ఉద్యోగుల ఉద్యమ నినాదం.. రెండోరోజు హోరెత్తిన ధర్నాలు.. వామపక్షాల మద్దతు

author img

By

Published : Mar 10, 2023, 6:03 PM IST

Etv Bharat

The employees protested :ఎన్నికల హామీల అమలు, సీపీఎస్ రద్దు ప్రధానాంశాలుగా ఏపీ జేఏసీ అమరావతి నాయకుల పిలుపుమేరకు ఉద్యోగులు, ఉపాధ్యాయులు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన బాటపట్టారు. రెండోరోజైన శుక్రవారం మధ్యాహ్నభోజన విరామ సమయంలో నల్లబ్యాడ్జీలు ధరించి రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు. మరోవైపు ఉద్యోగుల ఉద్యమానికి సీపీఐ, సీపీఎం మద్దతు ప్రకటించి ఎక్కడికక్కడ ధర్నాలు చేపట్టాయి.

The employees protested : సమస్యలు పరిష్కరించాలనే డిమాండ్ తో ఏపీజేఏసీ అమరావతి చేపట్టిన ఉద్యమ కార్యాచరణలో భాగంగా ఉద్యోగులు రెండో రోజు ఆందోళన చేశారు. భోజన విరామ సమయంలో నల్ల బ్యాడ్జీలు ధరించి వారి కార్యాలయాల ఆవరణలో రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఉద్యోగుల న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని వారు నినదించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి తమ న్యాయం చేయాలని వారు కోరారు.

ఏపీ పంచాయతీ రాజ్ ఇంజినీర్ ఇన్ చీఫ్ కార్యాలయం వద్ద ఏపీ జేఏసీ అమరావతి ఉద్యోగుల సంఘం ఆందోళన వ్యక్తం చేసింది. ఉద్యమ కార్యాచరణ నోటీసు ప్రకారం ముందుకు వెళ్తామని స్పష్టం చేసింది. ప్రభుత్వం తక్షణం తమకు చెల్లించాల్సిన బకాయిలు ఇవ్వాలని డిమాండ్ చేసింది. ప్రభుత్వం ఇచ్చిన హామీలను విశ్వసించే పరిస్థితుల్లో ఉద్యోగులు లేరని, ఈ నెల 20 తేదీ వరకూ అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఆందోళన కొనసాగుతుందని నేతలు స్పష్టం చేశారు.

ఆర్టీసీ హౌస్ లో... ఏపీ పీటీడీ ఉద్యోగులను ఏపీ జేఏసీ అమరావతి నేతలు కలిశారు. ఉద్యమ కార్యాచరణలో భాగంగా ప్రభుత్వానికి నిరసన తెలియ చేసేలా నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరు కావాలని పిలుపునిచ్చారు. 21 తేదీ నుంచి వర్క్ టూ రూల్ పాటించాలని స్పష్టం చేశారు.

మండిపడ్డ వామపక్ష నాయకులు... వైఎస్సార్సీపీ ప్రభుత్వం మోసపూరిత హామీలతో ఉద్యోగులను మోసం చేసిందని వామపక్ష నాయకులు మండిపడ్డారు. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని, ఇచ్చిన హామీ ప్రకారం సీపీఎస్ ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఉద్యోగులు చేపట్టిన నిరసనలకు మద్దతుగా వామపక్ష పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చౌక్ లో ధర్నా చేశారు. కార్మిక, ప్రజాసంఘాలు మద్దతు పలికాయి. ఎమ్మెల్సీ ఎన్నికలు సందర్భంగా ఉద్యోగులను మరోసారి మోసం చేసేందుకే ప్రభుత్వం చర్చల పేరుతో కాలయాపన చేస్తుందన్నారు. ప్రభుత్వ తీరుతో ఉద్యోగులు విసిగిపోయారని, ఇప్పటికైనా వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలన్నారు. లేదంటే ఉద్యోగులకు అండగా వామపక్ష పార్టీలు ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాయని హెచ్చరించారు.

