యువగళానికి అనుమతుల రాజకీయం.. పోలీసుల కొర్రీలపై టీడీపీ ఫైర్​

author img

By

Published : Jan 22, 2023, 1:32 PM IST

Updated : Jan 22, 2023, 7:57 PM IST

Nara Lokesh Yuvagalam Permissions

Nara Lokesh Yuvagalam Permissions : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్​ యువగళం పేరిట మహాపాదయాత్రకు సిద్ధమయ్యారు. ఈ నెల 27న కుప్పంలో ప్రారంభం కానున్న పాదయాత్ర 4వేల కిలోమీటర్లు కొనసాగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా 400 రోజుల పాటు ప్రజాక్షేత్రంలో పర్యటించి ప్రజా సమస్యలు తెలుసుకుని వారికి భరోసా కల్పించనున్నారు. ఈ నేపథ్యంలో పాదయాత్ర నిర్వహణకు పార్టీ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేపట్టగా.. అనుమతుల సాకుతో రాష్ట్ర ప్రభుత్వం వేధింపులకు పాల్పడుతోందని టీడీపీ నాయకులు అయ్యన్నపాత్రుడు, యనమల రామకృష్ణుడు, కొల్లు రవీంద్ర, జవహర్ మండిపడ్డారు.

Nara Lokesh yuvagalam : నారా లోకేశ్​ యువగళం మహాపాదయాత్రకు వైసీపీ ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తోందని టీడీపీ నేతలు మండిపడుతున్నారు. నాయకులు పాదయాత్ర ద్వారా ప్రజలకు చేరువ కావడం రాజ్యాంగం కల్పించిన హక్కు అని గుర్తు చేస్తున్నారు. ప్రజా సమస్యలను గాలికొదిలిన ప్రభుత్వం.. ప్రశ్నించే ప్రతిపక్ష నేతలను అడ్డుకోజూస్తోందని ధ్వజమెత్తారు. అనుమతులు ఇవ్వొద్దనే ఉద్దేశంతో జవాబులు లేని ప్రశ్నలతో డీజీపీ లేఖ రాయడాన్ని తీవ్రంగా ఆక్షేపించారు. మహా పాదయాత్రలో ఎంత మంది పాల్గొంటారో ముందే చెప్పడం సాధ్యమేనా అని ప్రశ్నించారు.

పోలీసులది రాజకీయం : పాదయాత్రను అడ్డుకునేందుకు ప్రభుత్వం కొర్రీలు పెడుతోందని ఆగ్రహం వ్యక్తం చేసింది. రకరకాల సమాచారం పేరుతో అనుమతి నిరాకరణ వ్యూహాన్నిపోలీసులు అవలంబిస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపించారు. గతంలో ఎప్పుడూ అడగని ప్రశ్నలు లోకేశ్ పాదయాత్రకు ఎందుకు అడుగుతున్నారని నిలదీశారు. డీజీపీ రాసిన లేఖపై పలు ప్రశ్నలు సంధించిన వర్ల రామయ్య.. పోలీసులే ప్రతిపక్షాల కార్యక్రమాలను అడ్డుకునే రాజకీయం చేస్తున్నారని విమర్శించారు.

మండిపడ్డ నాయకులు : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్​ పాదయాత్రకు డీజీపీ లేఖపై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు అయ్యన్నపాత్రుడు మండిపడ్డారు. డీజీపీ ప్రశ్నల తీరును ఆయన తప్పుబట్టారు. ఆయన డీజీపీ కాదు.. కసిరెడ్డే! అంటూ ట్వీట్ చేశారు. మరోవైపు లోకేష్ పాదయాత్ర కి డీజీపీ దేశంలో ఎక్కడా లేని కండిషన్లు పెట్టడం తాడేపల్లి కుట్రేనని తెదేపా పోలిట్ బ్యూరో మెంబర్ బొండా ఉమా ధ్వజమెత్తారు. పాదయాత్రకు ఎంతమంది వస్తారో, ఎన్ని కార్లు వస్తాయో.. వివరాలు ఇమ్మంటే సాధ్యమా..? అని నిలదీశారు. లోకేష్ పాదయాత్రకు జగన్ అవినీతి పాలనతో ఇబ్బంది పడి, కడుపు మండిన ప్రజలు ఎంత మంది వస్తారో అంచనా వేయడం సాధ్యమా..? అని ప్రశ్నించారు.

