"జగన్ కళకళ.. ప్రజలు విలవిల".. టీడీపీ శాసనసభా పక్షం నిరసన
Published: Mar 16, 2023, 11:37 AM


"జగన్ కళకళ.. ప్రజలు విలవిల".. టీడీపీ శాసనసభా పక్షం నిరసన
Published: Mar 16, 2023, 11:37 AM
MLA BALAKRISHNA VISITS ROADS IN AMARAVATI : రాజధాని కోసం భూములిచ్చిన రైతులు.. దాని కోసం పోరాటం చేయాల్సి రావడం దురదృష్టకరమని హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైందంటూ సచివాలయం అగ్నిమాపక కేంద్రం వద్ద తెలుగుదేశం శాసనసభా పక్షం నిరసన వ్యక్తం చేసింది. ఇందులో బాలకృష్ణ పాల్గొన్నారు.
MLA BALAKRISHNA VISITS ROADS IN AMARAVATI : రాజధానిగా వెలుగొందాల్సిన అమరావతి ప్రాంతంలోని రహదారులను చూస్తుంటే బాధేస్తోందంటూ హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. భూములిచ్చిన అన్నదాతలు తమ హక్కుల కోసం పోరాటం చేయాల్సి రావటం దురదృష్టకరమని తెలుగుదేశం నేతలతో ఆయన వ్యాఖ్యానించారు. అసెంబ్లీకి హాజరయ్యేందుకు ఈ ఉదయం వెలగపూడికి వచ్చిన బాలకృష్ణ మందడం గ్రామ రైతులతో కలిసి రహదారులను పరిశీలించారు.
అసెంబ్లీకి ఎదురుగా దెబ్బతిని ఉన్న ఇన్నర్ రింగ్ రోడ్డు రహదారిని పరిశీలించిన బాలకృష్ణ.. అక్కడ పెరిగిన ముళ్ల చెట్లు, తవ్విన రహదారులను పరిశీలించారు. అనంతరం తెలుగుదేశం నేతలు చేస్తున్న నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. బాలకృష్ణతో ఫొటో దిగేందుకు పోలీసులు పోటీపడ్డారు. పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ఆప్యాయంగా పలకరించి తాజా రాజకీయాలపై వారితో చర్చించారు.
మన ప్రాంతంలో ఎమ్మెల్సీ ఎన్నిక బాగా జరిగిందంటూ బీటీ నాయుడుతో అన్నారు. విశాఖలో ఇటీవల 13 లక్షల కోట్ల ఒప్పందాలు జరిగాయని ప్రభుత్వం ప్రకటించింది కదా అన్న బాలకృష్ణ.. వాటిల్లో విశ్వసనీయత ఎంత, స్థాపించేవి ఎన్ని అంటూ ముచ్చటించారు. అనంతరం తెలుగుదేశం నేతలు చేస్తున్న నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ఆప్యాయంగా పలకరించి తాజా రాజకీయాలను వారితో చర్చించారు.
సచివాలయం అగ్నిమాపక కేంద్రం వద్ద టీడీపీ శాసనసభా పక్షం నిరసన: రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైందంటూ సచివాలయం అగ్నిమాపక కేంద్రం వద్ద తెలుగుదేశం శాసనసభా పక్షం నిరసన వ్యక్తం చేసింది. ఏపీలో "దివాళా బడ్జెట్" అంటూ బ్యానర్లను ప్రదర్శించారు. "జగన్ రెడ్డి కళ కళ.. ప్రజలు విలవిల" అంటూ నేతలు ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు. ఆర్థికఎమర్జెన్సీ ప్రకటించే దిశగా ఆంధ్రప్రదేశ్ పయనిస్తోందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు ఆరోపించారు.
"ఆర్థిక ఎమర్జెన్సీ ప్రకటించే దిశగా ఏపీ పయనిస్తోంది. నాలుగేళ్లలో రాష్ట్రానికి పదిన్నర లక్షల కోట్లు ఆదాయం వచ్చింది. పేదల సంక్షేమానికి లక్షన్నర కోట్లే ఖర్చు పెట్టామన్నారు.. మిగిలిందేమైంది?. నాలుగేళ్లలో 9 లక్షల కోట్లు పైచిలుకు అప్పులు చేశారు?. ఏపీని జగన్ అప్పుల రాష్ట్రంగా మార్చారు"-అచ్చెన్నాయుడు
4 ఏళ్లలో రాష్ట్రానికి పదిన్నర లక్షల కోట్ల రూపాయలు ఆదాయం వచ్చిందని.. పేదల సంక్షేమానికి లక్షన్నర కోట్లు మాత్రమే ఖర్చు పెట్టినట్లు ప్రభుత్వం చెప్తోందని మిగిలిన ఆదాయం ఏమైందని ప్రశ్నించారు. 4 ఏళ్లలో 9లక్షల కోట్లు పై చిలుకు అప్పులు చేశారని, అప్పుల అప్పారావులా తయారైన జగన్మోహన్ రెడ్డి ఏపీని అప్పుల రాష్ట్రంగా మార్చారని దుయ్యబట్టారు. ప్రతీ 100మందిలో 47మందిపై అప్పు ఉందంటే రాష్ట్రాన్ని ఎటు తీసుకుపోతున్నారని మండిపడ్డారు. నిరసనలో హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పాల్గొన్నారు.
ఇవీ చదవండి:
