ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్​లో అక్రమాలు.. అయినా, ఫలితాలను గౌరవిస్తాం: సజ్జల

author img

By

Published : Mar 19, 2023, 8:29 PM IST

సజ్జల బొత్స

Sajjala comments : పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలను.. తాము గౌరవిస్తామని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. అదే సమయంలో పశ్చిమ రాయలసీమ ఎమ్మెల్సీ కౌంటింగ్ లో అక్రమాలు జరిగాయని వైఎస్సార్సీపీ అభిప్రాయపడుతోందని ఆయన తెలిపారు. ఈ ఫలితాలపై మంత్రులు కారుమూరి, బొత్సాలు స్పందించారు. ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి ఎందుకు వచ్చిందో పరిశీలించుకుంటామని పేర్కొన్నారు.

Sajjala comments : పశ్చిమ రాయలసీమ ఎమ్మెల్సీ కౌంటింగ్ లో అక్రమాలు జరిగాయని వైఎస్సార్సీపీ అభిప్రాయపడుతోందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. దీనిపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని ఆయన తెలిపారు. కౌంటింగ్ లో పాల్గొన్న అధికారుల తీరుపైనా అనుమానాలు ఉన్నాయని.. ఒక్కోసారి వైసీపీ అధికారంలో ఉందా లేదా..! అన్న ఆలోచన వస్తోందని సజ్జల పేర్కొన్నారు. ప్రతిపక్షంలో ఉన్నా, అధికారంలో ఉన్నా వైఎస్సార్సీపీ తన హక్కుల కోసం పోరాడాల్సి వస్తోందన్నారు. అర్జెంటుగా అధికారం చేపట్టాలన్న తీరులో చంద్రబాబు ఉన్నారని.. ఆయనకు కలలు మాత్రమే మిగులుతాయన్నారు. మరోవైపు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తామన్నారు.

టీడీపీకి సాంకేతిక బలం ఉంది... తెలుగుదేశం పార్టీ వైరస్ లాంటిదని, వ్యవస్థలో ఎక్కడైనా మేనేజ్ చేసే అవకాశం ఉంటుందనే అనుమానంతో ఫిర్యాదు చేశామని వెల్లడించారు. గతంలో ఏబీ వెంకటేశ్వరరావు టీడీపీ ప్రభుత్వానికి ఓ సేనాధిపతిలా వ్యవహరించారని సజ్జల ఆరోపించారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక సీటుకు సాంకేతికంగా టీడీపీకి బలం ఉందని, అయితే ఆ పార్టీ నుంచి కొందరు బయటకు వచ్చారని అన్నారు. ఆ పార్టీ ఏదైనా ప్రలోభాలకు పాల్పడే అవకాశాలున్నాయని సజ్జల వ్యాఖ్యానించారు.

టీడీపీ అభ్యర్థికి వచ్చిన ఓట్లను మరోసారి పరిశీలించాలని మేం ఎన్నికల రిటర్నింగ్ అధికారిని కోరాం. కానీ, ఫలితాలు వెల్లడించిన తర్వాతనే అవకాశం ఉంటుందని చెప్పడంతో మళ్లీ లెటర్ పెట్టాం. నిబంధనల ప్రకారం మేం పూర్తిగా రీకౌంటింగ్ కోరే అవకాశాలున్నాయి. కానీ, అలా కాకుండా గెలిచిన అభ్యర్థికి వచ్చిన ఓట్లను, వాటిని వేరు చేస్తూ చేసిన కట్టలను మళ్లీ పరిశీలించాలని కోరుతున్నాం. ఇది మా హక్కు. అడిగే హక్కు ఉందని చట్టం చెప్తుంది. దాని ప్రకారమే అడుగుతున్నాం, అంతే తప్ప.. వితండ వాదం కాదు. పార్లమెంటు ఎన్నికల్లో కూడా పది, ఇరవై ఓట్ల తేడాతో ఫలితాలు తారుమారయ్యాయి. ఇవాళ్టి ఫలితాలకు అధికారులు కారణమై ఉండొచ్చు అని కూడా మేం భావిస్తున్నాం. ఆయా వర్గాలను ప్రభావితం చేయడంలో టీడీపీ వైరస్ లాంటిది. గ్రాడ్యుయేట్ ఓట్ల లెక్కింపులో టీడీపీకి చెందిన ప్రముఖ నాయకులు ఏజెంట్ల స్థానంలో వచ్చి కూర్చోవడాన్ని ఎలా భావించాలి. అధికారులను దబాయించే నాయకులను అక్కడ ఉంచారు. వీటిని గమనిస్తుంటే మేం అధికారంలో ఉన్నామా అనే సందేహం వస్తోంది. లిఖిత పూర్వకంగా కాకుండా ఓరల్ గా అడిగినా మళ్లీ లెక్కించాల్సి ఉంది. అయినప్పటికీ మా విన్నపాన్ని రిటర్నింగ్ అధికారి పరిగణలోకి తీసుకోలేదు. దీనిపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో 175 స్థానాల్లో టీడీపీ అభ్యర్థులను పోటీచేయించగలదా..? - సజ్జల రామకృష్ణారెడ్డి, ప్రభుత్వ సలహాదారు

గెలిచిన రెండు మూడు పట్టభద్రుల ఎమ్మెల్సీలను చూసి చంద్రబాబు జబ్బలు చరుచుకుంటున్నారని మంత్రి కారుమూరు నాగేశ్వరావు ఎద్దేవా చేశారు. మూడు ఎమ్మెల్సీ సీట్ల గురించి టీడీపీ విర్రవీగుతోందని అన్నారు. ప్రజలు మళ్లీ తమకు పట్టం కడతారని మంత్రి వ్యాఖ్యానించారు. రాష్ట్రాభివృద్ధి, సంక్షేమం దిశగా తమ ప్రభుత్వం నడుస్తోందని అన్నారు. చంద్రబాబుకు వయసైపోయిందని .. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలో ఒకటి గెలుస్తామనుకోవడం టీడీపీ ఇష్టమని మంత్రి కారుమూరు పేర్కొన్నారు.

పట్టభద్రుల ఎన్నికల్లో పాల్గొన్న వారి సంఖ్య ఈ రాష్ట్ర జనాభాతో పోలిస్తే ఒక్క శాతం మాత్రమే. అయినా, ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి ఎందుకు వచ్చిందో పరిశీలించుకుంటాం. ఈ ఓటమి తిరుగుబాటు కాదు.. గెలుపోటములు సహజం. విజయం ఎలా దక్కిందో, ఓటమికి కారణాలు ఏమిటో పరిశీలించుకుంటాం. ఎమ్మెల్యే కోటా ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో ముందు ముందు చూద్దాం. వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీ వైపు చూస్తున్నారో.. టీడీపీ ఎమ్మెల్యేలు ఆకాశం వైపు చూస్తున్నారో రేపటి ఎన్నికల్లో చూద్దాం. మనిషి ఆశాజీవి. అలాగే రాజకీయనాయకులు కూడా.. మేమే గెలుస్తాం అనే చెప్పుకుంటారు. ఓడిపోతాం అని చెప్పుకుంటే ఆయన వెనుక ఎవ్వరూ ఉండరు. రాజకీయాల్లో ఆశ కల్పించడం సహజం. - బొత్స సత్యనారాయణ, మంత్రి

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.