ఓట్ల తొలగింపు, దొంగ ఓట్ల చేర్పులపై ఈసీకి టీడీపీ ఫిర్యాదు

ఓట్ల తొలగింపు, దొంగ ఓట్ల చేర్పులపై ఈసీకి టీడీపీ ఫిర్యాదు
TDP Complaint to CEC Against Bogus Votes: రాష్ట్రంలో అధికార పార్టీ ఓట్ల దొంగ ఓటపై తెలుగుదేశం బృందం.. కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. అచ్చెన్నాయుడు నేతృత్వంలో టీడీపీ నేతల బృందం దిల్లీలోని ఈసీని కలిసింది. మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఆ పార్టీ నేతల రాజకీయ ఒత్తిళ్లతో ఓట్ల అక్రమాలకు పాల్పడుతున్నారని టీడీపీ నేతలు ఆరోపించారు. ఈసీ ఆదేశాలను స్థానిక అధికారులు పాటించడం లేదని టీడీపీ నేతలు పేర్కొన్నారు.
TDP Complaint to CEC Against Bogus Votes: దిల్లీలో ఈసీ అధికారులతో అచ్చెన్నాయుడు నేతృత్వంలో టీడీపీ నేతలు కనకమేడల రవీంద్రకుమార్, యనమల రామకృష్ణుడు, పయ్యావుల కేశవ్, నిమ్మల రామానాయుడు, బొండా ఉమ సమావేశమయ్యారు. ఓట్ల తొలగింపు, చేర్పు ప్రక్రియలో జరుగుతున్న అక్రమాలను ఎన్నికల అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఎన్నికల అధికారులను కలిసిన అనంతరం.. టీడీపీ నేతలు మీడియాతో మాట్లాడారు. టీడీపీ సానుభూతిపరుల ఓట్లు తొలగిస్తున్నారని ఈసీ దృష్టికి తీసుకువచ్చామని తెలిపారు. రాజకీయ ఒత్తిళ్లతో తప్పుడు ఓటర్ల జాబితా తయారుచేస్తున్నట్లు టీడీపీ నేతలు ఆరోపించారు. ఈసీ ఆదేశాలను రాష్ట్రంలోని అధికారులు పాటించట్లేదని టీడీపీ నేతలు తెలిపారు. గ్రామ సచివాలయ సిబ్బంది ప్రభుత్వ ప్రచారంలో పాల్గొంటున్నారని.. సచివాలయ సిబ్బందిని బీఎల్వోలుగా నియమిస్తున్నారని తెలిపారు. వైసీపీ జెండాలతో ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేస్తున్నారని ఈసీ దృష్టికి తీసుకువచ్చినట్లు తెలిపారు. గ్రామ సచివాలయ సిబ్బందిని ఎన్నికలకు దూరంగా ఉంచాలని కోరినట్లు తెలిపారు. తప్పనిసరిగా చర్యలు తీసుకుంటామని ఈసీ అధికారులు చెప్పారని టీడీపీ నేతలు వెల్లడించారు.
ఎలాంటి చర్యలు తీసుకోలేదు: వాలంటీర్ వ్యవస్థ ద్వారా టీడీపీ సానుభూతిపరుల ఓట్లు తొలగిస్తున్నారని అచ్చెన్నాయుడు ఆరోపించారు. ఒక వ్యక్తికి రెండు ఓట్లున్న జాబితా ఆధారాలతో ఇచ్చినా చర్యలు తీసుకోవడం లేదనే విషయాన్ని ఈసీ దృష్టికి తీసుకువచ్చినట్లు తెలిపారు. చనిపోయిన వ్యక్తుల ఓట్లు ఆధారాలతో ఇచ్చినా ఓట్లు తొలగించలేదని పేర్కొన్నారు. అక్టోబర్ 27 వరకు దేశవ్యాప్తంగా ఓటర్ల పరిశీలన కార్యక్రమం జరిగిందని వెల్లడించారు. కానీ, రాష్ట్రంలో మాత్రం ఓటర్ల పరిశీలన కార్యక్రమం జరగలేదని తెలిపారు. ఫారం 6, 7, 8 దరఖాస్తులపై రాష్ట్రంలో ఎలాంటి చర్యలు తీసుకోలేదంటూ టీడీపీ నేతలు తెలిపారు. ఒక కుటుంబంలోని వ్యక్తుల ఓట్లను వేర్వేరు బూత్లకు కేటాయించారని టీడీపీ నేతలు పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 160 పోలింగ్ కేంద్రాలు నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్నాయని ఆ పోలింగ్ కేంద్రాలపై చర్యలు తీసుకోలేదని పేర్కొన్నారు.
గ్రామ సచివాలయ వ్యవస్థ కనుసన్నల్లోనే: దేశంలో ఏ ఎన్నికలకైనా టీచర్లను వినియోగిస్తున్నారని.. రాష్ట్రంలో మాత్రం ఎన్నికల కోసం ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేశారని టీడీపీ నేతలు పేర్కొన్నారు. గ్రామ సచివాలయ వ్యవస్థ కనుసన్నల్లోనే ఎన్నికల ప్రక్రియ జరుగుతోందని ఆరోపించారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందని ఈసీకి చెప్పామన్నారు. వైసీపీ దివాలా అంచున ఉండి తమపై బురద జల్లుతోందని బొండా ఉమ ఆరోపించారు. ఓటర్ల జాబితాలో అనేక తప్పులు ఉన్నాయని పేర్కొన్నారు. వైసీపీ నేతలను ప్రజలు గ్రామాల్లోకి రానీయడం లేదని.. ప్రజల వ్యక్తిగత సమాచారం సేకరించే అలవాటు సజ్జలకే ఉందని తెలిపారు. తమ పార్టీకి ఆ అలవాటు లేదని బొండా ఉమ పేర్కొన్నారు.