గతం మర్చిపోతే ఎలా.. : గతంలో వైసీపీ జగన్ పాదయాత్ర చేసినప్పుడు ఏ అనుమతి అవసరం లేదని చెప్పిన మాట డీజీపీకి గుర్తులేదా అని దుయ్యబట్టారు. జగన్, షర్మిల పాదయాత్రకు ఏ విధంగా పోలీసులు అనుమతి ఇచ్చారో లోకేశ్​ పాదయాత్రకు అలాగే ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాజకీయ పార్టీలకు పాదయాత్ర ద్వారా ప్రజల వద్దకు వెళ్లే హక్కు రాజ్యాగంమే ఇచ్చిందనే విషయాన్ని డీజీపీ గుర్తు పెట్టుకోవాలన్నారు. లోకేశ్​ పాదయాత్రను అడ్డంకులు సృష్టించాలని చూస్తే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు.

యువగళానికి సంఘీభావం : లోకేశ్‌ యువగళానికి సంఘీభావంగా వినుకొండ నియోజకవర్గంలో టీడీపీ నేత జీవీ ఆంజనేయులు పాదయాత్ర చేపట్టారు. వినుకొండ సాయిబాబా గుడి నుంచి ప్రారంభించిన పాదయాత్ర.. మదమంచిపాలెం ఆంజనేయస్వామి గుడి వరకు కొనసాగనుంది. గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని పాదయాత్రని ప్రారంభించగా.. టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నాయి.

జగన్, డీజీపీ కుట్ర : నారా లోకేశ్​ పాదయాత్ర కోసం రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్నారని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. రాక్షస ప్రభుత్వంలో.. సమస్యలు ఎవరికీ చెప్పుకోవాలో అర్థంకాని పరిస్థితుల్లో ప్రజలు వున్నారని తెలిపారు. యువత దిక్కుతోచని స్థితిలో వుందని, నారా లోకేశ్​ పాదయాత్ర అంటే ప్రభుత్వానికి వణుకు మొదలైందని అన్నారు. పాదయాత్ర ఆపాలని జగన్ , డీజీపీ కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ఎన్ని కుట్రలు చేసినా రాష్ట్ర ప్రజల సమస్యలపై లోకేష్ పాదయాత్ర కొనసాగుతుందని తేల్చిచెప్పారు. పోలీస్ వారికీ ఒక్కటే చెబుతున్నా... ప్రజాస్వామ్య పరిరక్షణకు చేస్తున్న లోకేష్ యాత్రకు చట్టపరంగా వ్యవహరించాలని కోరారు.

ప్రజాగ్రహం బయటపడకుండా ప్రయత్నం : యువతను నయవంచన చేసిన మోసగాడు జగన్ అని, యువతలో వెల్లువెత్తిన ఆగ్రహం బయటపడకుండా వైసీపీ అడ్డుపడాలని చూస్తోందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు ధ్వజమెత్తారు. యువగళాన్ని అడ్డుకుంటే రాష్ట్ర యువతను అడ్డుకున్నట్టేనన్నారు. జగన్ ప్రతిపక్షంలో ఉండగా చేసిన పాదయాత్రలో యువతకు అనేక హామీలిచ్చి వాటిని గాలికొదిలేశాడని మండిపడ్డారు. అధికారంలోకి వచ్చాక యువత సంక్షేమాన్ని, భవితవ్యాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశాడని ఆక్షేపించారు. ప్రతియేటా జాబ్ క్యాలెండర్ విడుదల చేసి పోస్టులు భర్తీ చేస్తామని ఇచ్చిన హామీని విస్మరించాడని ఆగ్రహం వ్యక్తంచేశారు. రాష్ట్రంలో జగన్ అధికారంలోకి రాకముందు ఉన్న 3లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని ఎన్నికల సమయంలో హామీలిచ్చి వాటి ఊసెత్తలేదన్నారు. జగన్ అధికారంలోకి వచ్చాక యువతకు స్వయం ఉపాధి అవకాశాలు పూర్తిగా ధ్వంసమయ్యాయని, వచ్చే ఎన్నికల్లో జగన్ కి యువతే తగిన బుద్ధి చెబుతారని ఉద్ఘాటించారు.