నెల్లూరులో... వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఉద్యోగులు, నిరుద్యోగులకు తీరని అన్యాయం చేస్తోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు విమర్శించారు. ఉద్యోగ సంఘాలు చేపట్టిన ఆందోళన కార్యక్రమాలకు మద్దతుగా నెల్లూరు గాంధీ బొమ్మ సెంటర్ లో వామపక్ష పార్టీలు ఆందోళన చేపట్టాయి. ఉద్యోగులకు ఇచ్చిన ఒక్క హామీని కూడా ముఖ్యమంత్రి జగన్ నెరవేర్చలేదని ఈ సందర్భంగా శ్రీనివాసరావు అన్నారు. సీపీఎస్ రద్దు హామీని విస్మరించిన జగన్.. కనీసం జీతాలు కూడా సక్రమంగా ఇవ్వకుండా, బకాయిలను చెల్లించకుండా ఉద్యోగులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ధ్వజమెత్తారు. నిరసన కార్యక్రమాలకు ఉద్యోగ సంఘాలు పిలుపునిస్తే తూతూమంత్రంగా చర్చలు జరిపి మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మరోసారి ఉద్యోగులను ప్రలోభ పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. పరిశ్రమల స్థాపన కోసం విశాఖలో రూ.13 లక్షల కోట్ల ఒప్పందాలు జరిగాయంటూ మాయమాటలు చెబుతున్నారని, ఒప్పందాలన్నీ బోగస్ అని చెప్పారు.

శ్రీకాకుళం జిల్లాలో... రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ ఉపాధ్యాయులపై వేధింపుల ఆపాలంటూ శ్రీకాకుళంలో వామపక్షాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అంబేద్కర్ కూడలి వద్ద ధర్నా చేసిన వామపక్షాల నేతలు... పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఉద్యోగులను చర్చలకు ఆహ్వానించి... తప్పుడు కేసులు పెడుతోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు వెంకటేశ్వరరావు, సీపీఐ నాయకుడు వెంకటరమణ మండిపడ్డారు.

గుంటూరు జిల్లాలో... రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయులను అనేక రకమైన వేధింపులకు గురి చేస్తూ.. హామీలు నెరవేర్చకుండా కక్షపూరితంగా వ్యవహరించడం దుర్మార్గమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కోట మాల్యాద్రి మండిపడ్డారు. గుంటూరు జిల్లా స్థానిక శంకర్ విలాస్ సెంటర్లో సీపీఐ, సీపీఎం ఆధ్వర్యంలో ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు తలపెట్టిన ఉద్యమానికి మద్దతుగా నిరసన తెలిపారు. జీతాలు సక్రమంగా చెల్లించలేని ప్రభుత్వం ఉద్యోగులతో పనెలా చేయిస్తుంది..? అని సీపీఎం నగర నాయకులు ముత్యాల రావు ప్రశ్నించారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉపాధ్యాయులు ప్రచారంలో పాల్గొనకూడదని నిబంధనలు పెట్టడం దుర్మార్గం అని మండిపడ్డారు.

కడప జిల్లాలో... రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి నియంత పాలనకు చరమగీతం పాడాల్సిన సమయం ఆసన్నమైందని సీపీఐ జిల్లా కార్యదర్శి చంద్ర పిలుపునిచ్చారు. ప్రతి నెల ఒకటో తేదీ జీతాలు ఇవ్వలేని దుస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉండడం దారుణమని ఆయన మండిపడ్డారు. జీతాల కోసం ఆందోళనలు చేస్తే ముందస్తు అరెస్టులు చేయడం దుర్మార్గమని ఆయన ఖండించారు. ఆర్డీవో కార్యాలయం ఎదుట సీపీఐ, సీపీఎం ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జీతాలు పెంచాల్సింది పోయి.. ఉన్న జీతాలను తగ్గించి ఉద్యోగులు, ఉపాధ్యాయుల జీవితాలతో చెలగాటమాడటం తగదని అన్నారు.

అనంతపురం జిల్లాలో.. ఉద్యోగుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధి లేకుండా ప్రవర్తిస్తుందని సీపీఐ, సీపీఎం నాయకులు ఆరోపించారు. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని అనంతపురంలోని గాంధీ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు. టవర్ క్లాక్ నుంచి గాంధీ విగ్రహం వరకు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ర్యాలీ చేపట్టారు. ఎన్నికల ముందు ఉద్యోగులకు అనేక హామీలు ఇచ్చిన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విస్మరించిందన్నారు. సమస్యలు పరిష్కరించాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తే కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగుల సమస్యలు పట్టించుకోని ఈ ప్రభుత్వానికి ఎమ్మెల్సీ ఎన్నికల్లో సరైన సమాధానం చెప్పే అవకాశం వచ్చిందన్నారు. పట్టభద్రులు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు సరైన అభ్యర్థిని ఎన్నుకొని ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలన్నారు.

ఉద్యోగుల రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.