'ఏపీ' ఎటు పోతోంది? నో డిజిటల్ పేమెంట్స్ - ఓన్లీ క్యాష్ అంటున్న సర్కారు
Published: Nov 13, 2023, 1:37 PM


'ఏపీ' ఎటు పోతోంది? నో డిజిటల్ పేమెంట్స్ - ఓన్లీ క్యాష్ అంటున్న సర్కారు
Published: Nov 13, 2023, 1:37 PM

No Digital Paments Only Cash : ఇంటింటికీ తిరిగి కూరగాయలు అమ్ముకునే అక్షర జ్ఞానం లేని గ్రామీణ మహిళలు మొదలుకుని.. వీధి చివర బడ్డీ కొట్లలోనూ ఇప్పుడంతా డిజిటల్ చెల్లింపులే. ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం... యూపీఐ ద్వారా నగదు మార్పిడి దేశవ్యాప్తంగా మారుమూల పల్లెలకూ విస్తరించింది. 2020 సంవత్సరంలో దేశవ్యాప్తంగా జరిగిన 2,550 కోట్ల డిజిటల్ లావాదేవీలు ఇండియాను అగ్ర స్థానంలో నిలిపాయి. మరి, దాదాపు పాతికేళ్ల కిందటే ఐటీ పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకున్న ఏపీ మాత్రం.. 'ఓన్లీ క్యాష్' అంటోంది. వైసీపీ సర్కారు.. డిజిటల్ చెల్లింపులను మినహాయిస్తూ క్యాష్ చేసుకుంటోంది.
No Digital Paments Only Cash : ఈ మధ్య కాలంలో నగదు చెలామణీ 90శాతానికి పడిపోయింది. పర్సు మర్చిపోయినా, అది ఖాళీగా ఉన్నా... మొబైల్ ఉంటే చాలు.. డిజిటల్ పేమెంట్స్తో అన్ని పనులు జరిగిపోతున్నాయి. ప్రభుత్వ సర్వీసులు, వెబ్సైట్లలోనూ డిజిటల్ చెల్లింపులు సర్వసాధారణమయ్యాయి. అంతటా ఇదే పరిస్థితి.. ఒక్క ఏపీలో తప్ప!. రాష్ట్రంలో మద్యం దుకాణాల్లో డిజిటల్ చెల్లింపులు ఎత్తేసిన ప్రభుత్వం.. ఇప్పుడు ఆర్టీసీలోనూ మంగళం పాడింది. రిజర్వేషన్ కౌంటర్లలో 'ఓన్లీ క్యాష్' అనే బోర్డులు దర్శనమిస్తుండడంతో ప్రయాణికులు షాక్ అవుతున్నారు.
బస్ ఎక్కాలంటే ఏటీఎం కేంద్రానికి వెళ్లాల్సిందే... విజయవాడ నెహ్రూ బస్ స్టేషన్ (Nehru Bus Station) నుంచి నిత్యం వేలాది అంతర్రాష్ట్ర బస్ సర్వీసులు, లక్షలాది మంది ప్రయాణికుల రాకపోకలు కొనసాగుతుంటాయి. పొరుగు రాష్ట్రానికి చెందిన అంతర్రాష్ట్ర బస్సుల్లో కండకర్లు సైతం డిజిటల్ పేమెంట్స్ ద్వారా ప్రయాణికులకు టికెట్లు ఇస్తున్నారు. అక్కడి ప్రభుత్వం దాదాపు అన్ని బస్సుల్లోనూ 'టిమ్స్' యంత్రాలను అందించి సిబ్బందికి ప్రత్యేకంగా శిక్షణ కూడా ఇచ్చింది. దీంతో చిల్లర సమస్యకు చెక్ పడగా.. టికెట్లు జారీ చేయడం సులభతరమైంది. కానీ, ఏపీలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. బస్సుల్లో కాదు కదా కనీసం రిజర్వేషన్ (Reservation) కౌంటర్లలోనూ డిజిటల్ పేమెంట్స్ కరువయ్యాయి. ఆసియాలో అతి పెద్దదైన విజయవాడ బస్టాండ్లో ఆన్లైన్ పేమెంట్ కరవైపోయింది. ఏడాదిన్నర నుంచి డిజిటల్ సేవలను యాజమాన్యం నిలిపివేసింది. టికెట్ బుకింగ్ (Ticket booking) కౌంటర్లలో నగదు సేవలు మాత్రమే కల్పిస్తున్నారు. ఆన్లైన్ పేమెంట్ లేక ప్రయాణికులు దగ్గర్లోని ఏటీఎం కేంద్రాలకు పరుగు తీస్తున్నారు. ఆర్టీసీ వెబ్సైట్లో కూడా డిజిటల్ పేమెంట్లు తరచూ విఫలమవుతుండడంతో ప్రయాణికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
సిబ్బంది, ప్రయాణికుల ఆందోళన పట్టించుకోని ఆర్టీసీ యాజమాన్యం... డిజిటల్ పేమెంట్ సదుపాయం పెట్టి కౌంటర్లు పెంచాలని ప్రయాణికులు కోరుతున్నా.. ఆర్టీసీ ఉన్నతాధికారులు అస్సలు పట్టించుకోవడం లేదు. డిజిటల్ పేమెంట్లు పని చేయక చాలామంది ప్రయాణికులు తెలంగాణ బస్సులు, ప్రైవేటు ట్రావెల్స్ను ఆశ్రయిస్తున్నారు. దీనివల్ల ప్రయాణికుల సంఖ్య తగ్గిపోయి ఆదాయం పడిపోయింది. ఆక్యుపెన్సీ రేషియో గణనీయంగా తగ్గిపోయి సంస్థకు నష్టం వస్తోందని సిబ్బంది కూడా వాపోతున్నారు.
మద్యం దుకాణాల్లో క్యాష్ కిక్కు.. ఆర్టీసీ పరిస్థితి ఇలా ఉంటే.. రాష్ట్ర వ్యాప్తంగా మద్యం దుకాణాల్లోనూ ఇప్పటికీ నగదు లావాదేవీలే కొనసాగుతున్నాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి.. కొద్ది రోజుల క్రితం పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో మద్యం దుకాణంలోకి వెళ్లి లావాదేవీలపై ఆరా తీశారు. అప్పటికే దాదాపు లక్ష రూపాయల సరుకు అమ్మగా.. కేవలం 700రూపాయలు డిజిటల్ పేమెంట్స్ (Jital Payments) జరిగినట్లు గుర్తించారు. అంటే.. రూ.99,300 (99.3%) ఎలాంటి బిల్లులు, ఆధారాలు లేకుండా జీరో దందా కొనసాగిస్తున్నారని తేలిపోయింది. ఈ పరిస్థితి ఒక్క నరసాపురంలోనే కాదు.. రాష్ట్ర వ్యాప్తంగా 3,708 మద్యం దుకాణాల్లో (Liquor stores) ఇదే దోపిడీ కొనసాగుతోందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. వాస్తవానికి మద్యపాన నిషేధమని ఓట్లు దండుకున్న వైసీపీ.. అంచనాలకు మించి మద్యం పారిస్తున్నట్లు ఈ లెక్కలు స్పష్టం చేస్తున్నాయి.