దేశంలో ఎక్కడా లేని కండీషన్లు.. ప్రభుత్వ కుట్రే : నారా లోకేష్ పాదయాత్రకు డీజీపీ దేశంలో ఎక్కడా లేని కండీషన్లు పెట్టడం ప్రభుత్వ కుట్రే అని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు చినరాజప్ప ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ఏ నేతలను ఇలా సమగ్ర వివరాలివ్వాలని అడగలేదని గుర్తుచేశారు. స్థానిక పరిస్థితుల ఆధారంగా రూట్ మ్యాప్ 4 రోజుల ముందు మాత్రమే జిల్లాలో నిర్ణయమవుతుందని చినరాజప్ప స్పష్టంచేశారు. నిర్ణయమైన రూట్ మ్యాప్ ల వివరాలు స్ధానికంగా ఉండే పోలీసులకు అందిస్తామన్నారు. జగన్ పాదయాత్రకు ఏ విధంగా పోలీసులు అనుమతి ఇచ్చారో లోకేష్ పాదయాత్రకు అలాగే ఇవ్వాలని చినరాజప్ప డిమాండ్ చేశారు.

పరిణామాలు తీవ్రతరం : లోకేశ్ యాత్రను అడ్డుకోవాలని చూస్తే పరిణామాలు తీవ్రతరం చేస్తామని మాజీ మంత్రి కేఎస్ జవహర్ హెచ్చరించారు. పాదయాత్రకు మునుపే జగన్ వర్గం, వైకాపా నాయకులకు పాంట్లు తడిసిపోతున్నాయని ఆక్షేపించారు. యాత్రను ఏ విధంగా అడ్డుకోవాలని ప్రణాళికలు రచిస్తున్నారని ఆరోపించారు. లోకేశ్ యాత్రతో అధికారుల స్థాన చలనాలు, రాష్ట్రంలో రాజకీయం మారబోతోందన్నారు.

అధికారులు బూజుపట్టిన చట్టాన్ని తెచ్చి యాత్రను అడ్డుకోవాలని చూస్తున్నారని జవహర్ మండిపడ్డారు. లోకేష్ పాదయాత్రకు ప్రజలు పెద్ద ఎత్తున నీరాజనం పలుకనున్నారని తెలిపారు. అన్ని వర్గాలవారు లోకేశ్ పాదయాత్రకై ఎదురుచూస్తున్నారన్న జవహర్.. ప్రధానంగా యువత వెయ్యి కళ్లతో ఎదురుచూస్తోందని ఉద్ఘాటించారు. మళ్లీ చంద్రబాబు వస్తే యువతకు ఉపాధి అవకాశలు మెండు అని స్పష్టంచేశారు. అనుమతి ఇచ్చినా.. ఇవ్వకపోయినా పాదయాత్ర జరిగితీరుతుందని తేల్చిచెప్పారు. డీజీపీ లేఖ పై స్పందించిన మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న సాగనిస్తే పాదయాత్ర అడ్డుకుంటే ప్రభంజనమన్నారు.

మండిపడుతున్న టీడీపీ నేతలు

ఇవీ చదవండి :

Last Updated :Jan 22, 2023, 7:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.