Food in schools: గాడి తప్పిన మేనమామ మెనూ.. పిల్లల ఆహారంలో కోతలే కోతలు

author img

By

Published : Aug 4, 2022, 4:17 AM IST

Food in schools

Food in schools: పాఠశాలల్లో, వసతి గృహాల్లో పిల్లలకు అందించే భోజనం విషయంలో ప్రభుత్వ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. పిల్లలకిచ్చే ఆహార మెనూ గాడి తప్పింది. గత మూడేళ్లలో నిత్యావసరాల ధరలు నింగినంటి... పిల్లల ఆహారంలో కోత పడుతున్నా ఎందుకు పట్టించుకోవట్లేదు? వారిని మేనమామలా చూసుకుంటానని చెప్పి.. డైట్‌ ఛార్జీలను పెంచాలన్న ఆలోచన ఎందుకు రావట్లేదనే ప్రశ్నలు తల్లిదండ్రుల నుంచి వినిపిస్తున్నాయి.

Food in schools: ‘నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీల సంక్షేమానికి వేల కోట్లు ఖర్చు చేస్తున్నా. మూడేళ్లలో పేదల సంక్షేమానికి రూ.1.65 లక్షల కోట్లు ఖర్చు చేశా...’ సీఎం జగన్‌ ఇటీవల పదేపదే చెబుతున్న మాట ఇది. ఇన్ని వేల కోట్ల సంక్షేమంలో వసతిగృహాల్లోని పేద పిల్లలకు పెట్టే పిడికెడు మెతుకులు గుర్తుకు రాలేదా? గత మూడేళ్లలో నిత్యావసరాల ధరలు నింగినంటి... పిల్లల ఆహారంలో కోత పడుతున్నా ఎందుకు పట్టించుకోవట్లేదు? వారిని మేనమామలా చూసుకుంటానని చెప్పి.. డైట్‌ ఛార్జీలను పెంచాలన్న ఆలోచన ఎందుకు రావట్లేదనే ప్రశ్నలు తల్లిదండ్రుల నుంచి వినిపిస్తున్నాయి. ప్రీమెట్రిక్‌, పోస్ట్‌మెట్రిక్‌ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమ వసతి గృహాలు/కళాశాలల్లో సుమారు 5 లక్షల మంది పిల్లలు ఉన్నారు. 2018లో అప్పటి ప్రభుత్వం విద్యార్థుల డైట్‌ ఛార్జీలను ఒక్కొక్కరికి రూ.250 నుంచి రూ.500కు పెంచింది.

నాటి మెనూ ప్రకారం ప్రీమెట్రిక్‌ హాస్టళ్ల పిల్లలకు వారంలో ఆరు రోజులపాటు పాలు, గుడ్లు, మూడు రోజులు చికెన్‌, ఏడు రోజులు అరటిపండ్లు ఇవ్వాలి. పోస్ట్‌మెట్రిక్‌ హాస్టళ్లలో రెండు రోజులు చికెన్‌ పెట్టాలి. మిగతాదంతా ప్రీమెట్రిక్‌ మెనూనే. నాలుగేళ్లనాటి ఈ డైట్‌ ఛార్జీలనే ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం నిత్యావసరాల ధరలన్నీ బాగా పెరిగాయి. అప్పటికీ... ఇప్పటికీ పొంతనే లేదు. దాంతో వాటిని కొనలేక హాస్టళ్ల అధికారులు చేతులెత్తేస్తున్నారు.

అధికారికంగానే మెనూలో మార్పు
విజయనగరం జిల్లా ఎస్సీ, బీసీ హాస్టళ్లలో నిర్దేశిత మెనూలో అధికారికంగానే కోత వేశారు. నిత్యావసరాల ధరలు పెరిగాయని వసతిగృహాల అధికారులు చెప్పడంతో 2019 డిసెంబరులో కలెక్టర్‌ మార్పులు చేశారు. చికెన్‌, కోడిగుడ్లు, అరటిపండ్లలో కోత విధించారు. అయినా... అప్పటి ధరలకు అనుగుణంగా అమలు చేయలేక అల్లాడారు. ఆ తర్వాత ధరలు మరింత పెరిగాయి. దాన్నిబట్టి ప్రస్తుత మెనూ అమలు తీరును ఊహించుకోవచ్చు.

