు జరిగినా అధికారపార్టీ అక్రమాలను నిలువరించలేకపోయింది. స్థానిక సంస్థల్లో అభ్యర్థులు ఎన్నికల బరిలో దిగక ముందే నామినేషన్ల తిరస్కరణ, బలవంతపు ఉపసంహరణలు, నామినేషన్ల చించివేతలు వంటి ఘటనలన్నో చవిచూసింది. ముఖ్యంగా గత నాలుగేళ్ల నుంచి శాసన మండలిలో ఎమ్మెల్సీల బలం కోల్పోతూ వస్తున్న తెలుగుదేశానికి ఒక్కరిని కూడా పెద్దల సభకు పంపే అవకాశం రాలేదు. గవర్నర్ కోటా, ఎమ్మెల్యే కోటా, స్థానిక సంస్థల కోటా ఇలా పరోక్ష పద్ధతిలో ఎన్నికయ్యే స్థానాలన్నింటినీ అధికార పార్టీ చేజిక్కించుకుంటూ వచ్చింది.

108 నియోజకవర్గాలు.. 7లక్షల మంది విద్యావంతులు... నాలుగేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత విద్యావంతులు ప్రత్యక్షంగా ఎన్నికల్లో పాల్గొనే పట్టభద్రుల స్థానాలను కైవసం చేసుకుని టీడీపీ బలమైన సత్తా చాటింది. రాష్ట్రంలోని మూడు వేర్వేరు ప్రాంతాల్లో 108అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో దాదాపు ఏడు లక్షల మంది విద్యావంతులు పాల్గొన్న ప్రత్యక్ష ఎన్నికలైన పట్టభద్రుల స్థానాలను కైవసం చేసుకుని విజయ దుందుభి ఎగురవేసింది. ఎన్నికలు జరిగిన పట్టభద్రుల స్థానాలను పరిశీలిస్తే... ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన ఉభయ గోదావరి, కృష్ణ, గుంటూరు... 4జిల్లాల పరిధిలోని 67నియోజకవర్గాలు మినహా రాష్ట్రమంతటా ఈ మూడు పట్టభద్రస్థానాల ఎన్నిక జరిగింది. తూర్పు రాయలసీమ పరిధిలోని ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల పరిధిలో మొత్తం 36అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఎన్నిక జరగ్గా.., పశ్చిమ రాయలసీమ పరిధిలోని ఉమ్మడి అనంతపురం, కర్నూలు, కడప జిల్లాల్లో మొత్తం 38అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఎన్నిక జరిగింది. ఉత్తరాంధ్ర పరిధిలోని ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లోని మొత్తం 34అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఈ ఎన్నిక జరిగింది. ఒక్కో ఎమ్మెల్సీ స్థానంలో దాదాపు 2లక్షలకుపైగా ఓటర్లు పాల్గొన్నారు.

నూతనోత్తేజం... 108 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 2019 సార్వత్రిక ఎన్నికల్లో అధికార వైఎస్సార్సీపీ 95స్థానాలను కైవసం చేసుకుంటే టీడీపీ గెలుపొందినవి 13 మాత్రమే. ఉత్తరాంధ్ర పరిధిలోని 3ఉమ్మడి జిల్లాల నుంచి ఆరుగురు ఎమ్మెల్యేలు మాత్రమే గెలుపొందగా, ఇందులో విజయనగం నుంచి గెలుపొందిన వారు లేరు. తూర్పు రాయలసీమ పరిధిలోని 3ఉమ్మడి జిల్లాల నుంచి ఐదుగురు అభ్యర్థులు మాత్రమే గెలుపొందారు. ఇందులోనూ నెల్లూరు జిల్లా నుంచి ఒక్కరూ లేరు. ఇక పశ్చిమ రాయలసీమలో 3జిల్లాల పరిధిలోని 38అసెంబ్లీ నియోజకవర్గాల్లో హిందూపురం, ఉరవకొండ మినహా కడప, కర్నూలు జిల్లాల నుంచి తెలుగుదేశం అభ్యర్థుల ప్రాబల్యమే లేదు. తాజా ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ కంచుకోటగా భావించే తూర్పు, పశ్చిమ రాయలసీమల్లో టీడీపీ అభ్యర్థుల ఘన విజయం ఆ పార్టీలో నూతనోత్తేజాన్ని నింపుతోంది.

