Flood help: వరద బాధితులకు అరకొర సాయం.. గతంలో ఇచ్చిన వాటికే కోత

author img

By

Published : Aug 5, 2022, 5:11 AM IST

Flood help

Flood help: వరద బాధిత కుటుంబాలకు ప్రభుత్వ సాయం అరకొరగానే అందుతోంది. అధిక శాతం విపత్తు నష్టాలకు ఏడున్నరేళ్ల కిందట నిర్ణయించిన సాయాన్నే ఇప్పుడూ ఇస్తున్నారు. కొన్నింటికి కోత పెట్టారు. బాధితులకిచ్చే నిత్యావసరాలనూ తగ్గించేశారు. వంటపాత్రలు, దుస్తులకు రూ.4వేలు ఇవ్వాల్సి ఉన్నా.. పైసా అందలేదు. అదేమంటే సీఎం జగన్‌ చెప్పినట్లు రూ.2వేలు చేతిలో పెడుతున్నాం కదా? అనే సమాధానం వస్తోంది.

Flood help: వరద బాధిత కుటుంబాలకు ప్రభుత్వ సాయం అరకొరగానే అందుతోంది. అధిక శాతం విపత్తు నష్టాలకు ఏడున్నరేళ్ల కిందట నిర్ణయించిన సాయాన్నే ఇప్పుడూ ఇస్తున్నారు. కొన్నింటికి కోత పెట్టారు. బాధితులకిచ్చే నిత్యావసరాలనూ తగ్గించేశారు. వంటపాత్రలు, దుస్తులకు రూ.4వేలు ఇవ్వాల్సి ఉన్నా.. పైసా అందలేదు. అదేమంటే సీఎం జగన్‌ చెప్పినట్లు రూ.2వేలు చేతిలో పెడుతున్నాం కదా? అనే సమాధానం వస్తోంది. సాయం విషయంలో ఏటికేడాది పెరుగుతున్న ఖర్చులు, పంట పెట్టుబడులను పరిగణనలోకి తీసుకోవడం లేదు. హుద్‌హుద్‌, తిత్లీ సమయాల్లో ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేసి బాధితులకు యుద్ధప్రాతిపదికన సాయమందించారు. ఇప్పుడు వరదపోయి వారమవుతున్నా నష్టం లెక్కలే తేల్చలేదు.

ప్రకృతి విపత్తులకు సంబంధించి కేంద్ర నిబంధనల మేరకు సాయమందిస్తారు. 2010-2015 కాలానికి కేంద్రం నిర్ణయించిన సాయం తక్కువే. దీంతో 2014 హుద్‌హుద్‌ సమయంలో అప్పటి సీఎం చంద్రబాబు.. రాష్ట్రం తరఫున సాయం పెంచుతూ ఉత్తర్వులిచ్చారు. పంటలకు పెట్టుబడి రాయితీనుంచి ఇళ్లు దెబ్బతిన్నవారికి, పడవలు కోల్పోయినవారికి.. పశువులు, కోళ్ల నష్టానికి ఇచ్చే ఆర్థిక సాయం పెంచారు. 2015-20 కాలానికి కేంద్ర సాయం మరికొంత పెరిగినా, అప్పటికే రాష్ట్రం ప్రకటించిన దానికంటే తక్కువే. దీంతో 2018 తిత్లీ తుపాను సమయంలో బాధితులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరింత పెంచింది.పొలాల్లో చెట్లను ఉచితంగా తొలగించడంతోపాటు దెబ్బతిన్న ఇళ్లకు ఉచితంగా రేకులు ఇచ్చారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సీఎం జగన్‌ కూడా 2019లో కొబ్బరి చెట్టుకు రూ.3వేలు, జీడిమామిడికి ఎకరాకు రూ.50 వేలు చేశారు.

* వరద బాధితులను ఉదారంగా ఆదుకోవాలి.. భారీ వర్షాలు, వరదలు ముంచెత్తినప్పుడు ముఖ్యమంత్రి జగన్‌ చెప్పే మాట ఇది. అయితే 2014 హుద్‌హుద్‌, 2018 తిత్లీ తుపాను సమయాల్లో అందిన మేర సాయమూ బాధిత కుటుంబాలకు దక్కడం లేదు. సరికదా కొన్నింటిలో కోత పెట్టేశారు.

*తెదేపా హయాంలో వరికి పెట్టుబడి రాయితీగా ఇచ్చే మొత్తాన్ని హుద్‌హుద్‌ సమయంలో ఎకరానికి రూ.4వేల నుంచి రూ.6వేలు పెంచారు. తిత్లీ సమయంలో దీన్నే రూ.8వేలకు పెంచారు. అరటి పెట్టుబడి రాయితీని ఎకరాకు రూ.9,600నుంచి హుద్‌హుద్‌లో రూ.10వేలు, తిత్లీ సమయంలో రూ.12వేలకు పెంచారు.

పంటలకు న్యాయమైన సాయమా?:
మూడేళ్లుగా నష్ట తీవ్రత ఏటికేడాది పెరుగుతూనే ఉంది. అయినా అధిక శాతం పంటలకు 2014లో నిర్ణయించిన విధంగానే పెట్టుబడి రాయితీ ఇస్తున్నారు. ఎకరాకు పత్తి, వేరుసెనగ, చెరకు, మిరప తదితర పంటలకు రూ.6వేలు, మొక్కజొన్నకు రూ.5వేలు, ఆముదం, జొన్న, ఇతర చిరుధాన్యాలకు రూ.2,720, కంది, మినుము ఇతర పప్పుధాన్యాల పంటలకు రూ.4వేల చొప్పునే అందుతున్నాయి. కోతకు గురైన పంట పొలాలకు కేంద్ర నిబంధనల మేరకే ఎకరానికి రూ.15వేలు, మేట వేసిన పొలాలకు రూ.4,880 ఇస్తున్నారు. మొన్నటి వరదలకు 6జిల్లాల్లో వ్యవసాయ, ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి. నష్ట తీవ్రత అధికంగా ఉందన్నది గుర్తించడం లేదు.