ప్రభుత్వం పెంచలేదని అధికారులే కోత విధించారు
అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు ఐటీడీఏ పరిధిలోని గిరిజన ఆశ్రమ పాఠశాల వసతిగృహాల్లో ప్రభుత్వ మెనూ అమలును ఎప్పుడో మానేశారు. రోజూ ఇవ్వాల్సిన అరటిపండ్లను వారంలో 3 రోజులకు... 6 రోజులు ఇవ్వాల్సిన పాలు, గుడ్లను 4 రోజులకు పరిమితం చేశారు. అందుబాటులో ఉన్న కూరగాయలనే తెస్తున్నారు. ఇదేమని అడిగితే... ఉన్నతాధికారుల ఆదేశాల మేరకేనని చెబుతున్నారు. పాడేరు ఐటీడీఏ పరిధిలోని 11 మండలాల్లో ఉన్న 122 ఆశ్రమ పాఠశాలల్లో ఇదే పరిస్థితి. విశాఖ, విజయనగరం జిల్లాల్లోనూ మెనూలో కోత వేశారు.

ఒక్కో హాస్టల్‌పై రూ.10-15 వేల అదనపు ఖర్చు
రాష్ట్ర ప్రభుత్వం 2018లో నిర్దేశించిన ధరలకే వసతిగృహాల అధికారులు బిల్లులు పెట్టుకోవాలి. విద్యార్థుల సంఖ్యను బట్టి ఎంత ఖర్చవుతుందో అంచనా వేసి, అదనపు భారాన్ని తగ్గించుకునేందుకు కోత పెడుతున్నారు. 8, 9, 10 తరగతులకు చెందిన 50 మంది పిల్లలున్న ఒక్కో హాస్టల్‌పై ప్రతినెలా 10-15 వేల వరకు అధిక వ్యయం అవుతోందని అధికారులు చెబుతున్నారు.

ప్రతిపాదనల దశలోనే దస్త్రం
సాంఘిక సంక్షేమశాఖ అధికారులు నిరుడు డైట్‌ ఛార్జీల పెంపు ప్రతిపాదనలతో దస్త్రం సిద్ధం చేశారు. 2021 నవంబరుకే ధరలను 25% పెంచాలని ప్రభుత్వానికి నివేదించినట్లు తెలిసింది. ఆ దస్త్రం ప్రతిపాదన దశలోనే ఆగింది. ఇప్పటి ధరలతో పోలిస్తే మరింత పెంచాల్సి రావొచ్చు. ఇటీవల కొత్తగా సాంఘిక సంక్షేమశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన మేరుగ నాగార్జున దృష్టికి కూడా అధికారులు ఈ విషయాన్ని తీసుకెళ్లారు. ఆయన సైతం ప్రభుత్వం వద్ద ప్రతిపాదన ఉందని వెల్లడించారు.

ప్రస్తుత ధరలు

పిల్లలు అర్ధాకలితో అలమటిస్తున్నా పట్టించుకోరా?
సంక్షేమానికి వేలకోట్లు ఇస్తున్నట్లు చెబుతున్న సీఎం జగన్‌... దళితుల పిల్లలకు సరైన పోషకాహారాన్ని అందించలేకపోతున్నారు. నిత్యావసరాల ధరలు పెరిగి హాస్టళ్లలో మెనూ అమలు కాకపోయినా పట్టించుకోరా? పిల్లలు అర్ధాకలితో అలమటిస్తున్నా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారా? - ఆండ్ర మాల్యాద్రి, కేవీపీఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

ధరలు పెరిగిన విషయం ప్రభుత్వానికి తెలియదా?


పెరుగుతున్న ధరల్ని పరిగణనలోకి తీసుకుని ఎప్పటికప్పుడు డైట్‌ ఛార్జీలు పెంచాల్సిన ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. పేద పిల్లలకు నాణ్యమైన ఆహారం అందకుండా చేస్తోంది. గ్యాస్‌ దగ్గర నుంచి అన్నింటి ధరలు భారీగా పెరిగిన విషయం సర్కారుకు తెలీదా? - నూకానమ్మ, జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు

మైనార్టీ వసతి గృహాల్లోని సమస్యలు పట్టవా?