చంద్రబాబు దూరదృష్టి.. ఎన్నికల ప్రచారం చివరి దశలో రెండో ప్రాధాన్యం ఓట్లకు సంబంధించి అనూహ్యంగా పీడీఎఫ్ తో చేసుకున్న పరస్పర అవగాహన ఒప్పందం అనూహ్య రాజకీయ ఎత్తుగడనే చెప్పాలి. చాలా మంది తెలుగుదేశం నేతలు ఈ నిర్ణయాన్ని వద్దని వారించినా దూరదృష్టితో ఆలోచించిన అధినేత చంద్రబాబు రాజకీయ చతురత ప్రదర్శించారు. సాధారణ ఎన్నికలకు సెమీఫైనల్‌గా భావిస్తున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై టీడీపీ మొదటి నుంచీ అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరించింది. ఈ ఎన్నికల్లో ఫలితాలు అటూ ఇటూ అయితే... సార్వత్రిక ఎన్నికల్లో అది ప్రతికూల ప్రభావం చూపే అవకాశమున్నా, ప్రజలపై నమ్మకం ఉంచి ఎన్నికల బరిలో దిగింది. ఈ ఎన్నికల్లో పోటీ చేసి తీరాలన్న పార్టీ అధినేత చంద్రబాబు నిర్ణయంపై కొందరు టీడీపీ నాయకుల్లో మొదట్లో కొంత భిన్నాభిప్రాయం వ్యక్తమైంది. బయటకు చెప్పకపోయినా... పోటీ అనవసరమన్న భావన కొందరు నాయకులు అంతరంగిక సమావేశాల్లో వ్యక్తం చేశారు. అధికార పార్టీ అరాచకాలకు పాల్పడుతూ, ఎన్నికలు స్వేచ్ఛగా సక్రమంగా జరిగే పరిస్థితులు లేనప్పుడు ఇప్పుడు పోటీ చేసే కంటే, శక్తియుక్తుల్ని, వనరుల్ని కూడగట్టుకుని సాధారణ ఎన్నికల్లో ఒకేసారి దీటుగా తలపడితే మంచిదన్న భావన వారిలో వ్యక్తమైంది. కానీ, ఎన్నికల్లో పోటీ చేసి తీరాలని అధినేత ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత... పార్టీ శ్రేణులన్నీ కలసికట్టుగా కదిలాయి.

అంతులేని అరాచకాలు... ఓటర్ల నమోదు, ఎన్నికల ప్రచారం... ఇలా ప్రతి దశలోనూ టీడీపీ అత్యంత పకడ్బందీగా పనిచేసింది. ముఖ్యంగా రాయలసీమ జిల్లాల్లో పెద్ద ఎత్తున దొంగ ఓట్లను చేర్పించినట్టు ఆరోపణలున్నాయి. అర్హతలేని వారినీ దొంగ సర్టిఫికెట్లతో ఓటర్లుగా నమోదు చేశారని ఎన్నికల సంఘానికి టీడీపీ ఫిర్యాదు చేసింది. ఎన్నికల సంఘం పరంగా ఎలాంటి చర్యలూ లేవు. అధికార పార్టీ అరాచకాల్ని టీడీపీ కొంత మేరే ఎదుర్కోగలిగింది. పోలీసుల అండ, వాలంటీర్లను ముందు పెట్టి వైఎస్సార్సీపీ నాయకులు చేస్తున్న అరాచకాల్ని ఒకపక్క క్షేత్రస్థాయిలో ఎదుర్కొంటూనే, టీడీపీ కేంద్ర కార్యాలయం నుంచి నిరంతర పర్యవేక్షణ కొనసాగింది. చివరకు ఓటర్ల లెక్కింపు సమయంలో కూడా అనంతపురం వంటి చోట్ల... వైఎస్సార్సీపీ నాయకులు లెక్కింపు కేంద్రాల్లోకి చొరబడి ప్రతిపక్ష పార్టీకి చెందివారిని బెదిరించే ప్రయత్నం చేశారు. ఎన్నికల ప్రచారంలోను వైఎస్సార్సీపీ అనేక ప్రలోభాలకు తెగబడిందని, పెద్ద ఎత్తున డబ్బు ఖర్చు పెట్టిందని, వాలంటీర్లను ఉపయోగించి అధికార దుర్వినియోగానికి పాల్పడిందనే ఆరోపణలున్నాయి. రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆలోచించే విద్యావంతులు తమవైపే మొగ్గు చూపారని టీడీపీ నేతలు ధీమా వ్యక్తం చేశారు.

