ruling party leaders Sand business : ఎంత తవ్వుకుంటే అంత..! ఇసుక కాంట్రాక్టు ఇంకో ఏడాది

author img

By

Published : May 26, 2023, 8:40 AM IST

Etv Bharat

Sand business of ruling party leaders : రాష్ట్రంలో అధికార పార్టీ నేతల ఇసుక దందాకు మరో ఏడాది పాటు ఎలాంటి అడ్డంకులు లేకుండాపోయింది. గనుల శాఖతో జయప్రకాశ్‌ పవర్‌ వెంచర్స్‌ సంస్థ రెండేళ్ల క్రితం చేసుకున్న ఒప్పందం ఈ నెల మొదటి వారంలో ముగిసింది. గడువును మరో ఏడాది పునరుద్ధరించడంతో దందాకు మార్గం సుగమమైంది.

ఇసుక దందాకు ఇంకో ఏడాది

Sand business of ruling party leaders : జేపీ సంస్థ పేరిట అధికార పార్టీ నేతలు ఎక్కడికక్కడ, అడ్డగోలుగా ఇసుక తవ్వకాలు, విక్రయాలు దర్జాగా మరో ఏడాది పొడవునా కొనసాగనున్నాయి. ఆ మేరకు ప్రతినెలా పెద్దలకు భారీ మొత్తంలో చెల్లింపులు కొనసాగనున్నాయి. ఇసుక వ్యాపార ఒప్పందం గడువు పొడిగించారనే సమాచారాన్ని గనులశాఖ మాత్రం రహస్యంగా ఉంచింది.

రెండేళ్ల కిందట ఒప్పందం... రాష్ట్రంలోని 13 ఉమ్మడి జిల్లాలను మూడు జోన్లుగా విభజించి ఇసుక తవ్వకాలు, విక్రయాల కోసం 2021లో టెండర్లు పిలవగా.. దిల్లీకి చెందిన జేపీ సంస్థ దక్కించుకుంది. ఆ మేరకు 2021 మే 3న గనుల శాఖతో రెండేళ్ల పాటు ఇసుక తవ్వకాలకు ఒప్పందం చేసుకుంది. అప్పటి వరకు ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) నుంచి ఆధ్వర్యంలో జరుగుతున్న ఇసుక వ్యాపారాన్ని జేపీ సంస్థ తమ చేతుల్లోకి తీసుకుంది. ఒప్పందం పూర్తయిన వెంటనే మే 14 నుంచి కార్యకలాపాలను ప్రారంభించింది. రెండేళ్ల గడువు ఈ నెలలో ముగియనుండగా తిరిగి టెండర్లు ఆహ్వానించాల్సిన ప్రభుత్వం.. అందుకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కానీ, ఒప్పంద గడువు ఎన్నాళ్లు కొనసాగించాలో చెప్పాలని కోరుతూ గనులశాఖ నుంచి ప్రభుత్వానికి దస్త్రం వెళ్లడం గమనార్హం. ఏడాది పాటు పునరుద్ధరించేందుకు సర్కారు పచ్చజెండా ఊపినట్లు తెలిసింది. దీంతో ఇటీవల ఒప్పందాన్ని పునరుద్ధరించారు.

సబ్ కాంట్రాక్టుతో మొదలైన దోపిడీ.. జేపీ సంస్థకు రెండేళ్లపాటు ఇసుక టెండరు దక్కినా.. ఉప గుత్తేదారుగా రంగప్రవేశం చేసిన చెన్నై మైనింగ్‌ వ్యాపారికి చెందిన టర్న్‌కీ ఎంటర్‌ప్రైజెస్‌ సంస్థ ఆధీనంలోనే రాష్ట్రమంతా ఇసుక తవ్వకాలు, విక్రయాలు సాగాయి. నిబంధనల ఉల్లంఘనలు, దందా యథేచ్ఛగా జరిగాయి. ఆ సంస్థ ప్రతినెలా పెద్దలకు భారీగా కప్పం కట్టేలా ఏర్పాట్లు చేయడంతో.. ప్రభుత్వశాఖలేవీ ఇసుక తవ్వకాల్లో ఉల్లంఘనలపై జోక్యం చేసుకోలేదు.

నాయకులకు బాధ్యతలు అప్పగింత.. కాగా, గత ఏడాది ఆగస్టులో ఆకస్మికంగా టర్న్‌కీ సంస్థను వైదొలిగేలా చేసి.. ఆ వెంటనే ప్రతి జిల్లాలో అధికారపార్టీ నేతలకు ఇసుక వ్యాపారం కట్టబెట్టారు. ఒక్కో ఉమ్మడి జిల్లాను ముఖ్యనేతలకు అప్పగించారు. వాళ్లు తిరిగి రీచ్‌ల వారీగా స్థానిక నేతలకు అప్పగించి ప్రతినెలా పెద్దలకు భారీ మొత్తం చెల్లించేలా ఏర్పాట్లు చేసుకున్నారు. బిల్లులు జేపీ, టర్న్‌కీ పేరిట ఇచ్చినా.. ఇసుక వ్యాపారం మాత్రం అధికార పార్టీ నేతల కనుసన్నల్లోనే కొనసాగుతోంది. ఈ నేపథ్యాన ఇసుక ఒప్పందం పొడిగింపు నేపథ్యంలో రెండేళ్లుగా సాగుతున్న ఉల్లంఘనలన్నీ మరో ఏడాది వైఎస్సార్సీపీ నేతలకు కాసులు కురిపించనున్నాయి.

సొంతంగా బిల్లుల ముద్రణ... రీచ్‌లు, స్టాక్‌ పాయింట్లలో ఆన్‌లైన్‌ బిల్లులు ఇవ్వరు. సొంతంగా ముద్రించుకున్న బిల్లులపై చేతిరాతతో జారీ చేస్తారు. దీనివల్ల వాస్తవ విక్రయాల లెక్కలు ఉండవు. నేతలు ఇచ్చే లెక్కలనే అధికారులు పరిగణనలోకి తీసుకుంటారు. ఎక్కడా డిజిటల్‌ చెల్లింపులు స్వీకరించరు. నగదు ఇస్తేనే ఇసుక లోడ్‌ చేస్తారు. సరిహద్దు జిల్లాల్లో రాత్రివేళ భారీగా ఇసుక తవ్వకాలు చేస్తూ.. ఆయా రాష్ట్రాలకు తరలిస్తున్నారు. ఏం జరిగినా.. గనులశాఖ, విజిలెన్స్, ప్రత్యేక కార్యదళం (ఎస్‌ఈబీ), రెవెన్యూ, పోలీసు శాఖలు అటు కన్నెత్తి చూడడం లేదు.

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.