Kondapalli Municipal Chairman Election: ముగిసిన కొండపల్లి మున్సిపల్‌ ఛైర్మన్‌ ఎన్నిక

author img

By

Published : Nov 24, 2021, 10:14 AM IST

Updated : Nov 24, 2021, 1:38 PM IST

Kondapalli Municipality

మూడు రోజులుగా టెన్షన్​.. ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ.. చైర్మన్​ పీఠం దక్కించుకునేందుకు నువ్వా-నేనా అనే విధంగా వైకాపా-తెదేపా వ్యుహాలు.. గందరగోళం మధ్య రెండు రోజులు వాయిదా పడిన కొండపల్లి మున్సిపాలిటీ చైర్మన్​ ఎంపిక.. చివరకు కోర్టు మెట్లెక్కిన తెదేపా.. దీంతో హైకోర్టు ఈరోజు (బుధవారం) చైర్మన్​ ఎన్నిక నిర్వహించాలని ఆదేశించడంతో.. ఎస్​ఈసీ ఆ ప్రక్రియను నిర్వహించింది. చైర్మన్​ ఎన్నిక వివరాలకు అధికారులు.. కోర్టుకు సమర్పించనున్నారు.

మూడు రోజులుగా ఉత్కంఠ రేపిన కృష్ణా జిల్లా కొండపల్లి మున్సిపాలిటీ ఛైర్మన్‌ ఎన్నిక ప్రక్రియ ముగిసింది. ఛైర్మన్‌ ఎన్నిక వివరాలను ఎస్‌ఈసీ హైకోర్టుకు అందజేయనుంది. హైకోర్టు ఆదేశాల మేరకు ఎన్నిక నిర్వహించిన అధికారులు.. ఎన్నికకు ముందు వార్డు సభ్యులతో ప్రమాణం చేయించారు. హైకోర్టు అనుమతి మేరకు ఎంపీ కేశినేని నాని ఎక్స్‌అఫిషియో ఓటును వినియోగించుకున్నారు. చెన్నుబోయిన చిట్టిబాబును తెదేపా.. ఛైర్మన్‌ అభ్యర్థిగా ప్రతిపాదించింది.

ఎంత ప్రలోభపెట్టినా మా కౌన్సిలర్లు తప్పుకోలేదు

కొండపల్లి ఛైర్మన్, వైస్ ఛైర్మన్ల ఎన్నిక జరిగింది. ఛైర్మన్‌గా చెన్నుబోయిన చిట్టిబాబును ప్రతిపాదించాం. వైస్‌ఛైర్మన్లుగా ధరణికోట శ్రీలక్ష్మి, శ్రీనివాస్ చుట్టుకుదురును ప్రతిపాదించాం.ఎంత ప్రలోభపెట్టినా మా కౌన్సిలర్లు తప్పుకోలేదు. తెదేపా తరఫున 15 మంది కౌన్సిలర్లు భయపడలేదు. నా ఓటు కోర్టు నిర్ణయిస్తుంది. కోర్టు నిర్ణయం తుది నిర్ణయం. ప్రజాసేవ చేయడానికే రాజకీయాల్లోకి వచ్చాం. -కేశినేని నాని, ఎంపీ

ఛైర్మన్‌ ఎవరైనా సహకరిస్తా..

కొండపల్లి మున్సిపల్‌ ఛైర్మన్ ఎన్నిక ప్రశాంతంగా జరిగిందని వైకాపా ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ తెలిపారు. తెదేపాకు 16వ ఓటు చెల్లదని తాము తెలిపామన్నారు. కోర్టుకు సీల్డ్ కవర్​లో సమాచారం పంపుతున్నారని.. ఏ పాలక వర్గం ఏర్పడినా తన వంతు సహకారం ఉంటుందన్నారు. కొండపల్లికి ఎవరు ఛైర్మన్ అయినా.. ఎమ్మెల్యేగా తాను సహకరిస్తానన్నారు. ఛైర్మన్ ఎన్నికపై అంతిమ నిర్ణయం కోర్టుదేనన్నారు.