ప్రభుత్వం ఖర్చు చేశామంటున్న రూ.1.65 లక్షల కోట్లలో ముస్లిం పిల్లలకు చోటులేదా? పిల్లలకు మేనమామ అంటూ ప్రచారం తప్ప చేతల్లో చేస్తున్నది ఏముంది? తక్షణం ప్రభుత్వం మైనార్టీ హాస్టళ్లలోని ఇబ్బందులను పరిష్కరించాలి. - ఫరూక్‌ షిబ్లీ, మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు

మంచి తిండి పెట్టడం కంటే సంక్షేమం ఉందా?

నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరిగాయి. వసతి గృహాల్లో పాత డైట్‌ ఛార్జీలనే అమలు చేస్తున్నారు. దీంతో అధికారులు పోషకాహారంలో కోత వేస్తున్నారు. పేదల పిల్లలకు మంచి తిండి పెట్టడం కంటే సంక్షేమం మరొకటి ఉందా? - రామారావు దొర, ఆంధ్రప్రదేశ్‌ ఆదివాసీ జాయింట్‌ యాక్షన్‌ కమిటీ విశాఖ జిల్లా కన్వీనర్‌

పోషకాహార లేమితో ఆరోగ్య సమస్యలు

పిల్లలకు అందించే ఆహారంలో సమతుల్యత, నాణ్యత లోపిస్తే వ్యాధులు వస్తాయి. కంటిచూపు మందగిస్తుంది. ఎముకలు పెళుసుబారుతాయి. నరాల బలహీనత, రక్తహీనత ఏర్పడతాయి. వయసుకు తగిన బరువు, ఎత్తు ఉండరు. పోషకాహారలోపంతో వయసు పెరిగేకొద్దీ అనారోగ్యంగా మారే ప్రమాదముంది. చిన్నతనం నుంచే వయసుకు తగ్గట్లు ఆహారం అందించకుంటే... వారు పెద్దయ్యాక ఆ లోటును ఎవరూ పూడ్చలేరు.-డాక్టర్‌ సి.అంజలీదేవి, విశ్రాంత ఆచార్యులు, పోషకాహార నిపుణులు

పిల్లలపై తల్లిదండ్రులకు లేని శ్రద్ధ జగన్‌కు ఉంది

వసతి గృహాలు, గురుకులాల్లో సీఎం జగన్‌ కచ్చితమైన మెనూ పెట్టి, రోజూ మంచి ఆహారాన్ని అందిస్తున్నారు. ఇంట్లో తల్లిదండ్రులు పిల్లల మీద పెట్టలేని శ్రద్ధను జగన్‌ తీసుకుంటున్నారు. ఎస్సీ పిల్లలను ముఖ్యమంత్రి సొంత మేనమామలా చూసుకుంటున్నారు. ఇంకా ఎక్కడైనా చిన్నచిన్న లోపాలున్నా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. - మే 4న సచివాలయంలో విలేకరులతో సాంఘిక సంక్షేమశాఖ మంత్రి నాగార్జున

చికెన్‌, కోడిగుడ్లలో కోత: పిల్లలకు ఇచ్చే పోషకాహారంలో చికెన్‌, కోడిగుడ్లను తగ్గిస్తున్నారు. నెలలో 8సార్లు చికెన్‌ పెట్టాల్సి ఉండగా 2విడతలు కోత విధిస్తున్నారు. వారానికి 6 రోజులు గుడ్లు ఇవ్వాల్సి ఉండగా కొన్నిచోట్ల 5 రోజులే ఇస్తున్నారు. అరటిపండ్లలోనూ కోతవేస్తున్నారు. రాగి జావలో బెల్లం వేయడంలేదు. పాలనూ అరకొరగానే అందిస్తున్నారు. 50 మంది పిల్లలున్న హాస్టల్‌కు 8 కిలోల కూరగాయలను కొనాల్సి ఉండగా ప్రస్తుత ధరలతో 6కిలోలే వస్తున్నాయి.

ఇవీ చదవండి: సీడ్స్‌ కంపెనీలో విషవాయువు లీకేజీ ఘటన.. విచారణకు కమిటీ నియమించిన ఎన్జీటీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.