మృతుల కుటుంబాలకు అదనంగా..!
విపత్తు సమయంలో మృతి చెందిన వారి కుటుంబాలకు 2014 ముందు రూ.లక్షన్నర చొప్పున పరిహారం నిర్ణయించారు. హుద్‌హుద్‌ సమయంలో దీన్ని రూ.5 లక్షలు చేశారు. తిత్లీ సమయంలోనూ ఇంతే ఇచ్చారు. గోదావరి వరదల్లో చనిపోయిన వారి కుటుంబాలకు రూ.4లక్షల చొప్పున (కేంద్ర నిబంధనల ప్రకారం) సాయమిచ్చారు. ఆ కుటుంబాలకు సీఎంఆర్‌ఎఫ్‌ కింద మరో రూ.6లక్షల సాయానికి ప్రతిపాదిస్తున్నారు.

ఏటా దెబ్బమీద దెబ్బ
వాస్తవానికి వారం, పది రోజులపాటు ఇల్లు, పొలాలు వరదలో మునిగితే ఆ కుటుంబం సర్వం కోల్పోయినట్లే. రెండు మూడేళ్లపాటు కోలుకోలేరు. మూడేళ్లుగా గోదావరి తీరంలోని వందలాది గ్రామాల ప్రజలకు దెబ్బమీద దెబ్బ తగులుతోంది. ఒక పంట కాలంలోనే 2,3 సార్లు మునిగిపోతున్నా ఆయా కుటుంబాల అతీగతీ పట్టించుకోవడం లేదు. అప్పు తెచ్చి పెట్టుబడి పెట్టడం, అంతలోనే వరదొచ్చి ఊడ్చేస్తుండటంతో వేలాది కుటుంబాల ఆర్థిక పరిస్థితి తల్లకిందులవుతోంది. అయినా ప్రభుత్వ సాయం పెంపుపై దృష్టి సారించడం లేదనే ఆవేదన బాధితుల్లో వ్యక్తమవుతోంది.

రాయితీ

* వైకాపా ప్రభుత్వం వచ్చాక సాయం మరింత పెరుగుతుందని రైతులు ఆశించారు. పెంచకపోగా తిత్లి సమయంలో ఇచ్చిన సాయాన్నే తగ్గించి 2014లో హుద్‌హుద్‌ వచ్చినప్పుడు ఇచ్చిన సాయాన్నే అందిస్తున్నారు. అరటి రైతులకు ఎకరానికి రూ.10వేలు, వరి రైతులకు ఎకరానికి రూ.6వేలు మాత్రమే ఇస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో ఇచ్చినంత కూడా ఇవ్వడం లేదు. చిరుధాన్యాలకు ఎకరానికి పెట్టుబడి రాయితీగా ఇచ్చే రూ.2,720 చూస్తే.. ఒక సాలు నాగలి, గొర్రు తోలించడానికీ చాలదు.

* హుద్‌హుద్‌, తిత్లీ సమయాలలో తెదేపా ప్రభుత్వం.. బాధిత కుటుంబాలకు 25కిలోల బియ్యం, 5లీటర్ల కిరోసిన్‌, 2కిలోల చొప్పున కందిపప్పు, ఉల్లి.. 3కిలోల బంగాళాదుంపలు, లీటరు పామోలిన్‌, కిలో పంచదార, అరకిలో చొప్పున కారం, ఉప్పు ఇచ్చింది. చేనేతలు, మత్స్యకారులకు ఈ నిత్యావసరాలతోపాటు 50కిలోల బియ్యం ఇచ్చింది. పెథాయ్‌ తుపాను సమయంలోనూ బాధిత కుటుంబానికి 50కిలోల బియ్యం ఇచ్చింది. వైకాపా ప్రభుత్వం వచ్చాక నిత్యావసరాలకు కోత పెట్టింది. మొన్నటి గోదావరి వరదల్లో బాధిత కుటుంబాలకు 25కిలోల బియ్యం, కిలో చొప్పున కందిపప్పు, ఉల్లి, బంగాళాదుంపలు.. లీటరు చొప్పున పామోలిన్‌, పాలు ఇచ్చింది. గతంతో పోలిస్తే కిలో కందిపప్పు, రెండు కిలోల బంగాళాదుంపలు, కిలో పంచదార, కిలో ఉల్లి, అరకిలో చొప్పున కారం, ఉప్పులో కోత పెట్టింది. కిరోసిన్‌ పంపిణీయే లేదు. కొత్తగా పాలు అందించింది. 2019 ఆగస్టు వరదల సమయంలో వారంపాటు ఇల్లు మునిగిన వారికి ప్రత్యేకసాయం కింద కుటుంబానికి రూ.5వేలు ఇవ్వాలని ఉత్తర్వులిచ్చిన ప్రభుత్వం.. తర్వాత దాన్ని తానే అటకెక్కించింది. రూ.2వేలు మాత్రమే ఇస్తోంది.

ఇవీ చదవండి: ఎంపీ గోరంట్ల మాధవ్ నగ్న వీడియో.. తెదేపా నేతల ఆగ్రహం

దేశవ్యాప్తంగా 4.24 కోట్ల కేసులు పెండింగ్‌.. సుప్రీంలోనే 71వేలు..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.