స్థానిక సమస్యలే ప్రచార అస్త్రాలుగా... తూర్పు రాయలసీమలో కంచర్ల శ్రీకాంత్ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఇక్కడ లోకేష్ యువగళం పాదయాత్ర అదనపు బలాన్ని చేకూర్చింది. లోకేశ్‌ ప్రతిరోజూ తన సభలో.. శ్రీకాంత్‌ను గెలిపించాలంటూ ఎప్పటికప్పుడు ఓటర్లని చైతన్య పరిచారు. స్థానిక సమస్యలతో పాటు చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల పరిధిలో కీలక పరిశ్రమలు తరలిపోయి యువతకు ఉద్యోగాలు లేకుండా పోవటం అంశాన్ని తెలుగుదేశం ప్రధాన ప్రచార అస్త్రంగా శ్రీకాంత్ మార్చుకున్నారు. ఉత్తరాంధ్ర పట్టభద్రుల స్థానానికి సంబంధించి మొదటిగా ప్రకటించిన కుమారి లక్ష్మిని మార్చి ఆఖరి నిమిషంలో వేపాడ చిరంజీవి రావును తెలుగుదేశం తెరమీదకు తీసుకొచ్చింది. ఉత్తరాంధ్ర ప్రాంతంలో ప్రభుత్వంపై వ్యతిరేకత ఎక్కువగా ఉందని తెలుగుదేశం భావించింది. ఐటీ సంస్థలు విశాఖ నుంచి తరలిపోవటం, నిరుద్యోగం, ఉద్యోగుల్లో అసంతృప్తి, విశాఖలో భూకబ్జాలు, విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ, మాదకద్రవ్యాలకు అడ్డాగా ఉత్తరాంధ్ర మారటం, అధికార పార్టీ దౌర్జన్యాలు వంటి అంశాలు తమకు కలసి వస్తాయన్న అంచనాలతో టీడీపీ వ్యూహాత్మక అడుగులు వేసింది. ప్రభుత్వ ప్రచారాస్త్రంగా ఉన్న విశాఖ రాజధానికి ధీటుగా ఆ ప్రాంతంలో 40వేల కోట్ల అధికార అవినీతి అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడంలో సైకిల్‌ శ్రేణులు సక్సెస్‌ అయ్యారనే చెప్పాలి. పశ్చిమ రాయలసీమ పరిధిలో కర్నూలు కడప అనంతపురం జిల్లాల గ్రాడ్యుయేట్ స్థానానికి తెలుగుదేశం నేత భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి పోటీ చేశారు. కడప స్టీల్ ప్లాంట్ ను విస్మరించడం, ఉద్యోగులు, విద్యార్థులు, ఉపాధ్యాయుల సమస్యలను ప్రధానంగా ఎత్తి చూపించారు.

వైఎస్సార్సీపీ కంచుకోటకు బీటలు... తమ్ముళ్లలో నూతనోత్సాహం... పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అప్రతిహత విజయం సాధించటంతో పాటు అధికార పార్టీపై స్పష్టమైన ఆధిపత్యాన్ని కనబరిచింది. వైఎస్సార్సీపీ కంచుకోటల్ని అవలీలగా బద్ధలుకొట్టింది. మరో ఏడాదిలో జరగనున్న సాధారణ ఎన్నికలకు సెమీ ఫైనల్‌గా భావిస్తున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో సాధించనున్న ఘన విజయంతో టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం పరవళ్లు తొక్కుతోంది. ఈ ఎన్నికల్ని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించిన టీడీపీ.. అధికార పార్టీ ఆగడాల్ని, దురాగతాల్ని ఎదుర్కొని మొదటి నుంచీ అత్యంత వ్యూహాత్మకంగా, పకడ్బందీగా వ్యవహరించి భారీ విజయం ముంగిట్లో నిలిచింది. ఫలితాలు ఈస్థాయిలో ఉంటాయనుకుంటే... ఇంకా గట్టిగా పనిచేసేవారిమని, ఎన్నికల్లో నిలబడితేనే ప్రజలు ఈస్థాయి ఆదరణ చూపితే, మరింత పకడ్బందీగా పనిచేస్తే మరింత అద్భుత విజయాన్ని సొంతం చేసుకునేవారిమని సైకిల్ శ్రేణులు భావిస్తున్నాయి. ప్రభుత్వ వ్యతిరేక పవనాలు బలంగా వీస్తున్నాయని, ప్రజలు మార్పు కోరుకుంటున్నారనడానికి ఇదే నిదర్శనమని టీడీపీ శ్రేణులు చెబుతున్నాయి. విశాఖను కార్యనిర్వాహక రాజధాని చేస్తామని వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఊరించినా... ఆ పప్పులేమీ ఉడకవంటూ అక్కడి ప్రజలు అధికార పార్టీని కోలుకోలేని దెబ్బ కొట్టారని, వైఎస్సార్సీపీ తిరుగు లేదని భావించే రాయలసీమ జిల్లాల్లోనూ ప్రజలు ఆ పార్టీకి కీలెరిగి వాత పెట్టారని టీడీపీ శ్రేణులు చెబుతున్నాయి. అధికార పార్టీ పెద్ద ఎత్తున బోగస్‌ ఓట్లు చేర్పించినా, అరాచకాలకు పాల్పడినా, వాలంటీర్లతో నిఘా పెట్టినా... దీటుగా ఎదుర్కొని, విజయం దిశగా పరుగులు తీస్తున్నామని, అధికార పార్టీ అరాచకాలు లేకుంటే, టీడీపీ శ్రేణులు మరింత క్రియాశీలంగా పనిచేస్తే రాబోయే ఏ ఎన్నికల్లోనైనా ఘన విజయం ఖాయమన్న ధీమా వారిలో వ్యక్తం అవుతోంది.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో సత్తా చాటిన టీడీపీ

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.