పోలీసుల బందోబస్తు..

ఎన్నిక నేపథ్యంలో మూడో రోజూ పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ముళ్ల కంచెలు, బారికేడ్లను ఏర్పాటు చేశారు. ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా.. సుమారు 750మంది పోలీస్ బలగాలతో పహారా ఏర్పాటు చేశారు. తెదేపా, వైకాపా కౌన్సిలర్లు, ఎంపీ కేశినాని, ఎమ్మెల్యే కృష్ణ ప్రసాద్ మున్సిపల్‌ కార్యాలయానికి చేరుకున్నారు. ఎన్నికైన అభ్యర్థులకు రక్షణ కల్పించాలని విజయవాడ సీపీని హైకోర్టు(high court) ఆదేశించింది. కొండపల్లి మున్సిపల్ ఫలితం మాత్రం ప్రకటించవద్దని... వివరాలను తమ ముందు ఉంచాలని ఆదేశించింది. మున్సిపాలిటీ పరిధిలో 144సెక్షన్ అమలవుతుందని పోలీసులు తెలిపారు.

హైకోర్టు ఆగ్రహం
వైకాపా నేతల వీరంగంతో రెండుసార్లు వాయిదా పడిన కృష్ణా జిల్లా కొండపల్లి పురపాలక చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక నేడు తప్పనిసరిగా పూర్తి చేయాల్సిన అనివార్యత ఏర్పడింది. ఈనెల 22 న నిర్వహించాల్సిన ఎన్నికను రిటర్నింగ్ అధికారి రెండుసార్లు వాయిదా వేయడాన్ని సవాల్‌ చేస్తూ తెదేపా కౌన్సిలర్లు, ఓ స్వతంత్ర అభ్యర్థి, తెదేపా ఎంపీ కేశినేని నాని దాఖలు చేసిన వ్యాజ్యంపై హైకోర్టు విచారణ జరిపింది. కోరం ఉన్నప్పుడు ఎన్నికను వాయిదా వేయడానికి వీల్లేదని.. వైకాపా కౌన్సిలర్లు అవరోధం కల్పిస్తున్నారనే కారణంతో రిటర్నింగ్‌ అధికారి ఎన్నికను వాయిదా వేశారని పిటిషనర్‌ తరపు న్యాయవాది పేర్కొన్నారు. ఆర్వో శివనారాయణరెడ్డి తీరుపై న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. మంగళవారంనాటి విచారణకు అత్యవసరంగా పిలిపించిన ధర్మాసనం ఆర్వోకు పలు ప్రశ్నలు సంధించింది. అడ్డుకుంటున్నారని ఎన్నిసార్లు ఎన్నికను వాయిదా వేస్తారని ప్రశ్నించింది. భవిష్యత్తులో ఇంకోదానికి అనుమతించబోమని(kondapally municipal elections news) అంటే దానికీ అంగీకరిస్తారా.. అని ఆర్వోపై మండిపడింది.

పార్టీల బలాలు

కొండపల్లి మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 29 వార్డులు ఉండగా... ప్రస్తుతం తెదేపా శిబిరంలో 15, వైకాపా శిబిరంలో 14మంది కౌన్సిలర్ల బలం ఉంది. తెదేపా ఎంపీ కేశినేని నాని, వైకాపా ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ తమ ఎక్స్ అఫిషియో ఓట్లు వినియోగించుకున్నారు. ఎక్స్ అఫిషియో ఓట్లతో కలిపి తెదేపాకు 16, వైకాపాకు 15 మంది సభ్యుల బలం ఏర్పడింది.

ఇదీ చదవండి:

Kesineni on Kondapalli: కోర్టు ఆదేశాలు మరిచి ఎన్నిక వాయిదా వేశారు: కేశినేని నాని

Last Updated :Nov 24, 2021, 1:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.