"ఆపరేషన్​ సక్సెస్​.. పేషెంట్​ డెడ్​" అన్నట్లుగా ఆంధ్రప్రదేశ్​ బడ్జెట్​: టీడీపీ నేతలు

author img

By

Published : Mar 16, 2023, 2:12 PM IST

TDP LEADERS COMMENTS ON 2023-24 BUDGET

TDP LEADERS COMMENTS ON 2023 24 BUDGET : రాష్ట్ర బడ్జెట్​ వల్ల రాష్ట్రంలో ఏ ఒక్కరూ సంతోషంగా లేరని టీడీపీ నేతలు విమర్శించారు. బడ్జెట్​లో వాస్తవాలు లేవని అడిగితే తెలుగుదేశం సభ్యుల్ని సస్పెండ్ చేశారని ఆయన ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన చిట్ట చివరి బడ్జెట్ కూడా మోసపూరితమేనని విమర్శించారు.

"ఆపరేషన్​ సక్సెస్​.. పేషెంట్​ డైడ్​" అన్నట్లుగా ఆంధ్రప్రదేశ్​ బడ్జెట్

TDP LEADERS COMMENTS ON 2023-24 BUDGET : ప్రభుత్వం 2లక్షల 79వేల కోట్ల రూపాయల బడ్జెట్​ ప్రవేశపెట్టినా.. రాష్ట్రంలో ఏ ఒక్కరూ సంతోషంగా లేరని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విమర్శించారు. బడ్జెట్​లో వాస్తవాలు లేవని అడిగితే తెలుగుదేశం సభ్యుల్ని సస్పెండ్ చేశారని ఆయన ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన చిట్ట చివరి బడ్జెట్ కూడా మోసపూరితమేనని విమర్శించారు. ఘనంగా కేటాయింపులు చూపుతూ.. ఖర్చు మాత్రం భూతద్దంలో వెతికినా కనిపించని విధంగా ఉన్న గత బడ్జెట్​ల నుంచి గుణపాఠాలు నేర్చుకోలేదని విమర్శించారు.

శస్త్ర చికిత్స విజయవంతం.. రోగి మృతి అన్నట్లుగా బడ్జెట్​ను రూపొందించారని అచ్చెన్నాయుడు ఆక్షేపించారు. కమీషన్ల కోసమే సాగు నీటి రంగానికి 22వేల కోట్ల రూపాయల కేటాయింపులు చూపారన్నారు. ముఖ్యమంత్రి జగన్​ మోహన్​రెడ్డి ప్రారంభించిన 2 ప్రాజెక్టులు టీడీపీ ప్రభుత్వ హయాంలో 90శాతం పనులు పూర్తి చేసుకున్నవేనని స్పష్టం చేశారు. 6 లక్షల పై చిలుకు ఉద్యోగాలు కల్పించినట్లు సిగ్గు లేకుండా అసత్యాలు చెప్పారని అచ్చెన్నాయుడు మండిపడ్డారు.

ఆర్ధిక క్రమశిక్షణ లేని బడ్జెట్​ను రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్​ రెడ్డి ప్రవేశపెట్టారని తెలుగుదేశం పార్టీ శాసనసభ పక్ష ఉప నేతలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, నిమ్మల రామానాయుడు విమర్శించారు. జగన్ పాలన మోనార్కిజంలా సాగుతోందని మండిపడ్డారు. రాష్ట్రానికి వచ్చే ఆదాయం ఎంతో, పెట్టే ఖర్చు ఎంతో చెప్పలేని పరిస్థితుల్లో బడ్జెట్ ప్రవేశపెట్టారని ఆరోపించారు.

అప్పుల శాఖ మంత్రిగా బుగ్గన పేరు: అప్పులు పుట్టించుకోవటం కోసం ప్రజల్ని మోసగిస్తున్నారన్నారు. కేంద్ర ప్రాయోజిత పథకాలకు మ్యాచింగ్ గ్రాంట్లు ఇవ్వకపోవడంతో అవి నిర్వీర్యమైపోతున్నాయని విమర్శించారు. అసెంబ్లీలో ఎమ్మెల్యేల కోసం నడిచే ఆసుపత్రికే నిధులు లేక మందులు ఇవ్వట్లేదంటే, ఇక ప్రభుత్వ ఆసుపత్రుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. బుగ్గన ఆర్థిక శాఖ మంత్రిగా కంటే అప్పుల శాఖ మంత్రిగా పేరు తెచ్చుకున్నారన్నారని ఎద్దేవా చేశారు.

ప్రభుత్వం చేసిన 2 లక్షల 79వేల కోట్ల అప్పు ఎవరి జేబుల్లోకి వెళ్లిందో సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. వ్యవసాయ రంగంలో చూపిన కేటాయింపులకు తగ్గట్టు ఖర్చులు లేకనే రైతులు పంటల విరామం ప్రకటిస్తున్నారని గుర్తు చేశారు. 3రాజధానులకు 3 ఇటుకలు కూడా పెట్టకుండా అమరావతిని అటకెక్కించారని నేతలు దుయ్యబట్టారు.

అసెంబ్లీలో బడ్జెట్​ ప్రవేశపెట్టడానికి కొంత సమయం ముందు సచివాలయం దగ్గర ఉన్న అగ్నిమాపక కేంద్రం వద్ద తెలుగుదేశం ఎమ్మెల్యేలు నిరసన చేపట్టారు. దివాళా బడ్జెట్​ అంటూ ఫ్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు. ఏపీని ముఖ్యమంత్రి జగన్​ అప్పుల రాష్ట్రంగా మార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్​ ఆర్థిక ఎమర్జెన్సీ ప్రకటించే దిశగా పయనిస్తోందని ఆరోపించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.